నేడు తెలంగాణ సారస్వత పరిషత్తు 79వ స్థాపన దినోత్సవం జరుపుకొంటున్నది. తెలంగాణలోనే కాకుండా యావత్ తెలుగు సమాజంలో భాషా సాహిత్యాల వికాసానికి పాటు పడుతున్న సారస్వత పరిషత్తుకు సుదీర్ఘ చరిత్ర ఉన్నది.
తెలుగు భాషా వికాసాల కోసం, నిజాం పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమం సాగింది. ఆంధ్రజన సంఘం శాఖోపశాఖలుగా విస్తరించి ఉద్యమవ్యాప్తికి కృషి చేసింది. ఆంధ్ర మహాసభలో రాజకీయాంశాలకే గాని సాంస్కృతికాంశాలకు ప్రాధాన్యం లేదు. అటువంటి పరిస్థితుల్లో 1943 మే 26, హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో లోకనంది శంకరనారాయణ రావు అధ్యక్షతన సమావేశమై తెలుగు భాషా సంస్కృతుల వికాసం కోసం ఒక సంస్థ ఉండాలని తీర్మానించారు. ‘నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు’ను ఏర్పాటు చేశారు. మాడపాటి హనుమంతరావు, బుక్కపట్నం రామానుజాచార్యులు, సురవరం ప్రతాపరెడ్డి, లోకనంది శంకరనారాయణరావు, బూర్గుల రామకృష్ణారావు, చిదిరెమఠం వీరభద్రశర్మ, ఆదిరాజు వీరభద్రరావు, నందగిరి వెంకటరావు, కోదాటి నారాయణరావు, గడియారం రామకృష్ణశర్మ, భాస్కరభట్ల కృష్ణారావులతో పదకొండు మంది సభ్యులతో ఏర్పాటైన ఉపసంఘం పరిషత్తు నియమావళిని, ప్రణాళికను సిద్ధం చేశారు.
1948 నిజాం రాష్ట్రం భారత యూనియన్లో విలీ నం కావడంతో పరిషత్తు కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. 1949 ఫిబ్రవరి 4,5,6 తేదీల్లో తూప్రాన్లో జరిగిన ఐదవ మహాసభల్లో ‘నిజాం రాష్ట్ర’ పదం తొలగిపోయి ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’గా అవతరించింది. బూర్గుల రామకృష్ణారావు అభివర్ణించినట్లు ‘సూర్యుని వెలుతురు సోకని చోటు లేదన్నట్లు పరిషత్తు తెలుగు వెలుగు సోకని ప్రాంతం లేదు’. కొద్దికాలానికే పరిషత్తు పెద్దలతో కూడిన ఉపసంఘం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంటరు, డిగ్రీ స్థాయిలో కూడా తెలుగు ఒక అధ్యయనాంశంగా బోధన జరిగేలా కృషి చేసింది.
పరిషత్తు నిర్వహించిన మహాసభల్లో నేటికీ చెప్పుకోదగినవి అలంపూర్లో జరిగిన సప్తమ మహాసభలు. ఆ సభలు 1953 జనవరి 11 నుంచి 14 వరకు అత్యంత వైభవంగా జరిగాయి. అలంపూర్ వంటి గ్రామంలో సభలు జరిగితే తెలుగునాడంతా తరలివచ్చింది. 30 వేల మంది పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఉప రాష్ట్రపతి వెంట వచ్చారు. దేవులపల్లి రామానుజరావు అధ్యక్షులు. ఆ సభల్లోనే కాళోజీ ‘నా గొడవ’ ను శ్రీశ్రీ ఆవిష్కరించారు. విశ్వనాథ స్నాతకోపన్యాసం చేశారు.
అనేక గొప్ప గ్రంథాలను పరిషత్తు ప్రచురించింది. సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ పరిషత్తు ప్రచురణే. కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి 1955 లో తొలిసారి తెలుగు వారికి అవార్డు లభించిన గ్రంథమది. మహాభారతోపన్యాసాలు, మహాభాగవతోపన్యాసాలు ఇలా వందల సంఖ్యలో ప్రచురించింది. ఇప్పటికీ పరిషత్తు విక్రయకేంద్రంలో అవి అందుబాటులో వున్నాయి. సుమారు 20 వేల అరుదైన గ్రంథాలతో గ్రంథాలయం కొనసాగు తున్నది. 50 ఏళ్ళుగా ప్రాచ్య కళాశాలను నిర్వహిస్తున్నది. 50 ఏండ్ల పాటు దేవులపల్లి రామానుజరావు పరిషత్తుకు సేవలందించారు. తర్వాత డా.సి.నారాయణరెడ్డి 1993 నుంచి అంతిమశ్వాస వరకు 25 ఏండ్ల పాటు అధ్యక్షులుగా వుండి పరిషత్తును ఆధునిక యుగంలో నడిపించారు. తెలంగాణ రాష్ర్టంగా ఏర్పడిన తర్వాత 2015 లో ఆంధ్ర సారస్వత పరిషత్తును తెలంగాణ సారస్వత పరిషత్తుగా మార్చారు. తెలంగాణ 33 జిల్లాల చరిత్ర సం స్కృతి, సాహిత్యం కళలు ఇత్యాది అంశాలతో సమగ్ర గ్రం థాలను వెలువరిస్తూ తెలుగు భాషా సాహిత్యాల వికాసం కోసం విశేషంగా కృషిచేస్తున్నది.
కేసాని నరసింహారావు, 99637 56675