Mahender Reddy | ‘తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే నక్సలిజం సమస్య మళ్లీ పెరుగుతుందని, హైదరాబాద్ నగరంలో మతకల్లోలాలు పెచ్చరిల్లుతాయని ఎన్నో అపోహలు ప్రచారం అయ్యాయి. అవి కేవలం అపోహలే కాదు.. సమాజంలోని కొంత మేధావివర్గం నుంచి కూడా ఇదే రకమైన అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ, అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ పదేండ్లలో సురక్షిత, సుఖశాంతుల తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైంది. యావత్ దేశంలోనే భద్రమైన రాష్ట్రంగా తెలంగాణ ఘనకీర్తిని చాటడంలో, తెలంగాణ పునర్ నిర్మాణంలో పోలీసులది అత్యంత కీలక పాత్ర’ అని వివరిస్తున్నారు తెలంగాణ మాజీ డీజీపీ ఎం మహేందర్రెడ్డి. పోలిసింగ్లో కొత్త రాష్ట్రం తెలంగాణ దేశానికే ఎలా ఆదర్శంగా నిలిచిందో తెలియజేస్తున్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు హైదరాబాద్ నగరంలో ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట చైన్ స్నాచింగ్, పట్టపగలే హత్యలు, దొంగతనాలు జరుగుతుండడం వల్ల ప్రజల్లో భయాందోళనలు ఉండేవి. ‘ఇలాంటి నేరాలను మనం అరికట్టలేమా?’ అని సీఎం గారు అడిగినప్పడు.. ‘పోలీసులు బయట కనిపించటం (విజిబిలిటీ) తక్కువగా ఉండడం వల్ల నేరస్థులకు ఇలాంటి అవకాశం చిక్కుతున్నది. దానికి కారణం పోలీసుల దగ్గర వాహనాలు తక్కువగా ఉండటం. ఉన్న వాహనాలు కూడా దాదాపు 15 ఏండ్లకు పైబడినవి’ అని చెప్పాము. సీఎం గారు స్పందిస్తూ ‘ఎన్ని వాహనాలు కావాలో చెప్పండి. కానిస్టేబుల్ కూడా ఇన్నోవా కారులో పోలీస్ సైరన్ వేసుకుంటూ పెట్రోలింగ్ చేయాలి. అలా పోలీసులు కనిపిస్తుంటేనే ప్రజల్లో భద్రత భావం, పోలీసులపట్ల భరోసా పెరుగుతాయి’ అని అన్నారు.
ఫైనాన్స్ అధికారులకు చెప్పి, మేం ఎవరమూ ఊహించనంత బడ్జెట్ను పోలీస్ వాహనాల కొనుగోలుకు ఇచ్చారు. సీఎంగారు బాధ్యత తీసుకున్న తర్వాత పోలీసులకు సంబంధించి మొట్టమొదట సంతకం పెట్టిన ఫైలు అదే. 2014 నాటికి రాష్ట్రంలో మొత్తం పోలీస్ వాహనాల సంఖ్య 5,703 ఉంటే ఇప్పడు అది 20,115కు పెరిగింది. వీధుల్లో పోలీస్ వాహనాల గస్తీ నిరంతరంగా ఉండడంతో నేరగాళ్ల కదలికలు తగ్గుతున్నాయి. అత్యాధునిక వాహన, ఇతర మౌలిక వసతుల కారణంగా కూడా బాధితుల నుంచి ఫిర్యాదు అందిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్లో సగటున ఐదు నిమిషాల్లో, మిగిలిన ప్రాంతాల్లో 10 నిమిషాల్లోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలా చేయగలిగాం.
రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో సంఘటనలు నాకు ఇంకా గుర్తే. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు ముందు నాకు పిలుపు వచ్చింది. బహుశా రేపటి ప్రమాణ స్వీకార ఏర్పాట్ల గురించి చర్చించేందుకు కాబోలు అనుకున్నా. నేను, మరికొందరు పోలీస్ అధికారులం వెళ్లాం. మమ్మల్ని చూసి ‘రండి.. కూర్చోండి, రేపటి నుంచే తెలంగాణ పునర్ నిర్మాణం మొదలవ్వాలి. ఇందులో భాగంగా పోలీస్ పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించగల్గుతాం?’ అని కేసీఆర్ మమ్మల్ని అడిగారు. నేను ఒకింత ఆశ్చర్యపోయాను. కేసీఆర్ ప్రశ్నలకు మేం బదులిస్తూ..‘రాష్ట్ర విభజన వల్ల పోలీస్ బలగం చాలా తగ్గిపోయింది. సరిపోయేంత మేరకు కొత్తగా వెంటనే రిక్రూట్ చేసుకోవాలి. పోలీస్ వాహనాలన్నీ పాతబడిపోయినందువల్ల, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లడంలో ఆలస్యం అవుతోంది. ఆధునిక కాలానికి తగ్గట్టుగా వాహనాలు, టెక్నాలజీతోపాటు మిగతా వనరులు సమకూర్చుకోవాలి. నేరస్థులను పట్టుకోవడంలో పోలీసుల సామర్థ్యాన్ని పెంచాలి. పోలీసులకు, ప్రజలకు మధ్య ఏండ్లుగా కొనసాగుతున్న గ్యాప్ తగ్గించి.. పోలీసులు ప్రజలతో మమేకం అయ్యేలా చేయాలి. సీసీటీవీ కెమెరాలను ఏర్పర్చడం ద్వారా నేరాలను నియంత్రించగల్గుతాం’ అని అప్పటికప్పుడు కొన్ని ఆలోచనలు పంచుకున్నాం.
మరుసటి రోజు సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత పరేడ్గ్రౌండ్లో రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తూ, తెలంగాణ పోలీస్ శాఖ ఆధునీకరణ, ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం గురించి దిశానిర్దేశం చేశారు. అప్పుడే మాకు సీఎం కేసీఆర్ విజన్, భవిష్యత్ ప్రణాళికలపై పూర్తి స్పష్టత వచ్చింది. ఈ విధంగా 2014 జూన్ 2 నుంచే తెలంగాణ పునర్ నిర్మాణంలో పోలీసులు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది. సురక్షిత తెలంగాణ సాధనలో ఒక్కో అడుగు ముందుకు పడేందుకు, ఒక్కో సంస్కరణ రూపుదిద్దుకునేందుకు పోలీస్ అధికారులుగా మేం అనేకానేక ఆలోచనలు చేశాం. సీఎంగారి ఆదేశాలకు అనుగుణంగా అప్పటి డీజీపీ అనురాగ్శర్మ నేతృత్వంలో మేం లండన్ మెట్రోపాలిటన్ పోలీస్, న్యూయార్క్ సిటీ పోలీస్, వాషింగ్టన్ డీసీ పోలీసు విభాగాలను సందర్శించి, అక్కడి అధునాతన పద్ధతులను తెలుసుకున్నాం. వాటిని మన అవసరాలకు అనుగుణంగా మలచుకుని ఇక్కడ అమలు చేయడం జరిగింది. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ పోలీసు విభాగంలో అనేక మార్పులు సంభవించాయి.
‘పోలీస్ స్టేషన్లలో ప్రజలను ఎందుకు కూర్చోబెట్టరు’ అని ఒక సందర్భంలో సీఎం గారు అడిగారు. ‘పోలీస్ స్టేషన్లలో పోలీసులు కూర్చోవడానికే సరైన వసతులు లేవు సార్’ అని ఉన్న నిజం చెప్పేశాం. దానికి ఆయన స్పందిస్తూ ‘ఇకపై పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలను గౌరవంగా కూర్చోబెట్టి వారి సమస్యలు తెలుసుకునేలా వ్యవస్థలో మార్పు తెద్దాం. తొలుత హైదరాబాద్లో అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ ఏర్పాట్లు చేయండి. ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. ఈ విధానం ఇక్కడ బాగా పనిచేస్తే రాష్ట్రం మొత్తం అమలు చేద్దాం’ అని అన్నారు.
