తేనెటీగలకు మానవ మనుగడకు సంబంధం ఏమిటి అని ఆశ్చర్యంగా ఉందా? కానీ, అది నిజం. అవిశ్రాంతంగా పనిచేసే తేనెటీగలు మనుష్యులకు, చెట్లకు, పర్యావరణానికి చేసే ప్రయోజనాన్ని వెలకట్టలేము. అందుకే, ‘భూమిపై నుంచి తేనెటీగలు అదృశ్యమైతే, మానవులు నాలుగేండ్ల కంటే ఎక్కువకాలం మనుగడ సాగించలేరు’ అని అన్నారు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్. పుప్పొడిని ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు చేరవేయడం ద్వారా తేనెటీగలు జీవజాతుల ఆహారోత్పత్తికి తోడ్పడమే కాక జీవ వైవిధ్యాన్ని కాపాడటంలోనూ కీలక పాత్ర వహిస్తాయి.
పర్యావరణ పరిరక్షణకు అద్వితీయంగా తోడ్పాటునందించే తేనెటీగల కోసమే మే 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల దినోత్సవం జరుపుకొంటారు. ఈ ఏడాది ఈ దినోత్సవం వేడుకలు మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో ప్రారంభం కానున్నాయి. తేనెటీగలు ఒక రకమైన తుమ్మెదలు. మన ఆహార భద్రత, పోషణ, పర్యావరణ పరిరక్షణలో తేనెటీగలు, పరాగ సంపర్కాల పాత్ర చాల ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా 115 ప్రముఖ ఆహార పంటలలో 87 పరాగ సంపర్కం చర్య ద్వారా ఉత్పత్తి అవుతున్నాయి. మొత్తం పంట ఉత్పత్తిలో పరాగ సంపర్కాలు 35 శాతం ఉత్పత్తికి కారణం. అయితే ఇటీవలి సర్వేల ప్రకారం గత రెండేండ్లలోనే 90 శాతం తేనెటీగలు అంతరించిపోయాయి. ఇది అత్యంత ఆందోళన కలిగించే పరిణామం. విచక్షణారహితంగా అడవుల నరికివేత, తేనెతెట్టెలు పెట్టడానికి అనువైన వృక్షాలు లేకపోవడం, వివిధ పుష్పజాతులు అంతరించిపోవడం, అనియంత్రిత కలుపు క్రిమిసంహారక మందుల వినియోగం తేనెటీగలు అంతరించిపోవడానికి కారణమవుతున్నాయి.
శరీరానికి తేనె ఎంతో మేలు చేస్తుందని మనలో చాలామందికి తెలిసినప్పటికీ, తేనె తయారీకి తేనెటీగలు వాటి జీవితకాలం మొత్తం కష్టపడతాయని తెలియకపోవచ్చు. తేనెటీగలు ఒక చెంచా తేనెను తయారు చేయడానికి అనేక వేల కిలోమీటర్లు ఎగరవలసి ఉంటుంది. మొత్తం జీవిత కాలంలో ఒక తేనెటీగ ఒక చెంచా తేనెను కూడా తయారు చేయలేదు. ఒక టీస్పూన్లో పన్నెండవ వంతు వరకు మాత్రమే తేనెను తయారు చేస్తుంది. అంటే 12 తేనెటీగలు జీవితాంతం కష్టపడితే ఒక చెంచా తేనె తయారవుతుంది. ఆడ తేనెటీగలు మాత్రమే తేనెను తయారు చేస్తాయి. మగ తేనెటీగలు ఏ పనీ చేయక ఆడ తేనెటీగలు ఎక్కువగా ఉన్న చోట ఉంటాయి. తేనెటీగ సగటు జీవిత కాలం 45 రోజులు మాత్రమే. ఒక కిలో తేనెను తయారు చేయడానికి తేనెటీగలు దాదాపు 40 లక్షల పువ్వుల రసాన్ని పీల్చుకుని 90,000 మైళ్లు ప్రయాణించవలసి ఉంటుంది. పుప్పొడిని మోసుకెళ్లడానికి అనుగుణంగా ఆడ తేనెటీగలు ప్రత్యేక శరీర నిర్మాణ నిర్మాణాలను కలిగి ఉంటాయి.
