శ్రీకంఠం శ్రీధరమూర్తి… సమాజంలో పెద్దగా పరిచయం లేని పేరు. కానీ, ప్రముఖ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ దిన, వార పత్రికలకు మాత్రం బాగా తెలిసిన పేరు. ఆయా పత్రికలు చదువుతున్న పాఠకులకు అక్షరాలు బాగున్నాయా? పేపరు చదివేందుకు అనుకూలంగా ఉందా? అనేది ముఖ్యం. అదిగో.. ఆ అక్షరాలను చెక్కిన శిల్పే.. శ్రీధరమూర్తి.
ప్రముఖ ఫాంటోగ్రాఫర్, డిజైనర్, లిపి పరిశోధనాకారుడు, ప్రత్యేకించి తెలుగు భాషపై అపారమైన ప్రేమ ఉన్నవాడు శ్రీకంఠం శ్రీధరమూర్తి హఠాత్తుగా మన నుంచి దూరం కావడం చాలా బాధాకరం. ముఖ్యంగా పత్రికా రంగానికి తీరని లోటు. ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్న తెలుగు పత్రికలన్నింటి అక్షరాలు ఈ అక్షర శిల్పి ఉలి నుంచి జాలువారినవే. శ్రీధరమూర్తి ఫాంటోగ్రాఫర్, టైపోగ్రాఫర్ మాత్రమే కాదు, మంచి ఆర్టిస్టు కూడా. కొన్ని పత్రికల టైటిల్ లోగోలు కూడా ఆయన డిజైన్ చేశారు. పత్రికా ముద్రణలో ఇప్పుడున్న సాంకేతికత లేని రోజుల్లోనే దాదాపు 35 ఏండ్ల కిందట ఒక ప్రముఖ పత్రికకు అక్షరాలు తయారు చేశారు. అప్పుడు టైప్ సెట్టింగ్, బ్రోమైడ్ పేపర్ మీద ప్రింట్ వచ్చేది. దాన్ని డెస్క్ వాళ్లు కటింగ్లు చేసుకొని పేజీ మేకప్ చేసేవారు. ఇప్పుడంటే అంతా కంప్యూటర్మయం. పేజీలన్నీ కంప్యూటర్లలో క్వార్క్ ఎక్స్ప్రెస్, ఇన్డిజైన్ లాంటి సాఫ్ట్వేర్లతో తయారవుతున్నాయి.
శ్రీధర్ గారికి అక్షరమంటే ఎంతో ప్రీతి. అది ఏ భాషదైనా కానీ.. దానికో అందమైన రూపునిచ్చేవరకు నిద్రపోని వ్యక్తి. అలా గిరిజన భాషల లిపులకు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని గిరిజన-ఆదివాసీ అధ్యయన కేంద్రం పర్యవేక్షణలో ఫాంట్లు తయారుచేశారు. ఇంగ్లిషులా కాకుండా తెలుగు, కన్నడ లిపులకు వత్తులు, దీర్ఘాలు, ద్విత్వాక్షరాలు అతి పెద్ద సమస్య. ఈ భాషలకు ఫాంట్లు తయారు చేసే క్రమంలో అవన్నీ గుర్తుంచుకొని, ఒకదాని కింద ఇంకొకటి వచ్చినప్పుడు అవి తాకకుండా అమర్చాలి. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. తెలుగుకు అసలు ఫాంటే లేని రోజుల్లో శ్రీధరమూర్తి పడ్డ కష్టం మామూలుది కాదు.
ఆయన అపార పరిశోధన జరిపారు. దీనికోసం ఆయన పలు దేశాలు పర్యటించి, వారి వారి భాషలను కంప్యూటరీకరణ ఎలా చేస్తున్నారో పరిశీలించారు. భారతీయ భాషలకు కంప్యూటర్ లిపి లేకపోవడం వల్ల గొప్ప గొప్ప గ్రంథాల డిజిటలైజేషన్ సాధ్యం కావడం లేదనే బాధ అయనను కలచివేసింది. దాంతో ఈ రంగంలో విస్తృతంగా పరిశోధనలు నిర్వహించారు. చివరికి ఫాంట్ల రూపకల్పనలో అమోఘమైన పట్టు సాధించి పలు భారతీయ భాషలకు అక్షరాలు రూపొందించారు.
‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఫాంట్లు తయారుచేయాలని అప్పటి టీఆర్ఎస్ అధినేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్గారు ఎడిటర్ అల్లం నారాయణ గారిని, సీఈఓ కట్టా శేఖర్రెడ్డి గారిని ఆదేశించినపుడు మరో ఆలోచన లేకుండా శ్రీధరమూర్తిగారిని పిలిపించాం. సాంకేతికంగా అత్యున్నతస్థాయిలో రానున్న పత్రిక కాబట్టి, ఫాంట్లు కూడా ఉన్నత సాంకేతిక విలువలతో కూడి ఉండాలనడంతో, ఆయన చాలా కష్టపడి ఫాంట్లు తయారు చేశారు. ఏ మెషిన్ మీద ముద్రిస్తారు? ప్లేట్ ఎలా తయారవుతోంది? అనే విషయాలు కూడా తెలుసుకొని ఇప్పటికీ కూడా ఎవరి దగ్గరా లేని 16-బిట్ సాంకేతికతతో టెస్ట్ ఫాంట్లు తయారుచేశారు. దాంతో అక్షరం అత్యంత సుందరంగా తయారైంది. ఒక్కో అక్షరాన్ని అరవై, డబ్భు రెట్లు పెద్దగా చేసుకొని, నేనూ, మా చీఫ్ ఆర్టిస్ట్ భానుప్రసాద్ పరిశీలించేవాళ్లం. ప్రతీసారి ఆయన రూపొందించిన అక్షరాలను డమ్మీ ప్రింట్ చేసి, మార్పులు సూచిస్తే, ఆయన వాటిని సవరించి మళ్లీ ఇచ్చేవారు. ఇలా ఫాంట్ల కోసమే 3 నెలలు పరిశ్రమించాం. మా శ్రమకు ఫలితం దక్కింది. అద్భుతమైన అక్షరాలు రూపొందాయి. పేపర్ ప్రారంభమయ్యాక, పాఠకుల నుంచి, ఏజెం ట్ల నుంచి వచ్చిన ప్రశంసలు నేటికీ మరిచిపోలేం. ఈ రోజుకు కూడా ‘నమస్తే తెలంగాణ’ అక్షరం బాగుంటుందని ఎవరైనా ప్రశంసిస్తే ఆ క్రెడిట్ శ్రీధరమూర్తి గారికే దక్కుతుంది.
ఈ తరం ఫాంట్ల సాంకేతికత అయిన యూనికోడ్ ప్రారంభమైనప్ప టి నుంచి ఆయన మరలా ప్రస్తుత ఫాం ట్లను యూనికోడ్కు మార్చే విషయంలో మైక్రోసాఫ్ట్, గూగుల్కు ఎంతో సహాయపడ్డారు. ఆయన చూపిన బాటలో నేడు మరికొంత మంది అద్భుతమైన అక్షర శిల్పులు తెలుగు నాట వెలిగిపోతున్నారు. భౌతికంగా శ్రీధరమూర్తి గారు మన మధ్య లేకపోయినప్పటికీ తెలుగు అక్షరం ఉన్నంతకాలం ఆయన ఒక ధృవతారలా ప్రకాశిస్తూనే ఉంటారు.
ఫాంట్ల కోసమే మూడు నెలలు పరిశ్రమించాం. మా శ్రమకు ఫలితం దక్కింది. అద్భుతమైన అక్షరాలు రూపొందాయి. పేపర్ ప్రారంభమయ్యాక, పాఠకుల నుంచి, ఏజెంట్ల నుంచి వచ్చిన ప్రశంసలు నేటికీ మరిచిపోలేం. ఈ రోజుకు కూడా నమస్తే తెలంగాణ అక్షరం బాగుంటుందని ఎవరైనా ప్రశంసిస్తే ఆ క్రెడిట్ శ్రీధరమూర్తి గారికే దక్కుతుంది.
– చెర్మాల శ్రీనివాస్
91827 77888