ఆడపిల్ల అంటేనే సమాజంలో చిన్నచూపు.. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యలు… పుట్టిన తర్వాత కూడా ఆడపిల్లకు అనేక ఆంక్షలు… ఈ నేపథ్యంలో దేశంలోని బాలికలకు అన్నిరకాల సహాయ సహకారాలందించి, తగిన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2008 నుంచి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. బాలికల హక్కులపై అవగాహన కల్పించడం, బాలికా విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారాలకు ప్రాముఖ్యం ఇవ్వడం ఈ బాలికా దినోత్సవ ప్రధాన ఉద్దేశం.
ఆధునిక యుగంలో బాలిక అమ్మ గర్భంలో నుంచే వివక్షకు గురవుతున్నది. మన దేశంలో గుడిలో దేవతకు పూజలు చేస్తారు. కానీ పుట్టేది ఆడపిల్ల అని తెలిస్తే మాత్రం పురిట్లోనే పీక పిసుకుతున్నారు. మరోవైపు ఆడపిల్లలకు కట్నమిచ్చి పెళ్ళి చేయాలన్న బెం గ, మగపిల్లవాడు వంశోద్ధారకుడనే అపోహల వల్ల మగపిల్లలకు ప్రాధాన్యం పెరిగింది. తత్ఫలితంగా ఆడ, మగ లింగ నిష్పత్తి గాడితప్పుతున్నది. మానవాభివృద్ధి, ప్రజాస్వామ్యం, శాంతిభద్రతలతో సహా సమస్త జీవన పార్శ్వాలపై మహిళా జనాభా క్షీణత దుష్ప్రభావం చూపిస్తున్నది.
సమాజ మూలాల్లో స్థిరపడిన పురుషాధిక్య సంస్కృతే దీనికి ప్రధాన కారణం.బాలికలు ఎదుర్కొంటున్న వివక్ష నుంచి విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఫలితం శూన్యం. దేశంలో రోజురోజుకు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడమే దీనికి నిదర్శనం. 1961లో ప్రతి వెయ్యిమందికి 976 మంది ఉన్న బాలికల సంఖ్య, 2001లో 927కు, 2011 నాటికి 918కి తగ్గిపోయింది.
ఏ సమాజంలోనైనా స్త్రీ, పురుషులు సమపాళ్లలో ఉన్నప్పుడే సమాజాభివృద్ధి జరుగుతుంది. లేదంటే సమాజ శ్రేయస్సు కుంటుపడుతుంది. లింగ నిష్పత్తి తగ్గడానికి ఎన్నో కారణాలున్నాయి. భ్రూణహత్యలు, పేదరికం, నిరక్షరాస్యత, అక్రమ రవాణా వంటివి ఈ దుస్థితికి కారణం. ఐరాస ‘స్టేట్ ఆఫ్ ది వరల్డ్ చిల్డ్రన్ రిపోర్ట్-2019’ ప్రకారం దేశంలో దాదాపు 47 శాతం యుక్త వయస్సు బాలికలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అందులో 56 శాతం రక్తహీనతతో ఇబ్బందులు పడు తున్నారు. పేద, బడుగు బలహీనవర్గాల బాలికల పరిస్థితి మరింత దారుణం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి మూడు బాల్యవివాహాల్లో ఒకటి భారతదేశంలో నమోదవుతున్నట్లు యూనిసెఫ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా బాలికల ఉన్నతవిద్య మరో సమస్యగా మారింది. బాలికలకు రక్షణ కొరవడి లైంగికదాడులు, వేధింపులకు గురవుతున్నారు. మరోవైపు చిన్నారులపై లైంగికనేరాల నిరోధక చట్టం (పోక్సో) కింద మూడేండ్లలో 4,12,142 లైంగికదాడుల కేసులు నమోదైనట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖమంత్రి రాజ్యసభలో పేర్కొనడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ క్రమంలో బాలికలు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘షీ’ టీమ్స్ ఎంతో దోహదపడుతున్నాయి. కరోనా లాంటి విపత్కర సమయంలో బాలికలు అనారోగ్యంతో ఎక్కువగా బాధపడ్డారని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
దేశ భవిష్యత్తుకు బాలికలు వెలుగు కిరణాలు. కాబట్టి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత పౌర సమా జం పైనా ఉన్నది. ఆడపిల్లల పట్ల సమాజంలో ఆదరణ పెరగాలంటే మన ఆలోచనల్లో మార్పురావాలి. బాలికల హక్కులను కాపాడటంతో పాటు బాలికావిద్యను ప్రోత్సహించాలి. తెలంగాణలోని బాలిక గురుకులాలు ఆ దిశగా కృషిచేస్తున్నాయి. ‘జాతీయ విద్యా విధానం-2020’ వల్ల ఆడపిల్లలకు కలిగే ప్రయోజనాలు అంతంత మాత్రమే. ఇందులో బాలికాభివృద్ధికి లింగ సమ్మిళిత నిధి (Gend -er inclusive fund)ను ప్రవేశపెట్టినప్పటికీ ఆచరణలో ముందుకుసాగడం లేదు. దేశంలోని మొత్తం విద్యార్థుల్లో దాదాపు 50 శాతం మంది విద్యార్థినులే. కనుక వారి ఎదుగుదల, సంరక్షణకు జాతీయస్థాయిలో సమగ్ర విధానాన్ని తీసుకురావాలి. బాలికా సంక్షేమం నిధులతో కూడా ముడిపడి ఉన్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలిక అభివృద్ధి పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని బడ్జెట్ కేటాయింపులో తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం బాలిక విద్యాభివృద్ధి పట్ల నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. ఆడపిల్లలకు మంచి విద్య అవకాశాలను కల్పించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో సాధికారత దిశగా నడిపించాలి. పాఠశాల దశ నుంచి ఆత్మరక్షణ కోసం బాలికలకు కరాటే విద్యను నేర్పించాలి. అంతర్జాతీయస్థాయిలో వివిధ రంగాల్లో భారతీయ బాలికల విజయాలను ప్రభుత్వాలు గుర్తించాలి. బాలికను కాపాడుకుందాం, అమ్మ కోసం, సోదరి కోసం, భార్య కోసం, భవిష్యత్తు కోసం ఆడపిల్లను కాపాడు కుందాం, ఆడబిడ్డను బతుకనిద్దాం, ఆడబిడ్డకు బతుకునిద్దాం.
(వ్యాసకర్త:ఎస్ శ్యామల , 80085 39905, సామాజిక కార్యకర్త)