‘నిజం గడప దాటే లోపు.. అబద్ధం ప్రపంచమంతా చుట్టొస్తుంది’ అని నానుడి. అయినా కూడా ‘నిజం నిమ్మళంగనే బయటవడ్తది’ అన్నారు పెద్దలు. ఎందుకంటే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మనిషి మాట తప్పకూడదు, అబద్ధం అసలే చెప్పకూడదు. ఎప్పుడూ సత్యమే పలకాలని పెద్దలు అనుభవ పూర్వకంగా చాటిన సామెత.. ‘మాటకు సత్తెం మందుకు పత్తెం ఉండాలి’. పూర్వం నుంచీ మాటకే ఎక్కువ విలువ ఇచ్చారు. ఓ వ్యక్తి పలికే సత్యవాక్కులను బట్టే అతనికి సమాజంలో గౌరవం, మర్యాద, విలువ ఉంటాయి. మాట తప్పితే ‘అబద్ధాల కోరు’ అంటారు. పైగా.. అతను ఏదో ఓనాటికి నిజం చెప్పినా.. అదికూడా అబద్ధంగానే ప్రచారం అవుతుంది. ఓ మనిషి సత్యం పలకడం ఎంత ముఖ్యమో.. ఏదైనా రోగం వస్తే అందుకు తగిన పథ్యం చెయ్యడం కూడా అంతే ముఖ్యం. రోగానికి తగ్గట్లు వైద్యులు కొంత పథ్యం చెబుతారు. జబ్బు నయమయ్యే వరకూ కచ్చితంగా దాన్ని పాటించాలి. లేకపోతే వ్యాధి ముదిరి ప్రాణాంతకంగా మారొచ్చు.. ప్రాణాలే పోవచ్చు. కాబట్టి మనిషికి సత్యం, పథ్యం రెండూ ముఖ్యమే. ఈవిషయాన్ని గుర్తెరిగి వ్యవహరించాలి.
తీతువు రాయబారంతో ఏం ఫాయిదా?
ఇద్దరు బలవంతుల మధ్య సఖ్యత కుదిర్చేందుకు.. ఓ అల్పుడు, అసమర్థుడు చేసే ప్రయత్నాన్నే ‘తీతువు రాయబారం’ అంటారు. ఈ పదబంధానికి ఓ పిట్టకథ ఉంది. సముద్రానికి, గరుత్మంతుడికి తగాదా వస్తే.. మధ్యలో సంధి కుదిర్చేందుకు తీతువు పిట్ట రాయబారం నడిపిందంటారు. పోరాడుతున్న వాళ్లిద్దరూ చాలా బలవంతులు. మధ్యలో పిట్ట వెళ్తే దాన్నెవరు పట్టించుకుంటారు? అలా అని ఆ పిట్ట తన ప్రయత్నం మానకుండా ఆకాశానికి, సముద్రానికి మధ్యలో పైకీ, కిందికీ ఎగురుతూ తన భాషలో ‘తీతీ.. తీతీ’ అని అరుస్తూ అవిరామంగా తిరుగుతూనే ఉందట. ఎవరూ పట్టించుకోకపోయినా తన పని తాను చేస్తున్నదన్నట్లుగా. తాడూ, బొంగరం లేని పనిని నెత్తిన వేసుకొని, వారికి వీరికీ మధ్య ఊపిరాడకుండా తిరుగుతూ, ఏ కార్యమూ సాధించలేనప్పుడు ‘తీతువు రాయబారం’ అని వెక్కిరింతగా అంటారు. ఒకవేళ
ఉభయులూ రాజీపడ్డా కూడా తనకు ఆవగింజంత ప్రయోజనం లేని నిష్ఫల ప్రయాసను కూడా తీతువు రాయబారమనే అంటారు. అందుకే మనం ఓ పనికి సిద్ధపడే ముందు.. అది మనవల్ల అవుతుందా? కాదా? అనే ఆత్మవిమర్శ చేసుకోవాలి. వివేచన లేకుండా ముందు కెళ్తే.. అభాసుపాలు కావాల్సి వస్తుంది.
తలుచుకున్నప్పుడే తలంబ్రాలు కావాలంటే ఎట్ల?
అతి తొందర మనుషులు నిత్యం మనకు తారసపడుతూనే ఉంటారు. సందర్భం ఏదైనా కానీ, నచ్చిందే కావాలంటారు.. ఇష్టమైందే చేస్తామంటారు. అప్పటికప్పుడు అనుకున్నది అయిపోవాలని అనుకుంటారు. సరిగ్గా ఇలాంటివారిని ఉద్దేశించి జాన పదులు చెప్పిన సామెత ఇది. దేనికైనా సరైన సమయం రావాలనేది ఈ సామెత ఉద్దేశం. తలంబ్రాలు అనేవి శుభకార్యానికి సూచిక. ఏదైనా శుభకార్యం జరగాలంటే సమయం రావాలి. పెండ్లి చేయాలంటే.. పెండ్లీడు రావాలి. పెండ్లిచూపుల దగ్గర్నుంచి బంధుమిత్రులకు చెప్పడం, మంచి ముహూర్తం పెట్టడం.. ఆనక పెండ్లి తంతు. అలాంటిది అనుకోగానే పెండ్లి అయిపోవాలంటే అయిపోదు. ఒక్క పెండ్లనే కాదు.. శుభకార్యం ఏదైనా ఇలాంటి ప్రక్రియే ఉంటుంది. మనిషికి ఓపిక, సహనం చాలా అవసరం.
అర్థ వివరణ
1. కోడిమెడలేసుడు = వాడిపోయి నిస్సత్తువతో ఉండటం (పొద్దంతా ఏదన్న పనిజేత్తె సాలు.. మాపటేలకు కోడిమెడలేస్తడు. తిండి తినడు.. తానం చెయ్యడు)
2. తలె = కంచం, ప్లేటు (అన్నీ ఉన్న మారాజే గాని, తలెల బువ్వ తినే రాత లేదు. ఏందో ఆయన కర్మ!)
3. కన్కట్టు విద్య = ఇంద్రజాల విద్య (వామ్మో.. వానికి కన్కట్టు విద్యలొచ్చు. వాడిజోలికి పోవొద్దురయ్యా.. వంగుంటే అన్నీ మాయంజేస్తడు)
4. వర్గులు = ఎండబెట్టిన కూరగాయల ముక్కలు (ఉట్టిలోని వర్గులు అట్లనే బూజుపడ్తున్నయ్. జల్ది తొక్కువెట్టరాదు. కమ్మగ తినొచ్చు)
5. గొంతు కూసునుడు = గొంతు పట్టడం (పెరుగన్నంల నీళ్లు బోసుకొని తినమని ఎన్నిసార్లు చెప్పాల్రా.. మా అయ్యగూడ అట్లనే తిని గొంతు కూసొని సచ్చిండు)
…?డప్పు రవి
బొమ్మలు: మృత్యుంజయ్