భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-36 నుంచి ఆర్టికల్-51 వరకు పొందుపరిచిన ఆదేశిక సూత్రాల్లో అత్యంత వివాదాస్పద అంశం ఆర్టికల్-44లో సూచించిన ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్). రాజ్యాంగం రచించినప్పటి నుంచి ఈ అంశంపై చర్చ కొనసాగుతున్నది.
ఆర్టికల్-44 ప్రకారం… భారత పౌరులందరికీ మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకతీతంగా కులం, మతం, ప్రాంతం, వర్గం, లింగ భేదాలు లేకుండా అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. ప్రస్తుతం మన దేశంలో వివాహం, వారసత్వం, దత్తత, సంరక్షణ, భరణం వంటి అంశాలు ఆయా మతాలకు సంబంధించిన వ్యక్తిగత చట్టాల ఆధారంగా నడుస్తున్నాయి.
ఇక ముస్లింల విషయానికి వస్తే వారు షరియా చట్టం 1937ను అనుసరిస్తున్నారు. దేశంలోని ముస్లిం పర్సనల్ లా బోర్డు దీన్ని అమలు చేస్తుంది. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాల ఆధారంగా తమ మత సంప్రదాయాలు ఆచార వ్యవహారాలుంటాయని వారి నమ్మకం.కాబట్టి వాటిని అనుసరిస్తున్నారు. తమ హక్కులను కేంద్రం అణచివేయాలని చూస్తున్నదని మెజారిటీ ముస్లింలు భావిస్తున్నారు.
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధి చెందిన భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, సిక్కు, పార్శి, బుద్ధిష్ట్ వంటి అనేక మతాలున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారాలన్ని ఆయా మతాల వ్యక్తిగత చట్టాల ఆధారంగా జరుగుతున్నాయి. భారతదేశంలో ప్రధానంగా హిందూ వివాహ వారసత్వ చట్టం ముస్లిం షరియా చట్టం, క్రిస్టియన్ ప్రత్యేక వివాహ చట్టం అమల్లో ఉన్నవి. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి అంటే ఈ వ్యక్తిగత మత చట్టాలన్ని రద్దయి అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. అయితే ఉమ్మడి పౌరస్మృతి అంటే మెజారిటీ మత చట్టాలను అన్ని మతాలపై రుద్దడం కాదు. అన్ని మతాల్లో ఉన్న ఉన్నత సంప్రదాయాలను, ఆచారాలను తీసుకొని ఆయా మతాల్లో ఉన్న ఛాందసవాద అనాగరిక వ్యవహారాలను పక్కనపెట్టి ఆధునిక కాలానికి అనుకూలంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఒక ఉమ్మడి చట్టం చేయవలసిన అవసరం ఉన్నది. అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-25లో పేర్కొన్న మైనారిటీల హక్కుల పరిరక్షణ వంటి అంశాల్లో ఉమ్మడి పౌరస్మృతి విభేదిస్తుందనే అభిప్రాయం ఉన్నది. రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా ఉమ్మడి పౌరస్మృతి భారతదేశానికి అవసరమని చెప్పారు. కానీ, దాన్ని భారత భూ భాగంలోని ప్రజలు అంగీకరించి సామాజిక ఆమోదం లభించినప్పుడే అమల్లోకి తీసుకురావాలన్నారు. అందుకే రాజ్యాంగ నిర్మాతలు దీనిని ప్రాథమిక హక్కులలో చేర్చకుండా ఆదేశిక సూత్రాలలో చేర్చారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇంతటి గంభీరమైన, సంక్లిష్టమైన, దేశ సమగ్రతతో ముడిపడి ఉన్న అంశాన్ని 2024 ఎలక్షన్ల కోసం హడావుడిగా తీసుకువచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పలు సందర్భాల్లో ఈ అంశంపై చర్చ జరుగుతూ వస్తుంది. కానీ, మొదటిసారి 1985లో మధ్యప్రదేశ్కు చెందిన షాబాన్ బేగం అనే ముస్లిం మహిళ మనోవర్తి కేసు విషయంలో అత్యున్నత న్యాయస్థానం వ్యక్తిగత చట్టాల వల్ల మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి ఉమ్మడి పౌరస్మృతి స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వానికి గుర్తుచేసింది. ఆ తర్వాత 1995లో సరళాముద్గల్ కేసు విషయంలో 2000లో లిల్లీ థామస్ కేసు విషయంలోనూ గుర్తుచేసింది. కానీ తాము పార్లమెంటుకు చట్టం చేయాల్సిందిగా ఎక్కడా ఆదేశించలేదని స్పష్టం చేసింది. 