వెంటనే హైదరాబాద్ సిటీలో అన్ని పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ సెంటర్లు, ప్రజలు కూర్చోవడానికి విజిటింగ్ ఏరియాలు, టాయిలెట్స్ తదితర వసతులు ఏర్పాటు చేశాం. దీనివల్ల ప్రజల్లో పోలీసుల పట్ల ఎంతో సానుకూలత ఏర్పడింది. దీంతో రాష్ట్రమంతటా అన్ని పోలీస్ స్టేషన్లలో అద్భుతమైన ఫ్రంట్ ఆఫీస్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. మరొక సందర్భంలో పోలీస్ స్టేషన్ల నిర్వహణ భారానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు రాగా.. సీఎం గారు.. నగర పోలీస్ స్టేషన్లకు రూ.75 వేలు, పట్టణ పోలీస్ స్టేషన్లకు రూ.50 వేలు, గ్రామీణ ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు రూ.25 వేలు నెలవారీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే హైదరాబాద్ మహానగర అవసరాలకు, తెలంగాణ అన్ని జిల్లాల అవసరాలకు తగ్గట్టుగా పోలీస్ సిబ్బంది సంఖ్య పెంచాలన్న మా ప్రతిపాదనలకు సీఎంగారు వెంటనే ఆమోదముద్ర వేశారు. మొదటి, రెండు దఫాల్లో దాదాపుగా 29 వేల మంది పోలీసుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడటమేగాక ఆ ప్రక్రియ అతి త్వరగా పూర్తయ్యింది. తదుపరి మరో 16 వేల మంది పోలీసుల నియామకానికి అనుమతివ్వడం జరిగింది. ప్రస్తుత ఆ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇలా తెలంగాణ వచ్చిన తొమ్మిదేండ్లలోనే పోలీస్ శాఖలో దాదాపు 45 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ జరిగింది. అధికార వికేంద్రీకరణ జరిగి, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా, ఏడు నూతన పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటయ్యాయి. 10 కొత్త పోలీసు జిల్లాలు, 25 సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసులు, 31 సర్కిల్ ఆఫీసులు, 111 నూతన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. వీటితోపాటు, కొత్త జిల్లాలలో నూతన పోలీస్ భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. సైబర్ నేరాలు, డ్రగ్స్ ముఠాల కట్టడికి రాష్ట్రస్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబర్ సెక్యురిటీ బ్యూరోలు ప్రత్యేకంగా ఏర్పాటయ్యాయి.
‘అర్ధరాత్రి కూడా మహిళలు నిర్భయంగా బయట సంచరించగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు’ అని గాంధీజీ చెప్పిన మాటలను సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రస్తావించేవారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే మహిళా భద్రత గురించి ఏం చేస్తే బాగుంటుంది అని అప్పటి సీనియర్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య ఆధ్వర్యంలో కమిటీ వేసి, స్వయంగా షీ టీమ్స్కు రూపకల్పన చేశారు సీఎం గారు. తొలిసారి ఈ షీ టీమ్స్ను హైదరాబాద్ నగరంలో నేను కమిషనర్గా పనిచేసిన సమయంలోనే అమల్లోకి తెచ్చాం. సీనియర్ అధికారి స్వాతిలక్రా నేతృత్వంలో ఏర్పాటు చేసిన షీ టీమ్స్ బృందాలు పోకిరీల్లో వణుకు పుట్టించాయి. తర్వాత కాలంలో రాష్ట్రమంతటా వీటిని విస్తరించాం. ఆ తర్వాత, మహిళా భద్రత కోసమే ప్రత్యేకంగా అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఒక విభాగం ఏర్పాటు చేయడం యావత్ దేశంలోనే మొట్టమొదటిసారి. అనేక ఇతర రాష్ర్టాలకు తెలంగాణ షీ టీమ్స్ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మహిళ భద్రతలో తెలంగాణ రోల్మాడల్గా నిలిచింది.
