సంకుచిత భావాలు గల కొందరు చరిత్రకారులు 1857, అంతకుముందు జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో అసువులుబాసిన యోధుల పేర్లను కనుమరుగు చేశారు. వారంతా ముస్లింలు కావడమే అందుకు కారణం. నాటి స్వాతంత్య్ర పోరాటంలో హిందువులతో పాటు ముస్లింలు జతకలిశారు. కానీ, ఏదో నామమాత్రంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి ఒకరిద్దిరి పేర్లు తప్ప చెప్పుకోదగ్గ స్థాయిలో ఇతర వీరుల పేర్లు కానరావు. స్వతంత్ర పోరాటంలో నామమాత్రంగా కూడా పాల్గొనని కొన్ని సంస్థల ప్రతినిధులు దేశభక్తి, జాతీయవాదం గురించి మాట్లాడటం విడ్డూరం. ఈ గడ్డలో పుట్టి తమ మాతృభూమి బానిస సంకెళ్లను తెంచేందుకు ప్రాణ త్యాగాలు చేసిన అష్ఫాఖుల్లాఖాన్, హసన్ మోహానీ, టిప్పు సుల్తాన్ తదితరుల చరిత్రను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్న ది. జై హింద్, ఇంక్విలాబ్ జిందాబాద్ లాంటి నినాదాలు కూడా ముస్లిం యోధులు సృష్టించినవే.
స్వాతంత్య్రం కోసం 200 ఏండ్ల పాటు ఎందరో యోధులు కులమతాలకతీతంగా వీరోచితంగా పోరాడారు. 1750లలోనే స్వాతంత్య్రోద్యమానికి అంకురార్పణ జరిగింది. ఈస్టిండియా కంపెనీ పేరు తో వ్యాపార నిమిత్తం దేశంలోకి అడుగుపెట్టిన ఆం గ్లేయులు చాపకింద నీరులా తమ ప్రాబల్యాన్ని పెం చుకున్నారు. ముస్లిం పాలకుల నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ముస్లింలను అధికార పీఠం నుంచి తప్పించి గద్దెనెక్కారు. కోల్పోయిన పీఠాన్ని తిరిగి పొందేందుకు ముస్లింలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్య్ర పోరాటానికి మొదట శంఖం పూరించింది ముస్లింలేనన్నది దీనిద్వారా తెలుస్తున్నది. 1753లో ముర్షీదాబాద్, బెంగాల్లో సిరాజుద్దౌలా తాత అలీవర్దీఖాన్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారు.
1799లో దక్షిణ భారతదేశంలో మైసూరు పులి టిప్పు సుల్తాన్, ఆయన తండ్రి హైదర్ ఆంగ్లేయులతో పోరాడా రు. కొందరు స్వదేశీయులు ఆంగ్లేయులతో చేతులు కలపకుండా ఉంటే మన దేశానికి 200 ఏండ్లకు పూర్వమే స్వాతంత్య్రం లభించేది. తెల్లవాళ్ల నుంచి ఈ దేశానికి విముక్తి కలిగించేందుకు ఎంతోమంది యోధులు తమ రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. జైళ్లల్లో మగ్గాల్సి వచ్చింది. ఉరికంబాన్ని ముద్దాడాల్సి వచ్చింది. ఆస్తులన్నీ ధారపోయాల్సి వచ్చింది. ఇల్లూవాకిలీ వదిలేయాల్సి వచ్చి ంది. ఈ క్రమంలో ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి ఈ దేశానికి విముక్తి కల్పించేందుకు తమ ధన, ప్రాణాలను మూల్యంగా చెల్లించుకునేందుకు ముస్లింలు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉన్నారు.
చివరి మొగల్ చక్రవర్తి బహదూర్షా జఫర్ను బ్రిటిషర్లు రంగూన్ జైలులో బంధించి, కండ్లముందే అతని నలుగురు కుమారులను గొంతుకోసి చంపేశారు. ‘చక్రవర్తిగా పాలించిన నాకు రెండడుగుల భూమి కూడా దొరకని దుస్థితి. ఇంతకంటే దురదృష్టవంతులు ఎవరుంటారు’ అని తన ఆవేదనను కవి త రూపంలో రాసుకున్నాడాయన. స్వాతంత్య్రం కో సం ముస్లింలు చేసిన త్యాగాలకు మచ్చుతునక ఇది.
