‘కఠినంగా వ్యవహరించాలి! మహిళలకు భద్రత పటిష్ఠపరచాలి’ మణిపూర్లో హింసాత్మక ఘటనలు మొదలైన 79 రోజులకు ప్రధాని పలికిన పలుకులు ఇవి. అక్కడి బీజేపీ ప్రభుత్వం కాస్త బాధ్యతగా వ్యవహరించినా ఈ రోజు ప్రధాని మొసలికన్నీరు కార్చాల్సిన దుస్థితి వచ్చేది కాదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉన్న శాంతిభద్రతలపై డబుల్ ఇంజిన్లో ఏ ఒక్కటి దృష్టిసారించినా.. మణిపూర్ ముఖచిత్రం మునుపటిలాగే ఉండేది. చిన్నాచితకా విషయాలకే తీవ్ర భావోద్వేగాలకు గురయ్యే మోదీ.. ఆదివాసీ ఆడపిల్లలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై మాత్రం జాతి ఆశించిన స్థాయిలో స్పందించకపోవడం సిగ్గుచేటు!
గౌరవం ఎక్కడుంటుంది? అవమానం ఎలా జరుగుతుంది? ఇవి మనుషులందరికీ ఒకేలా ఉంటాయా? ఆడవాళ్లకీ, మగవాళ్లకీ వేరు వేరుగా ఉంటాయా? ఒకవేళ అలా ఉంటే ఆ గౌరవాన్ని ఇచ్చేదెవరు, పుచ్చుకునేదెవరు? అలాంటి గౌరవం ఎవరు, ఎక్కడ, ఎలా పొందుతారు, పోనీ కోల్పోతారు? ఒక మనిషి గౌరవాన్ని ఒక సమాజ గౌరవంగా భావించవచ్చా? ఒక వ్యక్తిని అవమానపరిస్తే, వారి పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తే ఒక వర్గం మొత్తాన్నీ కించపరిచినట్టో మలినపరిచినట్టో భావించవచ్చా? ఒకవేళ అదే అయితే ఆ వ్యక్తి స్త్రీ మాత్రమేనా? ఆమెకు జరిగే అవమానం.. ఆమె శరీరానికి జరిగే అన్యా యం ఆ వర్గం మీద చేసిన దాడిగా భావించి అవతలి సమూహం రాక్షసానందం పొందుతుందా? ఇష్టమో అయిష్టమో పక్కనపెడితే శారీరకంగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే లైంగిక చర్యలో ఒక వ్యక్తి పరువు పోతుంది. మరో వ్యక్తికి మాత్రం పరువు రెండింతలు అవుతుందా? అత్యాచారం చేసేవాడుపునీతుడు, ఆమె మాత్రం పాపపంకిలం అవుతుందా? ఇదేనా మన సమాజం మనకు నేర్పింది.
అలా అవుతుందని భావించబట్టే మొన్నటి మణిపూర్ అమానవీయ ఘటన జరిగిందని అనుకోవాలా? వర్గాలు, కులాలు, మతాలు.. వీళ్ల మధ్య వచ్చే విభేదాలు.. ఇందులో స్త్రీ పురుషుల పాత్ర సమానమైనదే అయి ఉండొచ్చు. కొట్లాటలు ఎవరి మధ్య అయినా జరిగి ఉండొచ్చు. మధ్యలో ఆడవాళ్లు చేసిన తప్పేమిటి? ముఖ్యంగా ఆ ఇద్దరు మహిళలూ చేసిన నేరం ఏమిటి? ఈ ఉన్మాదాల దారి నుంచి దూరంగా తల దాచుకుని ప్రాణం కాపాడుకోవడానికి పారిపోతున్నారే. అధికారిక అవసరాలూ, రాజకీయ ప్రయోజనాలూ తమ మీదకు తోసిన ఉత్పాతం నుంచి తప్పించుకుని దూరంగా జరిగిపోతే చాలనుకున్నారే. అలాంటి వాళ్ల మీద ఈ దాడి ఎంత అన్యాయం? పిల్లల తల్లినని వేడుకున్నా వదలకుండా చీరలాగి ఊరుతిప్పారే. మరో ఆడపిల్ల మీద పశువుల కన్నా హీనంగా మూకుమ్మడి దాడి చేశారే! ఈ రాక్షస మూకకి దొరికినప్పుడు… నూలు పోగు లేకుండా నలుగురి ముందూ నిలుచున్నప్పుడు…తెలియని చోటికి నడిపించుకుపోతున్నప్పుడు… తర్వాత జరగబోయేది అర్థమైనప్పుడు… ఆ మనసులెంత రోదించి ఉంటాయో కదా! ఈ ప్రాణాలు ఇప్పుడే పోతే బాగుండని కోరుకునే ఉంటాయి కదా! ఆ గుండెలు ఎంత భయపడి ఉంటాయో కదా! అసలు ఈ దేశంలో ఎందుకు పుట్టామని కుళ్లిపోయి ఉం టాయి కదా! అవును అధికారంలో ఉండి రక్షణ అందించాల్సిన బాధ్యతలో ఉన్నవాళ్లే ఇలాంటి భక్షకులతో చేతులు కలిపినప్పుడు ఎవరైనా అలాగే ఏడుస్తారు.