ట్యాంక్బండ్ దగ్గర నూతన పోలీసు వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ అతిథిగా వచ్చిన సందర్భంలో ‘నేర నివారణకు ఇంకా ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది’ అని మాతో చర్చించారు. అప్పడు సీసీటీవీల ఏర్పాటు ప్రస్తావన తెచ్చాము. వెంటనే ఆయన స్పందిస్తూ.. హైదరాబాద్లో లక్ష సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రభుత్వమే 10 వేల సీసీటీవీ కెమెరాలను నెలకొల్పటంతోపాటు వాటన్నింటినీ కమాండ్ కంట్రోల్కు అనుసంధానించాలని అన్నారు. ఇందులో ప్రజలను, ప్రజాప్రతినిధులను సైతం భాగస్వాములను చేయాలని సూచించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఏరియాల్లో 10 వేల ప్రభుత్వ సీసీటీవీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజల భాగస్వామ్యంతో కొన్ని లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాం. సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో ఈ రోజు హైదరాబాద్ ప్రపంచ అత్యత్తమ పది నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఈ రోజు రాష్ట్రం మొత్తం దాదాపు 11 లక్షల సీసీటీవీ కెమెరాలు ప్రజాభద్రతకు నిఘా నేత్రాలుగా నిలుస్తున్నాయి. తెలంగాణలో ఎంతటి నేరమైనా 24 గంటల్లో ఛేదించగలుగుతున్నాం. దాంట్లో ఈ సీసీటీవీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటి వల్ల ప్రజల్లో భద్రత భావం కూడా పెరిగింది.
నేరస్థులకు శిక్ష పడటం వల్లనే నేరాలు తగ్గుతాయి. దీనికోసం ఫోరెన్సిక్ నిపుణులను, పోలీస్ అనుభవజ్ఞులను ఒకే ప్లాట్ఫామ్పైకి తీసుకొచ్చాం. ఫలితంగా ఎక్కువ కేసులలో నేరస్థులకు శిక్షలు పడటం సాధ్యమైంది. 2014 లో 28 శాతం ఉన్న కన్విక్షన్ రేట్ (మొత్తం కేసుల్లో శిక్ష పడిన కేసులు) ఇప్పుడు 50 శాతానికి పెరిగింది.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కూడా హైదరాబాద్ మహానగరం మతసామరస్యపరంగా ఎంతో సున్నితమైనది. పలుమార్లు మతకల్లోలాలు చోటు చేసుకున్నాయి. కానీ, 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మతఘర్షణలు జరగలేదంటే అది ప్రభుత్వం, పోలీసులు తీసుకున్న ఎన్నో చర్యల ఫలితం. హైదరాబాద్లో నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ను, అంటే తప్పు చేసిన వాహనదారుడి నుంచి చాలన్ డబ్బులు నేరుగా తీసుకోకుండా సాక్ష్యాధారాలతో ట్రాఫిక్ చాలన్ జారీ చేసి, ఆ డబ్బును ఆన్లైన్లో చెల్లించేలా మార్పులు తెచ్చాం. పోలీసులు అనవసరంగా చాలన్లు వేస్తున్నారని ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించటంతోపాటు, పారదర్శకత దీనివల్ల సాధ్యమైంది. నిబంధనలను ఉల్లంఘిస్తే తప్పక రికార్డవుతుందని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ప్రారంభించారు. ఇప్పుడు సుమారు 95 శాతం మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్తో కనిపిస్తున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర లైన్ డిసిప్లెయిన్ పాటిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్ ఎంత పకడ్బందీగా జరుగుతున్నదో అందరికీ తెలుసు. దేశంలోనే తొలిసారిగా, హైదరాబాద్ నగరం మొత్తం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంను ఏర్పాటు చేయడం జరిగింది.
