చెవిలో చిన్న పూలు పెడితే, ఇతరులు మాట్లాడేది వినిపిస్తుంది. కానీ తామర లాంటి పెద్ద పువ్వు పెడితే అది చెవిని కప్పేసి ఏమీ వినిపించదు. అదే కావాలి రాజకీయ నాయకులకు. ముఖ్యంగా పువ్వు గుర్తు పార్టీకి!
బతుకడానికి తిండి అవసరమని గుర్తించిన మనుషులు నాగరికత పెరిగిన కొద్దీ వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఇక నాగరికత పెరిగాక విజ్ఞానం కోసం ఇంకా ప్రగతి సాధించటానికి విద్య అవసరమని గుర్తించారు. జంతువులకు లేనిది, మనిషికి మాత్రమే ఉన్న అపారమైన మేధస్సును సానపెట్టే సాధనం విద్య అన్న విషయం లోకంలో గుర్తించబడింది. ఈ రెండు విషయాల్లో ప్రగతి సాధించిన దేశాలే ప్రపంచానికి దిశానిర్దేశం చేసే నాయకత్వానికి ఎదిగాయి, ఎదుగుతున్నాయి.
ఇక ఇప్పుడు భారతదేశం పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. జీవితానికి మొట్టమొదటి అవసరమైన ఆహారాన్ని అందించే వ్యవసాయం, దానిని నిర్వహించే రైతుల పరిస్థితి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక చాలా దిగజారింది. ఎన్నో ప్రమాణాలు చేసి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ 2015లో శాంతకుమార్ కమిటీ ఇచ్చిన రిపోర్టులోని అంశాలను ఇప్పటిదాకా పట్టించుకోలేదు. పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టి కొద్ది మార్పులతో ప్రవేశపెట్టినా, లేక తమ పథకాలంటూ కొన్నింటిని ప్రవేశపెట్టినా రైతుల పరిస్థితి, వ్యవసాయరంగం, మార్కెట్లు.. వేటిలోనూ అన్నదాతకు ఊరట లభించే ప్రగతి కనపడటం లేదు. 2014 నుంచి ఇప్పటిదాకా వ్యవసాయరంగంలో రైతుల వెతలు పెరిగాయే కానీ తగ్గలేదు. ‘కృషీవలుడి సంతోషం కోసం’ అన్న ముసుగులో కార్పొరేట్ చట్టాలను రైతుల మీద రుద్దుదామనుకున్న మోదీ ప్రభుత్వానికి చుక్కెదురైం ది. పొలంలోనే కాదు, తమ పట్టుదలను దేశ రాజధానిలో కూడా చూపించి ప్రధాని తమకు క్షమాపణ చెప్పేటట్టు చేశారు రైతులు. ఈ ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో సామాన్యుడికి అవసరమైన ప్రతీ వస్తువు ఖరీదు నాలుగు నుంచి పది రెట్లు పెరిగింది. ఫలితంగా దిగువ, మధ్యతరగతి ప్రజలు బీద స్థితికి, బీద ప్రజలు దిక్కులేని స్థితికి పడిపోయారు.
ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధానాలు ఒక్కటీ ప్రవేశపెట్టకుండా మోదీ ప్రభుత్వం నిత్యావసరాల ధరలను కూడా పెంచేస్తుంటే పేద, మధ్య తరగతి ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఒకవైపు దేశంలోని కుబేరులు ప్రపంచ సంపన్నుల జాబితాలో చేరుతుంటే విద్య, ఉద్యోగం, వ్యవసాయానికి సాయం అందక యువత, రైతులు దిగాలు పడిపోతున్నారు. దేశ ప్రగతి అంటే జనాభాలో 5 శాతం కూడా లేని వ్యక్తులు ప్రపంచ కుబేరులవడమా? మిగిలిన 95 శాతం ప్రజల కనీస అవసరాలు తీర్చడమా? బీజేపీని సమర్థించేవారు లోతుగా ఆలోచించాలి.
