Women’s Reservation bill | ప్రపంచంలోనే మొట్టమొదటి మాతృస్వామిక వ్యవస్థలో ఉజ్వలమైన నాగరికత కలిగింది భారతదేశం. మాతృస్వామ్య వ్యవస్థలో ఎటువంటి అభివృద్ధి ఉంటుందో స్వయంగా చవిచూసిన సమాజం ఇది. ఆ తర్వాత ఆర్యుల కాలంలో మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్యాన్ని ఏర్పాటు చేసి పురుషాధిక్య వ్యవస్థగా మార్చింది. ఇది స్త్రీల అస్తిత్వానికి గొడ్డలి పెట్టయ్యింది. స్త్రీలు విద్యకు అర్హులు కాదని వారిని విధివంచితులను చేసింది. మహిళలను ద్వితీయ శ్రేణిగానే పరిగణించడం మొదలైంది. ఆధునిక యుగంలో విద్యాభివృద్ధి పుణ్యమా అని మహిళలు విద్యాధికులై అన్ని రంగాలలో రాణిస్తున్నారు.
1992, 1993ల్లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో 72,73 రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిద్వారా గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టారు. దీన్ని ఉభయ సభలు ఆమోదించాయి. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఎంపికయ్యారు.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2020-21 ప్రకారం మన దేశంలో స్త్రీ పురుష నిష్పత్తి 985:1000 గా ఉన్నది. జనాభాలోనే తక్కువ అనుకుంటే ప్రాతినిధ్యంలోనూ మ హిళా పాత్ర తక్కువే. ముఖ్యంగా శాసన నిర్వహణలో మరీ తక్కువ. దీన్ని అధిగమించడానికి జరిగిన ప్రయత్నమే మహిళా బిల్లు.
సెప్టెంబర్ 19న పార్లమెంటు నూతన భవనంలోప్రత్యేక సమావేశాల సందర్భంగా మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రధా ని నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ గురించి ప్రకటించారు. అనంతరం 2 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘవాల్ బిల్లుకు సంబంధించి 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ‘నారీశక్తి వందన్ అధినియమ్’ పేరుతో సెప్టెంబర్ 20న లోక్సభలో, 21న రాజ్యసభలో ఆమోదం పొందింది. లోక్సభలోని 454 మంది ఓ టింగ్లో పాల్గొనగా 452 అనుకూలంగా, రెండు ఓట్లు ప్రతికూలంగా వచ్చాయి. రాజ్యసభలోని 214 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో 543 మంది సభ్యులున్న లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం 181కు చేరుతుంది. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్ధేశం. ప్రస్తుతం లోక్సభలో 542 సీట్లకు 78మంది, రాజ్యసభలో 224 మందికి 24 మంది మహిళలు ఉన్నారు. మొదటి లోక్సభలో 5 శాతంగా ఉన్న మహిళల సంఖ్య 17వ లోక్సభ నాటికి 14.39 శాతానికి చేరుకున్నది. అయినా ఇది తక్కువే.
మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయానికి చాలా చరిత్ర ఉన్నది. ముఖ్యంగా ఈ డిమాండ్ వలస రాజ్యం కాలం నాటిది.1935లో భారతప్రభుత్వ చట్టం ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లో 41 రిజర్వ్ సీట్లు, సెంట్రల్ లెజిస్లేచర్లో పరిమిత రిజర్వేషన్లు మహిళలకు అందించింది. అయితే ఉమెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూ ఏ ఐ), ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ (ఏఐడబ్ల్యూసీ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా వంటి ఆ కాలంనాటి మహిళా సంఘాలు మహిళలకు ఓటు హక్కు మాత్రమే కోరడం మొదలు పెట్టాయి.
భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభలో కూడా మహిళా రిజర్వేషన్ అంశం చర్చకు వచ్చింది. అయితే రిజర్వ్ సీట్ల అవసరం లేకుండా మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని కొందరు సభ్యులు వాదించడంతో రిజర్వేషన్ అనవసరమని భావించారు. సరోజిని నాయుడు కూడా మహిళలు దృఢమైనవారని వారికి ప్రత్యేక రిజర్వేషన్ అవసరం లేదని వాదించారు. 1974లో మహిళల స్థితి పేరుతో ప్రభుత్వం నియమించిన కమిటీ సమగ్ర నివేదిక రాష్ట్ర శాసన సభలు, పార్లమెంట్లో మహిళలకు రిజర్వేషన్ సిఫారసు చేసిన మొదటి నివేదిక.
