యూదులు పాలస్తీనాలో నివసించటం పవిత్ర హక్కుగా తమకు తామే ప్రకటించుకున్నారు. అందులో భాగంగానే 19వ శతాబ్దం చివరి నుంచి పలు ప్రాంతాల నుంచి యూదులు పాలస్తీనాకు వలసవచ్చారు. క్రమంగా పాలస్తీనాలో చొరబడి స్థానిక అరబ్ల సంఖ్యను మించిపోయారు. అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించి, అమెరికన్ సామ్రాజ్యవాద సహకారంతో 1948లో ‘ఇజ్రాయెల్’ అనే కొత్త దేశాన్ని ప్రకటించుకున్నారు.
‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’
– శ్రీశ్రీ
వాస్తవానికి 1948కి ముందు ప్రపంచ రాజకీయ పటంలో ‘ఇజ్రాయెల్’ అనే దేశమే లేదు. నాటినుంచి పాలస్తీనా నిత్యం మండే రావణకాష్టం, ఓ నెత్తుటి ప్రవాహం. యూదుల దాడిని తట్టుకోలేక పాలస్తీనాలోని అరబ్లు పక్క దేశాలైన జోర్డాన్, లెబలాన్, సిరియా, ఈజిప్ట్ తదితర దేశాల్లో శరణార్థులుగా శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. చివరికి తమ సొంత దేశంలో సైతం శరణార్థులుగా మిగిలిపోయారు. 75 ఏండ్లుగా నానా బాధలు పడుతూ జీవచ్ఛవాలుగా జీవిస్తున్నారు. తమ మాతృభూమిపై మమకారం, తిరిగి దాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ఎన్ని దెబ్బలు తిన్నా, త్యాగాలు చేస్తూ పోరాడుతునే ఉన్నారు. శత్రువుది సామ్రాజ్యవాద బలం, కండకావరం అయితే, వారిది ఆత్మస్థయిర్యం. పక్క దేశాల్లో తలదాచుకొని పోరాటం చేయడం పాలస్తీనా ప్రజలతోనే సాధ్యమైంది. కాళ్ల కింద నేల ఉంటే నిలదొక్కుకొని, నిలబడి పోరాటం చేయవచ్చునని, విజయం సాధించవచ్చని చైనా, వియెత్నాం ప్రజలు నిరూపించారు. కానీ, సొంత భూమిలో నిలువ నీడలేక, కాళ్ల కింద నేల కోసం పోరాటం చేయవలసి రావడం చరిత్రలో అత్యంత విషాదం.
1933 తర్వాత యూరప్లో నాజీయిజం, ఫాసిజం బలపడి యూదు వ్యతిరేకత తీవ్రమై సుమారు 57.5 లక్షల యూదులను నాజీలు హతమార్చారు. దీంతో యూదులు పాలస్తీనాకు పెద్ద ఎత్తున వలస వచ్చి తలదాచుకున్నారు. పాలస్తీనా అరబ్ ప్రజలు వీరిని ఆహ్వానించి దయతో ఆశ్రయం ఇచ్చారు. అయితే ఏండ్లు గడిచినకొద్దీ పాలస్తీనాలో యూదుల జనాభా పెరిగిపోయింది. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.
1948 మే 18న యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని సొంత దేశంగా, పాలస్తీనాలో తాము ఆక్రమించుకున్న భూ భాగంలో ప్రకటించుకున్నారు. దీంతో ఇక్కడ అప్పటినుంచి యుద్ధ వాతావరణం ఏర్పడింది. అలాగే అమెరికా, ఇతర బడా దేశాల ఆయుధాలు, అండదండలతో ఇజ్రాయెల్ దూకుడుగా పాలస్తీనా భూభాగాలను ఆక్రమించుకుంటూ రోజురోజుకు ముందుకుపోయింది. దీన్ని సహజంగా స్థానికులైన పాలస్తీనీయులు ప్రతిఘటిస్తున్నారు. అది నేడు ఈ దశకు చేరుకున్నది.