2015లో మరోసారి సుప్రీంకోర్టు ఉమ్మడి పౌరస్మృతిపై సమీక్ష చేసి దాన్ని అమల్లోకి తేవడానికి సిద్ధంగా ఉన్నారా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. ఇక లా కమిషన్ విషయానికి వస్తే.. 2016, 2018లలో ఉమ్మడి పౌరస్మృతి విషయంలో ప్రజల అభిప్రాయాలు తీసుకొని 2018లో 21వ లా కమిషన్ ఈ సందర్భంలో దాని అవసరం లేదు. కొంత ప్రమాదకరమని చెప్పింది. అయితే ఉమ్మడి పౌరస్మృతి ఉమ్మడి జాబితాలోని అంశం. 1970 నుంచి రాష్ర్టాలు తమ సొంత పౌరస్మృతిని వారి ప్రజలకు అనుగుణంగా తయారు చేసుకుంటూ వచ్చారు. 2005లో దేశంలోని మహిళలకు ఆస్తుల్లో సమాన వాటా కల్పించారు. కానీ, అంతకంటే ముందే దేశంలో దాదాపు 5 రాష్ర్టాలు ఈ చట్టాన్ని అమల్లోకి తేచ్చాయి. 2019లో ట్రిపుల్ తలాక్ను నేరంగా మార్చుతూ చట్టం చేసింది కేంద్రం. మన దేశంలో గోవా, పుదుచ్చేరిలలో ఉమ్మడి పౌరస్మృతి ఇప్పటికే అమల్లో ఉన్నది.
140 కోట్ల జనాభాతో భిన్న మతాలు, నమ్మకాలు, ఆచారాలున్న భారత్ వంటి దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలుచేయడం అత్యంత క్లిష్టమైన విషయం. రాజ్యాంగ నిర్మాతలు చెప్పినవిధంగా నిర్బంధంగా కాకుండా, స్వచ్ఛందంగా ప్రజల అంగీకారం ఉన్నప్పుడే దాని అమలుగురించి ఆలోచించాలి. ముఖ్యంగా మైనారిటీల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నది. మన దేశంలో మెజారిటీ హిందూ సమాజంలోనే ఉమ్మడి పౌరస్మృతి లేదు. హిందూ సమాజంలోని వివిధ కులాలు, ప్రాంతాల మధ్య ఆచార, వ్యవహారాల్లో, పండుగల విషయంలో భిన్నత్వం ఉన్నది. దేశంలో హిందూ మతంలోని వివిధ గిరిజన తెగలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే వారి ఆచార వ్యవహారాలు చాలా భిన్నంగా ఉంటాయి.
బీజేపీ ఆవిర్భవించిన నాటినుంచి ఆ పార్టీకి ప్రత్యేకమైన రాజకీయ విధానం ఏదీ లేదు. ప్రతి ఎన్నికల్లో ప్రజలను మతం ఆధారంగా విడదీయడం, దానిద్వారా లబ్ధి పొందడం ఆ పార్టీ అవలంబించే విధానం. ఇప్పుడు 2024 ఎన్నికలకు కూడా అటువంటి కుటిల రాజనీతితో సిద్ధమైంది. ఉమ్మడి పౌరస్మృతిని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందు దాన్ని తెరమీదికి తీసుకువచ్చింది. దేశంలో ప్రతిపక్షపార్టీలను బీజేపీకి వ్యతిరేకం కావడంతో ఇక గత్యంతరం లేక దేశాన్ని మతం ఆధారంగా విభజించి లబ్ధి పొందాలనే ఆలోచనతో ఉమ్మడి పౌరస్మృతిని ఉన్నపళంగా ప్రజలపై బలవంతంగా రుద్దాలని చూస్తుంది. ఒకే భాష, ఒకే ఎన్నిక, ఒకే చట్టం అనే ఆచరణ సాధ్యం కాని విషయాల్లో దేశాన్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఇంకా దేశ ప్రజలు ఊరుకుంటే ప్రజల వస్త్రధారణ, ఆహారపు అలవాట్లపై కూడా బీజేపీ చట్టాలు చేస్తుంది. అందుకే 2024లో దేశ ప్రజలు ఈ మత రాజకీయాలకు పాతరవేసి, అభ్యుదయ భారతదేనికి స్వాగతం పలకాలి.
-రాగి శ్రీనివాస్రెడ్డి
99850 98432