భారత రాజ్యాంగం భారతీయులకు లింగ భేదం లేకుండా అందరికీ సమాన హక్కులుండాలని చెప్తుంది. కానీ, పురుషాధిపత్యం ఎక్కువై మహిళల ప్రాతినిధ్యం తగ్గుతూ వచ్చింది. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లు అవసరం పెరుగుతూ వచ్చిం ది. ఫలితంగా 1989లో రాజీవ్గాంధీ పట్టణ, స్థానిక సంస్థల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీజం పడింది.1992, 1993ల్లో పీవీ నరసింహారావు 72,73 రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిద్వారా గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టారు. దీన్ని ఉభయ సభలు ఆమోదించాయి. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఎంపికయ్యారు. 1996లో దేవెగౌడ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం 81వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టినప్పటికీ లోక్సభ రద్దు కారణంగా బిల్లు రద్దయింది.
12వ లోక్సభలో వాజ్పేయ్ నాయకత్వంలో బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ మద్దతు లభించలేదు. ఆ తర్వాత పలుసార్లు ప్రయత్నం జరిగినా సఫలం కాలేదు. 2008లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో బిల్లు ప్రవేశ పెట్టింది. అయితే రాజ్యసభలో ఆమోదింపబడింది కానీ లోక్సభ పరిశీలనకు రాలేదు. ఆ తర్వాత లోక్సభ రద్దయింది. 2014,2019లో బీజేపీ ప్రభు త్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ప్రచారం చేసింది. ఎట్టకేలకు 128 రాజ్యాంగ సవరణ ద్వారా బిల్లును ఆమోదించింది.
ఈ బిల్లులోని అంశాలను పరిశీలిస్తే లోక్సభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించే ఆర్టికల్ 330లోని నిబంధనల నుంచి తీసుకున్న 330 ఏ ను రాజ్యాంగంలో చేర్చేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేయబడిన సీట్లలో రొటేషన్ ప్రాతిపదికన మహిళలకు రిజర్వ్ చేయబడిన సీట్లలో మూడింట ఒక వంతు సీట్లు ఇవ్వాలి. ఆర్టికల్ 330ఏ కింద రాష్ట్ర శాసనసభ సీట్ల రిజర్వేషన్ తప్పనిసరి చేస్తుంది. అదనంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయబడిన సీట్లలో మూడింట ఒకవంతు మహిళలకు కేటాయించాలి. (ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడే సీట్లలో మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వేషన్ ఉండాలి.
ఢిల్లీలోని ఎన్సీటీ (కేంద్ర పాలిత ప్రాంతం)లో మహిళల రిజర్వేషన్ కొత్త నిబంధన ప్రకారం 239 ఏ ఏ(27)(బి) బిల్లుద్వారా చేయబడిన సవరణలు ఢిల్లీ జాతీయ రాజధానికి కూడా వర్తిస్తాయి. జనగణన అనంతరం ఈ రిజర్వేషన్ అమల్లోకి వస్తుం ది. జనాభా లెక్కల ఆధారంగా మహిళలకు సీట్లు కేటాయించేటపుడు డిలిమిటేషన్ను చేపడతారు. 15 సంవత్సరాల పాటు ఈ బిల్లు కింద రిజర్వేషన్లు కల్పిస్తారు. అయితే ఇవి పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా నిర్ణయించిన తేదీ వరకు కొనసాగుతాయి.
స్త్రీలను ప్రజాపాలనకు మరింత చేరువ చేయటం, సమాజంలో సమానత్వం, సాధికరత ప్రోత్సాహం, స్థానిక, రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో, పరిపాలనలో వారికి దారులను ఏర్పరచటం, చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం పెంచటం ఈ బిల్లు అనుకూలతలు. కాగా, కొన్నిసార్లు కొన్ని రాజకీయ పార్టీలు స్వలాభం కోసం బలహీన నియోజక వర్గాలను మహిళా అభ్యర్థులకు కేటాయించవచ్చు. బలమైన పురుషులకు బదులుగా స్త్రీలను నియమించటం ప్రతికూలతలకు దారి తీయవచ్చు.
ఏదేమైనప్పటికీ ఎన్నో ఏండ్ల నుంచి జరుగుతు న్న పోరాటానికి ఫలితంగా రూపొందిన ఈ బి ల్లు మహిళలను ప్రజా పాలనకు మరింత చేరువ చేస్తుందని ఆశిద్దాం.
(వ్యాసకర్త : అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రభుత్వ సిటీ కళాశాల )
డాక్టర్ బొల్లేపల్లి సుదక్షణ
98495 20572