ముస్లిం యోధులు అనుభవించిన శిక్షల్లో కాలాపానీ శిక్ష అత్యంత పాశవికమైనది. ఈ కాలాపానీ జైల్లో మగ్గినవారిలో 95 శాతం ముస్లింలే. అందులోనూ ఉలమాలే అధికం. మౌలానా జాఫర్, మౌలానా విలాయత్ అలీ (రహ్మాలై), మౌలానా యాహ్యా (రహ్మాలై) లాంటి ఉలమాల పేర్లు ముందువరుసలో ఉంటాయి. కాలాపానీ శిక్షకు భయపడి చాలామంది బ్రిటిషర్లకు కొమ్ముకాస్తూ మహాత్మాగాంధీకి వ్యతిరేకంగా పనిచేసేవారు. గాంధీని హత్యచేసిన వర్గం స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా, ఆంగ్లేయులకు అనుకూలంగా పనిచేసింది. కాలాపానీ జైలులో ఎలాంటి శిక్షలు అనుభవించారో పలువురు ఉలమాలు తమ పుస్తకాల్లో రాసుకున్నారు.
మలబార్లో మోప్లా ముస్లింలు కూడా స్వతం త్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు. మోప్లా ముస్లింలను ఆంగ్లేయులు చిత్రహింసలు పెట్టారు. కేరళకు చెందిన 125 మంది ముస్లింలను బ్రిటిషర్లు బంధించారు. వాళ్లను కోర్టులో హాజరుపర్చేందుకు మాల్గాడీలో తీసుకెళ్లారు. 50 మంది పట్టే వాహనంలో 125 మందిని కుక్కి తలుపులు మూసేశారు. 3 రోజుల ప్రయాణం తర్వాత తలుపు తీసి చూడ గా.. 65 మంది ఊపిరాడక చనిపోయి ఉన్నారు. మి గతా వారంతా స్పృహ తప్పి పడిపోయారు.
బతికినవారిని మద్రాసు కోర్టులో హాజరుపర్చి ఉరిశిక్ష వి ధించారు. కేరళ ప్రభుత్వం 1971లో వారి త్యాగాలను గుర్తించి మోప్లా యోధుల కుటుంబాలకు పింఛను మంజూరు చేయడం వారి త్యాగాలకు నిదర్శనం.మౌలానా అబుల్ కలాం ఆజాద్ (రహ్మాలై) జాతీయోధ్యమంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆజాద్పై అడుగడుగునా ఆంక్షలుండేవి. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు ఆయన సొంతంగా పత్రికను నడిపేవారు. దీన్ని సహించని ఆంగ్లేయులు అల్ హిలాల్ పత్రికను నిషేధించారు. మౌలానాను బంధించిన అహ్మద్నగర్ జైలు నేటికీ అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది. మౌలానా హస్రత్ మోహానీ తన కవితలతో ముస్లింలపై ఎంతో ప్రభావం చూపించారు.
ఉలమాలు స్వతంత్ర సమరాంగణంలో రాజీలేని పోరాటాలు చేశారని, ఎనిమిది లక్షల మంది బలిదానాలు చేశారని డాక్టర్ తారాచంద్ అనే రచయిత తన గ్రంథంలో రాశారు. ఈ దేశానికి ఎప్పుడు ఆపద వచ్చినా ‘మేమున్నా’మంటూ ముస్లింలు ముందుకొచ్చారు. దురదృష్టవశాత్తూ 1947లో దేశ విభజన జరిగింది. ఈ దేశాన్ని విభజించడాన్ని చాలామంది ముస్లింలు తీవ్రంగా ఖండించారు. సింధ్ నుంచి మద్రాసు దాకా అఖండ భారత్ ఉండాలని వారు కోరుకున్నారు. వారిలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒకరు. ఢిల్లీ జామా మసీదు వద్ద ఆజాద్ చేసిన ప్రసంగం చరిత్రాత్మకం. ‘మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? ఈ మసీదు మినార్లు మిమ్మల్ని పిలుస్తున్నాయి. విభజన వల్ల దేశంలోని ముస్లింలు బలహీనపడతారు’ అని నాడు ఆయన చేసిన ప్రసంగం పుస్తకాల్లో నేటికీ నిక్షిప్తమై ఉంది. ఈ దేశ స్వతంత్ర సమరాంగణంలో ముస్లింల త్యాగాలు చిరస్మరణీయమనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి.
-ముహమ్మద్ ముజాహిద్
96406 22076