తేనెటీగల సహనివేశం సాధారణంగా ఒక రాతికిగాని, భవనం పైకప్పు-గోడకు మధ్య అనుసంధానంగా ఉండే బీమ్కు గాని లేదా చెట్టు శాఖలకుగాని తేనెపట్టును నిర్మిస్తాయి. ఒక్కొక్క సహనివేశంలో దాదాపు 50 వేల తేనెటీగలు ఉంటాయి. ప్రతి తేనెపట్టులో మైనంతో చేసిన రెండు రకాల షడ్భుజాకారపు కక్ష్యలు అనేకం ఉంటాయి. మొదటి రకం కక్ష్యలు తేనెను, పుప్పొడి రేణువులను నిల్వ చేయడానికి ఉపయోగపడగా, రెండవ రకం కక్ష్యలు పిండ సంరక్షణకు ఉపయోగపడతాయి. ఇవి కాక రాణీ ఈగ కోసం పెద్ద కక్ష్య ఒకటి ఉంటుంది. ఒక్కొక్క తేనెపట్టులో ఒక రాణి ఈగ ఉంటుంది. పొరపాటున రెండు రాణి ఈగలు ఉంటే, ఒకటి మరో దానిని చంపేస్తుంది. దినమంతా గదులను పర్యవేక్షించే రాణి ఈగ రోజుకు 2000 వరకు గుడ్లను పెడుతుంది. వాటి నుంచి 1-2 రోజుల తరువాత డింభకాలు బయటికి వస్తాయి. కూలి ఈగలు డింభకాలకు తేనె, పుప్పొడి, రాయల్ జెల్లీ అందిస్తాయి. రాయల్ జెల్లీని ఎక్కువగా తాగిన డింభకాలు రాణి ఈగలుగా మారుతాయి. 5వ రోజుకు డింభకాలు తమ చుట్టూ, ఒక గట్టి పొరను నిర్మించుకుంటాయి. కూలి ఈగలు గదిని మైనంతో మూసివేస్తాయి. మూడు వారాలలో పూర్తిగా ఎదిగిన తేనెటీగలు గదిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తాయి.
తేనె ఎంతో రుచికరమైన, పోషక విలువలు గల ఆహర పదార్థం. కంటి వ్యాధులు, శ్వాసనాళ ఉబ్బసం, గొంతు ఇన్ఫెక్షన్లు, క్షయ, దాహం,ఎక్కిళ్ళు, అలసట, మైకం, హెపటైటిస్, మలబద్ధకం, పురుగుల ముట్టడి, పైల్స్, తామర, పూత, గాయాలను నయం చేయడంలో తేనె ఉపయోగించబడుతుంది. తేనెటీగ విషాన్ని కీళ్ళ నొప్పుల చికిత్సలో ఉపయోగిస్తారు. తేనెటీగల నుండి సేకరించే ప్రొపోలిస్ ద్రావకాన్ని హోమియోపతి మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో ఎన్నో మందులను తేనెతో కలిపి ఇస్తారు.
అదనపు ఆదాయం కోసం కొద్దిపాటి వనరులు, స్వల్ప పెట్టుబడితో రైతులు తేనెటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. తేనెటీగల పెంపకానికి, మైనం తయారీకి భూసారంతో పని లేదు. బంజరు భూములైనా సరిపోతుంది. తేనెటీగల నుండి సేకరించిన పుప్పొడికి మార్కెట్లో కిలోకు దాదాపు రూ.1200, రాయల్ జెల్లీకి రూ.25 నుండి రూ.30 వేల వరకు ధర పలుకుతుంది. తేనెటీగల పెంపకంలో శిక్షణకు నేషనల్ బీ బోర్డ్ సహకారం అందిస్తున్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర మాజీ కార్యదర్శి, ది భారత్ స్కౌట్స్ గైడ్స్, తెలంగాణ)
-యేచన్ చంద్రశేఖర్
88850 50822