మానవ సమాజ పరిణామంలో వ్యవసాయానిది విశిష్ట పాత్ర. సింధూ లోయ నాగరికత నుంచి నేటి వరకూ ఇది కనిపిస్తుంది. ప్రజానీకానికి ఆహారాన్ని సమకూర్చే రైతులు.. తమ ఉనికికే సమస్య వచ్చినప్పుడు తిరగబడ్డారు కూడా. మన దేశ చరిత్రలో మోప్లా, సత్నామీ, మలబార్, తెభాగా, తెలంగాణ సాయుధ పోరాటం, నక్సలైట్ ఉద్యమం, ఇటీవల వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమం.. దీనికి ఉదాహరణలు. చారిత్రకంగా రైతులు నిర్వహించిన, నిర్వహిస్తున్న, నిర్వహించనున్న పాత్రను సమగ్రంగా అర్థం చేసుకున్నవారు కేసీఆర్.కాబట్టే రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. రాష్ట్ర బడ్జెట్ కూడా దీనికి అద్దం పడుతున్నది.
సుస్థిరాభివృద్ధి (ఎస్డీజీ) లక్ష్యాలను 2030 వరకు చేరుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్దేశించింది. వీటిలో పేదరిక నిర్మూలన, ఆకలి లేమి, ఆరోగ్యం, నాణ్యమైన విద్య- ఈ నాలుగింటిని అగ్రశ్రేణి లక్ష్యాలుగా పేర్కొన్నది. మొదటి రెండింటి సాధనకు వ్యవసాయరంగ అభివృద్ధి చోదకశక్తిగా పని చేస్తుంది. కృష్ణా, గోదావరి మన తలాపున పారుతున్నా వర్షాధార శుష్కప్రాంతంగా తెలంగాణను నాటి పాలకులు మార్చారు. 2014లో కేసీఆర్ అధికారం చేపట్టాక పేదరికం లేని, ఆకలి జాడలు కనిపించని తెలంగాణను సృష్టించటానికి ప్రతి బడ్జెట్లో వ్యవసాయం, సాగునీటి రంగాలకు అధిక భాగం నిధులు కేటాయించారు. ఆహార భద్రతకు, ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి ముడిసరుకు అందించడంతో పాటు పేదరికాన్ని తగ్గించడంలో సాగు రంగం కీలకమైనది. ప్రత్యేకంగా గ్రామీణ పేదరికం తగ్గుముఖం పట్టడానికి తోడ్పడుతుంది. అటువంటి వ్యవసాయానికి పెద్ద పీట వేశారు కేసీఆర్. ఫలితాలు కళ్ల ముందున్నాయి.
రాష్ట్రంలో రైతులు , శ్రామికుల ఆదాయం గణనీయంగా పెరిగింది. తలసరి ఆదాయం 3,17,115 రూపాయలకు చేరింది.ఇది జాతీయ సగటు కంటే 86 శాతం ఎక్కువ. భూమి పుత్రుడిగా, రైతుబిడ్డగా కేసీఆర్ సంపద, సంక్షేమ అర్థశాస్త్ర తాత్వికతను ఆవాహన చేసుకొని వ్యవసాయ విధానాల రూపకల్పనలో, ఆచరణలో, ఫలితాల సాధనలో విజయం సాధించారు.
ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు, సాగు నీటి రంగానికి రూ.26,885 కోట్లను కేటాయించారు. మూడో ప్రపంచ దేశాలకు అభివృద్ధి దిక్సూచిగా స్ఫూర్తి కలిగించే రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రుణమాఫీలకు రూ.23,049.64 కోట్లను కేటాయించారు. తెలంగాణను పసిడి పంటల మాగాణిగా మార్చే హరిత విప్లవాన్ని, పాడి పరిశ్రమ వృద్ధి కోసం శ్వేత విప్లవాన్ని, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి నీలి విప్లవాన్ని, మాంసం ఉత్పత్తిలో పింక్ విప్లవాన్ని, పౌల్ట్రీ వృద్ధి కోసం సిల్వర్ విప్లవాన్ని ఆరంభించి తెలంగాణ వినీలాకాశంలో ఇంద్రధనస్సును సృష్టిస్తున్న పాలకుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతున్నారు. గత 9 ఏండ్లలో ఈ రంగాలలో అసాధారణ పెరుగుదల చోటు చేసుకోవడమే దీనికి నిదర్శనం.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో మూడవది.. అన్ని వయసుల వారికి ఆరోగ్యకరమైన జీవనం. దీని ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఈ రంగానికి గణనీయమైన కేటాయింపులను చేస్తూ వస్తున్నది. భారత ప్రజారోగ్య ప్రమాణాల సంస్థ నిర్దేశించిన నిబంధనలను అనుసరించి రాష్ట్రంలో 4,797 హెల్త్ సెంటర్లు, 876 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 107 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సదుపాయాలను కల్పించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మి వంటి కార్యక్రమాలతో మాతాశిశు ఆరోగ్యానికి ప్రభుత్వ దవాఖానలు చిరునామాగా మారాయి. ఇప్పటికే మూడు లక్షలకు పైగా కేసీఆర్ కిట్లను అందించారు. ప్రభుత్వ దవాఖానలలో కాన్పులు ప్రైవేటు దవాఖాల్లో కాన్పుల కన్నా పెరిగిపోయాయి.
నవజాత శిశు మరణాలను, ప్రసూతి మరణాలను తగ్గించటంలో తెలంగాణ రికార్డులను నెలకొల్పింది. ఈ బడ్జెట్లో వైద్యారోగ్య రంగానికి రూ.12,161 కోట్లను కేటాయించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కాలుష్య రహిత వాతావరణం, స్వచ్ఛమైన తాగునీరు వంటివి ముఖ్యపాత్ర వహిస్తాయనేది తెలిసిందే. వీటికి తొలి నుంచీ సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణకు హరితహారం, మిషన్ భగీరథ. ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకున్న ఈ పథకాలకు ప్రస్తుత బడ్జెట్లో తగిన నిధులను కేటాయించారు.
సుస్థిరాభివృద్ధి నాలుగవ లక్ష్యం నాణ్యమైన విద్య. దీని కోసం ప్రతి బడ్జెట్లో దాదాపు 10 శాతం నిధులను కేటాయిస్తూ వస్తున్నారు. తొలి ఐదేండ్ల పాలనలో 596 గురుకులాలను ప్రారంభించిన కేసీఆర్ మలి విడుతలో వాటి సంఖ్యను వెయ్యికి పైగా పెంచారు. అవి అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్నాయి. ‘మన ఊరు-మన బడి’ ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుస్తున్నారు. విద్యకు ప్రాతిపదిక సూచీలైన 7-14 ఏండ్ల వయస్కుల అక్షరాస్యతలో 90.56 శాతాన్ని, 15-24 ఏండ్ల వయస్కుల్లో 86.97 శాతాన్ని నమోదు చేసి జాతీయ సగటు కంటే ఎక్కువ ప్రగతిని ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించింది. సర్వశిక్షా అభియాన్ 2022 నివేదిక.. పాఠశాల విద్యకు సంబంధించి స్థూల నమోదు (గ్రాస్ ఎన్రోల్మెంట్)లో తెలంగాణ 99.43 శాతం లక్ష్యాన్ని చేరుకున్నదని తెలియజేసింది. బడ్జెట్లో విద్యారంగానికి రూ.19,093 కోట్ల నిధులు ఈసారి కేటాయించారు.
రష్యన్ తత్వవేత్త మిహాయిల్ ఫోలోకోవ్ చెప్పినట్లు.. ‘ఒక పాలకుడు తన ప్రాంతపు జీవితాన్ని జీవించాలి. తన ప్రజల బాధలను అనుభవించాలి. వారి ఆనందాలతో సంతోషం పొందాలి’.. దీనికి నిలువెత్తు ప్రతీకగా కేసీఆర్ నిలుస్తున్నారు. నిర్దేశిత గడువు లోపే మానవాభివృద్ధి సూచికలలో అగ్రశ్రేణిలో చేరే దిశగా తెలంగాణ పురోగమిస్తున్నది. ఇప్పుడు దేశం అనుసరిస్తున్నది.
(వ్యాసకర్త: ఉపాధ్యక్షులు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం)
-అస్నాల శ్రీనివాస్
96522 75560