తొమ్మిదేండ్లలో తెలంగాణ పోలీసులు మావోయిస్టుల సమస్యను దీటుగా ఎదుర్కొన్నారు. మారుమూల తెలంగాణ పల్లెలు కూడా ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తున్నాయి. యువత మావోయిస్టులవైపు ఆకర్షితులు కాకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. వరంగల్, రామగుండం, నిజామాబాద్ వంటి నగరాల్లో కూడా ఐటీ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు విస్తరిస్తున్నాయి.
పోలీస్ స్టేషన్స్లో అన్ని విధులను అందరూ చేయడం వలన సరైన జవాబుదారీతనం గతంలో ఉండేది కాదు. దీనివల్ల ఎస్.హెచ్. ఓపై (స్టేషన్ హౌజ్ ఆఫీసర్పై) పనిభారం ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో ఫంక్షనల్ వర్టికల్స్ ద్వారా విధులను విభజించి, వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా విధులను కేటాయిస్తూ, వాటికి బాధ్యులుగా చేసే విధానం అమలులోకి తీసుకొచ్చాం. దీనివల్ల పోలీస్ అధికారులలో జవాబుదారీతనం, తమ పని పట్ల సంతృప్తి పెరిగింది. మంచి ఫలితాలు వస్తున్నాయి.
దేశంలోనే ప్రప్రథమంగా జిల్లాల వారీగా పోలీస్ స్టేషన్లకు, ఉత్తమ పనితీరును ప్రదర్శించే అధికారులకు ర్యాంకులు ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఫంక్షనల్ వర్టికల్ విధానంతో పోలీస్శాఖను అంతర్గతంగా పరిపుష్ఠం చేశామన్న తృప్తి ఎప్పటికీ ఉంటుంది. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ నుంచి డీజీపీ వరకు ప్రతి దశలో అన్ని అంశాలను క్షణాల్లో తెలుసుకునేలా ఏర్పాటు చేసిన టీఎస్కాప్ వంటి టెక్నాలజీలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. పోలీసులు అందిస్తున్న సేవలపై ప్రజల అభిప్రాయాలను థర్డ్పార్టీ కాల్ సెంటర్ ద్వారా సేకరించి, తగు విధంగా పని విధానాలను మార్చుకోవడం జరుగుతున్నది. ఇతర రాష్ర్టాల పోలీసులు ఆదర్శంగా తీసుకుని వారు కూడా దీనిని ప్రారంభించారు.
తెలంగాణ భద్రతాసౌధం కమాండ్ కంట్రోల్ సెంటర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ ఫ్యూజన్ సెంటర్ భవనం పోలీస్ వ్యవస్థలో ఒక సాంకేతిక విప్లవానికి నాంది. సీఎం కేసీఆర్గారి దార్శనికతతోనే ఇది రూపుదాల్చింది. హైదరాబాద్లో 20 అంతస్తుల సువిశాల భవన సముదాయంలో, అంతర్జాతీయ స్థాయిలో దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ భద్రత సౌధం రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ఉత్తమ పద్ధతులను, సాంకేతిక విధానాలను అధ్యయనం చేసి, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, కంప్యూటర్ విజన్ వంటి అత్యున్నత టెక్నాలజీల ద్వారా తెలంగాణ పోలీసుశాఖకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఉపయోగపడేలా దీన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాన్నైనా ఇక్కడి నుంచే మానిటర్ చేస్తూ ఏ అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడొచ్చు.
కేవలం తొమ్మిదేండ్లలోనే ప్రజలలో భరోసాను, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే పోలిసింగ్ పద్ధతులు తెలంగాణలో అమల్లోకి వచ్చాయి. తెలంగాణ నేర రహిత రాష్ట్రంగా రూపు దిద్దుకోవడమే కాకుండా, అంతర్జాతీయ పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా నిలిచింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడంలో పోలీస్శాఖ తనవంతు పాత్రను కీలకంగా పోషించింది.
(వ్యాసకర్త: తెలంగాణ మాజీ డీజీపీ)
-ఎం. మహేందర్రెడ్డి