1986, 87ల కాలంలో అనుకుంటా… వ్యక్తిగత పని మీద భువనగిరి ప్రాంతంలోని ఒక గ్రామానికి వెళ్లాను. ఆ ఊరిలో ఉన్న కడు పేదరికం నా కండ్లకు కనపడింది. పొలాలన్నీ బీడువారి పోయి ఉన్నాయి. సాగునీళ్లేమో కానీ, తాగడానికి కూడా సరిపడా నీళ్లు లేవు. మాసిన, చిరిగిన బట్టలు వేసుకొని ప్రజలు అటూ ఇటూ తిరగడం జూసి నా కండ్లు చెమర్చాయి. తినడానికి గడ్డి కూడా లేక గొడ్డూ గోదా పెట్టే కన్నీళ్లను చూస్తే నాకు బాధేసింది. వాటిని చూస్తూ ఆవేదన చెందే బక్కపల్చని రైతుల కండ్లల్లో దైన్యం చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరిలో పుట్టి పెరిగిన నాకు ఒక పల్లెటూరు ఇలా కూడా ఉంటుందని అప్పుడే తెలిసింది.
ఇటీవల, కొన్నేండ్ల తర్వాత.. నరసింహస్వామిని దర్శించుకోవడానికి యాదగిరిగుట్టకు వెళ్లాను. దర్శనం పూర్తయిన తర్వాత గతంలో వెళ్లిన ఊరికే ఇప్పుడూ పోయాను. నేను అక్కడి వెళ్లేసరికి ఆ ఊరి స్వరూపమే మారిపోయి ఉన్నది. అప్పటి ఊరికే వచ్చానా? లేక ఇది వేరే ఊరా అనేంత ఆశ్చర్యం వేసింది నాకు. ఆ ఊరిలోని పొలాలన్నీ పచ్చటి కోక కట్టుకొని నాట్యం చేస్తున్నాయి. రైతులు నవ్వు మొహాలతో పొలం బాట పడుతున్నారు. అభివృద్ధి అంటే ఇది అనేలా అక్కడి వాతావరణం మారిపోయింది. ఇక యాదాద్రి వైభవాన్ని చూడటానికి నాకైతే రెండు కండ్లు చాలలేదంటే అతిశయోక్తి కాదు.
మా పశ్చిమ గోదావరి ప్రాంతంలో మేము కొలిచే దేవుడు కాటన్ మహాశయుడు. నేను వెళ్లిన పల్లెటూరులోని రైతులు కూడా కేసీఆర్ను అలాగే కొలుస్తున్నారు. ‘మీ చేలకు నీళ్లెట్లా?’ అని రైతులను ప్రశ్నిస్తే… ‘బోరు నీళ్లున్నయి, కేసీఆర్ నీళ్లున్నయి’ అని నవ్వుతూ, మురిసిపోతూ సమాధానం చెప్తున్నారు. ఆ రైతుల కండ్లల్లో కాంతి నేను స్వయంగా చూశాను. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించి రైతుల కన్నీళ్లను తుడిచిన కేసీఆర్ కారణజన్ముడు. స్వయంగా రైతు అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ను అపర భగీరథుడని కీర్తించడంలో ఎలాంటి సంశయం అవసరం లేదనిపించింది నాకు.
‘ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయ్, బుల్లెట్ దిగిందా లేదా?’ అనే డైలాగ్ ఏదో సినిమాలో విన్నట్టు గుర్తు. కానీ ఆ డైలాగ్ తెలంగాణలో నిజరూపాన్ని సంతరించుకుంటున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన ‘భారత్ రాష్ట్ర సమితి’ కూడా ఈ దేశంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతుందనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.
నిడదవోలు , పూర్ణచందర్
98491 13315