సిగ్గు సిగ్గు…: నలుగురి ముందూ మహిళ బట్టలిప్పితే పరువు పోతుందనీ, తద్వారా ఒక వంశాన్నో, ఒక వర్గాన్నో, ఒక రాజ్యాన్నో అవమాన పరచవచ్చన్న ఆలోచన మనకు ఐదువేల ఏండ్ల కిందదైన భారత కథలో కనిపించవచ్చు. మగధీరులమని చెప్పుకొని విర్రవీగి చివరికి కుక్కచావు చచ్చిన దుర్యోధన, దుశ్శాసనుల వంటివాళ్ల భావజాలంగా భావించవచ్చు. తనదంటూ ఏ దోషమూ లేకపోయినా అధికార పక్షానికి వైరివర్గపు మహిళ అయిన పాపాన కొన్ని వందల మంది బంధుగణం, రాజ్య జనం ఉన్న ఓ వేదిక మీద ఇదే తరహా తీవ్ర అవమానానికి గురయింది ఆనాటి ద్రౌపది. కానీ అలాంటి తుచ్ఛమైన ఆలోచనలు ఇరవై ఒకటో దశాబ్దంలోనూ ఉండటం శోచనీయం. అందులోనూ కేంద్ర రాష్ర్టాల్లోని రాజ్యాంగ పదవుల్లో ఉండి సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసమే అహర్నిశలూ బతుకుతున్నామని చెప్పే భారతీయ జనతా పార్టీలాంటి జాతీయవాద పార్టీలున్న ప్రాంతంలో ఈ తరహా ఘోర ఘటనలు జరగడం గర్హనీయం. మణిపూర్ రాష్ట్రంలో తమ వ్యతిరేక వర్గీయులైనందున ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడితే, ఆ వీడియోలు బయటికి రావడానికి రెండున్నర నెలలు పట్టింది.
సమాజం తలవంచుకునే ఈ అమానవీయ ఘటన గురించి శాంతిభద్రతలకు బాధ్యులైన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్పం దించడానికీ అంతకుమించి సమయం పట్టిందంటే, ఈ అంశం మీద వాళ్ల చిత్తశుద్ధి ఎంత ఉందో తేటతెల్లమవుతున్నది. అందులోనూ ఈ దాడులకు పాల్పడుతున్నది ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెం దిన వారవడం, పోలీసులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడంలాంటివి భారతదేశాన్ని ప్రపంచం ముందు తలదించుకునేలా చేస్తున్నాయి. పైగా ఇదే తరహా దారుణ ఘటనలు మరిన్ని జరిగాయని వస్తున్న నివేదికలు, బాధితుల వీడియోలు సభ్య సమాజాన్ని విస్తుపోయేలా చేస్తున్నాయి. బిల్కిస్ బానో కేసు, హథ్రాస్ అత్యాచా రం, కఠువా ఘటన.. ఇలా మహిళల మీద జరిగే దాడుల కేసులో భారతీయ జనతా పార్టీకి ఇదివరకే అంటిన మరకలు చాలానే ఉన్నా యి. తాము చేసే పనిలో ఒక వంక వెతికితేనో, తాము తీసుకున్న నిర్ణయాల్లోని తప్పులను ఎత్తిచూపితేనో వాళ్ల మీద దేశద్రోహ ముద్ర వేయడం కాషాయ పార్టీకి రివాజు. తమ మీదో, తమ భావజాలం మీదో వచ్చే వ్యతిరేకతను ఏకంగా భరతమాత మీద దాడిగా చిత్రీకరిస్తారు వీళ్లు. మరి అదే పార్టీ అదుపాజ్ఞల్లో ఉన్న మణిపూర్ రాష్ట్రంలో ఆడవాళ్లను బట్టలిప్పి తిప్పడాన్ని, అత్యాచారం చేయడాన్ని ఏమని సమర్థించుకుంటారు.. ఇది ఎవరి మీద దాడిగా చూపిస్తారు? తమ అధికార పరిధిలో ఆడపిల్లను వివస్త్రను చేస్తే పోయింది ఎవరి సిగ్గు. తలదించుకోవాల్సింది ఎవరు… మానం పోయిందని భావించాల్సిం ది నిజంగా ఆ మహిళలేనా… ఇవన్నీ ప్రశ్నించుకుంటే… వచ్చే సమాధానం.. సిగ్గు సిగ్గు!
-లక్ష్మీహరిత ఇంద్రగంటి