బడా దేశాల జేబు సంస్థ అయిన ఐరాస పశ్చిమాసియాలో సార్వభౌమ అధికారం గల స్వతంత్ర దేశమైన పాలస్తీనాను 2012 దాక గుర్తించలేదు. సభ్యత్వం కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పాలస్తీనా విమోచనానికి యాసర్ అరాఫత్ నాయకత్వంలో పీఎల్వో (పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్) ఏర్పడింది. ఇది కొంతకాలం పాటు సాయుధ పోరాటం కొనసాగించి, క్రమేణా సంప్రదింపులు, సంధి చేసుకోవడం వంటి మెతక వైఖరి అవలంబించటంతో 1987లో సాయుధ పోరాటంతో పాలస్తీనా విమోచనమే లక్ష్యంగా ‘హమాస్’ ఏర్పడింది. దీంతో సంక్షోభం మరింత ముదిరింది. నేటి ఈ పరిస్థితులకు పూర్తి బాధ్యత ఇజ్రాయెల్దే. పాలస్తీనా తన అస్తిత్వం కోసం ఆరాటపడుతూ ఉన్నది. వీరిది ధర్మాగ్రహం, పోరాటం. ఏండ్ల తరబడి అణచివేతకు ప్రతీకారమే నేటి ఈ తాజా దాడి. వాస్తవం ఇది కాగా ఇజ్రాయెల్, అమెరికా బడా పెట్టుబడిదారులకు పుట్టిన విష మీడియా హమాస్ను తీవ్రవాద, ఉగ్రవాద సంస్థ అంటూ ప్రచారం చేస్తున్నాయి.
వాస్తవానికి ప్రపంచంలో భయంకరమైన ఉగ్రవాద దేశం అమెరికానే. ప్రతి చిన్నదానికి ఇతర దేశాల ఆంతరంగిక సమస్యల్లో వేలుపెట్టి, కలహాలు పెట్టి యుద్ధాలు సృష్టించి ఆయుధాలు అమ్ముకుంటూ ఆయా దేశాల్లో రక్తం పారించిన చరిత్ర అమెరికాది. నేడు ప్రపంచమంతటా న్యాయమైన తమ సహజ హక్కులు, గౌరవంగా జీవించటం కోసం విధిలేని పరిస్థితుల్లో ప్రజలు పోరాటాలకు దిగితే వారిని తీవ్రవాదులు, ఉగ్రవాదులుగా ముద్రవేయడం మామూలైపోయింది. రోజురోజుకు పాలస్తీనీయున్ల న్యాయపోరాటానికి ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరుగుతూ ఉన్నది. గతంలో అలీన విధానంతో బడుగు దేశాలకు అండగా నిలబడిన భారతదేశం నెహ్రూ హయాం నుంచి పాలస్తీనాకు అండదండలు అందించింది. కానీ, నేడు మోదీ ప్రభుత్వం మాత్రం ఇజ్రాయెల్కు భారత్ అండగా ఉంటుందని ప్రకటించారు. దీన్ని బట్టి బీజేపీ విదేశాంగ విధానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
పశ్చిమాసియా ఒక వనరుల గని. అపారమైన చమురు సంపదకు నిలయం. ఈ వనరుల మీద కన్నేసిన అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలు ఈ సంపదను దోచుకోవడానికి మంటలు రాజేసి చలి కాచుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికా అన్నదమ్ములైన ఇరాన్-ఇరాక్ మధ్య చిచ్చు పెట్టి యుద్ధం సృష్టించింది. ఇరాక్ను దురాక్రమించి వల్లకాడుగా మార్చివేసింది. ఆఫ్గనిస్థాన్ను శ్మశానంగా మార్చివేసింది. ఇక సిరియా సంక్షోభం అంతా ఇంతా కాదు.
మొత్తం పశ్చిమాసియాను శరణార్థి శిబిరంగా మార్చివేసింది. ఇదంతా సామ్రాజ్యవాదం సృష్టించిన మానవ సంక్షోభం. పాలస్తీనా ప్రజలు వారి మనుగడ కోసం సొంత భూమిలో నిలువ నీడ కోసం పోరాటం చేస్తున్నారు. వారికి యావత్ భారతదేశం అండగా నిలబడాలి. వారి పోరాటం న్యాయమైనది. న్యాయమైన ఈ పోరాటంలో పాలస్తీనా ప్రజల గెలుపు తథ్యం. పాలస్తీనా విమోచనంతోనే సమస్య పరిష్కారం అవుతుంది.
(వ్యాసకర్త: సామాజిక విశ్లేషకులు)
షేక్ కరీముల్లా
97054 50705