స్వాతంత్య్రం మన జన్మ హక్కు. ఎందరో మహానుభావులు నెత్తురోడ్చి సాధించి పెట్టిన స్వేచ్ఛకు ప్రతి రూపం నేటి భారత్. అమృతోత్సవాలను యావత్ భారతం ఇంటింటా జరుపుకున్నది. యావత్ దేశం ఆనంద డోలికల్లో తేలియాడింది. ఈ ఉద్విగ్న క్షణాల్లో ప్రతి భారతీయుడి తనువు పులకించిపోయింది. ‘ఘర్ ఘర్ తిరంగా’ అన్న నినాదంతో సంబరాలు అంబరాన్ని తాకాయి. అయితే ఇవి మనస్ఫూర్తిగా ఆనందించిన ఘడియలేనా? ఆ మధుర క్షణాల మధ్య కొంత విరామం తీసుకొని, ప్రతి మనిషి తనకు తాను ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన తరుణం ఇది.
మనిషి అనబడే నేటి మనిషికి నిజంగా స్వచ్ఛమైన, సంపూర్ణమైన స్వాతంత్య్రం వచ్చిందా? వస్తే తనకు తాను నేను ఈ దేశంలో స్వతంత్రుడిని అని గుండెపై చేయి వేసుకొని గర్వంగా ఈ ప్రపంచానికి చాటి చెప్పగలడా? ‘ఒక స్త్రీ అర్ధరాత్రి నిర్భయంగా, నిస్సంకోచంగా సంచరించిన నాడు భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్లు’ అని మహాత్మా గాంధీజీ అన్నారు. మరి నేటి సామాజిక పరిస్థితుల్లో ‘నిర్భయ’ లాంటి చట్టాలకు ఎంత పదును పెట్టినా, మహిళలపై ఎక్కడో ఒకచోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ దుస్థితిని స్వాతంత్య్రం అని ఎలా అనుకుందాం?
మనిషి జీవితాంతం తను కన్న కలల ఒడిలో తేలియాడుతాడు. ఆకాశమే హద్దుగా తన గమ్యం వైపు ముందడుగు వేస్తాడు. అందులో ఎన్నో ఒడిదుడుకులనూ ఎదుర్కొంటాడు, ఎత్తుపల్లాలను అధిరోహిస్తాడు. ఆ విధంగా తన గమ్యస్థానాన్ని చేరిన ప్రతి మనిషి నేను స్వతంత్రుడనని సగర్వంగా చెప్పగలడు. అయితే నేటి భారతదేశ జనాభాలో ఎంతమంది అలా సగర్వంగా చెప్పగలరనేది ప్రశ్న? నేటి భారతదేశంలో ప్రతిభకు కొదవలేదు, దేశ జనాభాలో యువ శక్తి ఎక్కువగా ఉన్నది. ఇది దేశ ప్రజలందరూ గర్వించదగిన విషయం. అయితే జ్ఞానం, విజ్ఞానం ఉన్న చురుకైన యువతలో చాలా మంది తమ కలల సాకారం కోసం అభివృద్ధి చెందిన దేశాల వైపు చూస్తున్నారు. ఏ ప్రభుత్వమూ వారి మేధో వలసలను అడ్డుకోలేకపోతున్నది. ఇలాంటి సామాజిక పరిస్థితుల్లో యువత తమ ఆశల పల్లకిలో స్వతంత్రంగా విహారించగలరా? స్వేచ్ఛా వాయువులను ఆస్వాదించగలరా?
నేటి సామాజిక, సాంఘిక పరిస్థితుల్లో యువత ఎంతో ఒత్తిడికి గురవుతున్నది. అను క్షణం నిర్ణయించుకున్న లక్ష్యాల వైపు పరుగెత్తుతున్నది. అహర్నిశలు శ్రమిస్తున్నది. ఈ నిరంతర పరుగు పందెంలో తమకు తాము ఆనందంగా ఉండలేక పోవడమే కాకుండా తమ చుట్టూ ఉన్నవారిని, తనపై ఆధారపడ్డవారిని, తన చుట్టూ ఉన్న సమాజాన్ని సంతోషంగా ఉంచలేక పోతున్నారు. యువత మనస్ఫూర్తిగా నవ్వుతూ, తమ చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచుతూ సమాజం అంతటినీ ఆనందంగా ఉంచేదెన్నడు? ఈ విషయం దేశ పాలకులకు పట్టదా?
నైపుణ్యం విరివిగా ఉన్న యువతలో కొందరు సంకుచిత భావాలతో, కుచించుకుపోయిన మనస్తత్వంతో ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారు. కుల, మత తత్వాలతో దారుణాలకు పూనుకుంటున్నారు. అక్కడక్కడా పరువు హత్యలకూ తెగబడుతున్నారు. కొందరు యువతలో ‘నాది’, ‘నేను’ అన్న అహం పెరుగుతోంది. మరి వారు… నేను భారతీయుడిని… మేమంతా ఒక్కటే, ప్రతి భారతీయుడు నా సోదరుడు, సోదరీమణి, మేమంతా సమైక్యంగా ఉంటామని సగర్వంగా చాటేదెన్నడు? చెట్లు, నదులు, పక్షులలాగా పరోపకారమే పరమావధిగా, అదే జీవిత సత్యంగా నమ్మి ముందుకు సాగేదెన్నడు?
సామాజిక విలువలకు పట్టం కట్టి, సమానత్వమే సమ సమాజ తత్వంగా భావించి, సమాజాభివృద్ధికి పునాదులు వేసిన నాడు సం పూర్ణ స్వాతంత్య్రం లభించిందని సం తోషించాలి. కులమతాలకు అతీతంగా యువత అందరూ సానుకూల దృక్పథంతో తమ లక్ష్యం వైపు పయనించిన నాడు దేశంలో నిజమైన స్వేచ్ఛా వాయువులు వీస్తాయి. ఆ సమ సమా జ స్థాపనకు, అదురు బెదురు లేని సమాజాభివృద్ధికి ప్రతి భారతీయుడు ముఖ్యంగా యువత నిరంతరం శ్రమించాలి. అప్పుడే మనం ప్రపంచానికి ఆదర్శం గా నిలుస్తాం.
ఎన్.విజయ్కుమార్
94901 66291