బీజేపీ హయాంలో మనిషి ప్రతిభను పెంచే సాధనమైన విద్య అధోగతి పాలైంది. చాలా మార్పులు చేశామంటూ ప్రతిష్ఠాకరంగా నూతన విద్యా విధానాన్ని తెస్తున్నది కేంద్రం. ‘గుర్రాలు తయారుగా ఉన్నాయి అంటే బండి వెనుక కట్టండి’ అన్నట్టు విద్యా విధానాన్ని రూపొందించారు. అసలు బహుభాషల సమాహారంగా ఉన్న ఈ దేశంలో సరైన భాషా బోధన సిద్ధాంతాలే అమలులో లేవు. విద్యను అందించవలసిన మాధ్యమమైన భాష గురించే పట్టించుకోనప్పుడు ఇక విద్యా విధానం ఏం బాగుపడుతుంది? ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలని నిర్ణయించారు. 1960ల నుంచి 1990ల దాకా అలా చదివే కదా భారతీయ విద్యార్థులు వెనుకపడింది. ఇక పైస్థాయి చదువు విషయంలో యూజీసీ చేస్తున్న విధానాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉన్నతస్థాయి విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బందికి పీహెచ్డీ అవసరం లేదట, కానీ డిగ్రీ వరకు చదివిన వాళ్లందరూ పీహెచ్డీ చేయవచ్చట! చేశాక ఏం చేస్తారు? అసలు ఇన్ని కోట్ల మందికి పీహెచ్డీ చేయటానికి అవకాశం ఇవ్వడం అంటే ఇంకా ఎన్ని విశ్వవిద్యాలయాలు కావాలి? ఎందరు ఆచార్యులు అవసరమవుతారు? పీహెచ్డీకి కావలసిన సౌకర్యాలన్నీ యూనివర్సిటీల్లో ఉన్నాయా? రాష్ర్టానికి ఒక కోటి మంది పట్టభద్రుల చొప్పున పీహెచ్డీలు చేస్తే వారికి ఉద్యోగాలు దొరుకుతాయా? ఇప్పటికే కేంద్రం నిర్లక్ష్యం, నిరాసక్తత వల్ల ఉద్యోగాలు రావటం లేదని నిరాశ చెందిన యువతీ యువకులు ఇంకా కుంగిపోరా? బీజేపీ నాయకులను నిలదీయరా?
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు విషయాలు దేశ మేధావులను కలవరపెడుతున్నాయి. ఒకటి ధరల పెరుగుదల. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధానాలు ఒక్కటీ ప్రవేశపెట్టకుండా మోదీ ప్రభుత్వం నిత్యావసరాల ధరలను కూడా పెంచేస్తుంటే పేద, మధ్య తరగతి ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఒకవైపు దేశంలోని కుబేరులు ప్రపంచ సంపన్నుల జాబితాలో చేరుతుంటే విద్య, ఉద్యోగం, వ్యవసాయానికి సాయం అందక యువత, రైతులు దిగాలు పడిపోతున్నారు. దేశ ప్రగతి అంటే జనాభాలో 5 శాతం కూడా లేని వ్యక్తులు ప్రపంచ కుబేరులవడమా? మిగిలిన 95 శాతం ప్రజల కనీస అవసరాలు తీర్చడమా? బీజేపీని సమర్థించేవారు లోతుగా ఆలోచించాలి.
మతాల మధ్య బీజేపీ పెడుతున్న చిచ్చు ఇంకొక ప్రమాదకరమైన అంశం. ఏ రాష్ట్రంలో అధికారం పొందాలను కుంటే అక్కడ ఆ పార్టీ స్థానిక నేతల భాష చూస్తే… ‘సంగ్రామం’, ‘యుద్ధం’, ‘గద్దె దించుడు’ వంటి మాటలు వస్తాయి. మతవిద్వేషాలు చెలరేగేలా మాటలు తప్ప వారి నోట్లోంచి ఆ రాష్ట్ర ప్రజల అవసరాలు, తమ విధానాలు మాట్లాడరు. గత 8 ఏండ్లలో ఆ రాష్ర్టానికి తాము ఏమి మేలు చేశామన్నది ఒక్క మాట రాదు. ఎందుకంటే, బీజేపీయేతర రాష్ర్టాల పట్ల వివక్ష చూపిస్తున్నారు కాబట్టి. పసుపుబోర్డు, వరద సాయం వంటి విషయాల్లో ఆ నాయకు లు చేసిన వాగ్దానాలను తెలంగాణ ప్రజలు ఒకసారి గుర్తుతెచ్చుకోవాలి. కేంద్రం నిధులతో దుబ్బాక స్వర్గమై పోయిందా అన్న సంగతి చర్చించుకోవాలి.
ఒక విషయం మాత్రం తథ్యం. 2024లో కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే, బ్రెజిల్ దేశంలోలాగా పేద ప్రజలు ఆకలికి తాళలేక సూపర్ మార్కెట్లను కొల్లగొడుతారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్లలో లాగా మతమౌఢ్యం ప్రబలి ప్రజలను కార్చిచ్చులాగ దహించడం ఖాయం. ఆ పెనువిపత్తు రాకూడదనుకునేవారు, దేశంలో ప్రశాంతత ఉండాలని కోరుకునేవారు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను కేంద్రం నుంచి, రాష్ర్టాల నుంచి వెళ్లగొట్టాలి. అప్పుడే భారతదేశం ప్రగతి సాధిస్తుంది. రాష్ర్టాల ప్రగతిని స్థానిక పార్టీలే సాధిస్తాయి కానీ జాతీయ పార్టీలు కావు.
ప్రొఫెసర్
దంటు కనకదుర్గ