ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలపై హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యులైన ప్రొఫెసర్ స్టీవెన్ లెవిట్స్కీ, ప్రొఫెసర్ డేనియల్ జిబ్లాట్ ‘హౌ డెమొక్రసీస్ డై’ (ప్రజాస్వామ్యాలు ఎలా పతనమవుతాయి) అనే పుస్తకం రాశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో, ప్రజాస్వామిక వ్యవస్థలను నిర్వీర్యం చేసే ఈ ఫాసిస్టు పాలకుల వ్యవహార సరళిని వీరు విశ్లేషించారు. ఈ పుస్తకం 2018లో వెలువడింది. ట్రంప్ వంటి నాయకుడు ఎన్నిక కాకుండా అడ్డుకోవాలని, పొరపాటున అధికారానికి వస్తే అతడిని వెంటనే గద్దె దింపడానికి రాజకీయ పక్షాలన్నీ ఏకం కావాలని వారు సూచించారు. ఆ నిరంకుశుడిని సొంత పార్టీవారు కూడా వ్యతిరేకించాలని పుస్తక రచయితలు అభిప్రాయపడ్డారు.
అమెరికాలో ట్రంప్ రావడానికి ముందు అనేకసార్లు డెమొక్రాట్స్, రిపబ్లికన్స్ తమ పార్టీలలోని విద్వేష మనస్తత్వం గల నాయకులను అడ్డుకున్న ఉదంతాలను పుస్తక రచయితలు స్టీవెన్ లెవిట్స్కీ, డేనియల్ జిబ్లాట్ గుర్తు చేశారు. జార్జ్ వాలాస్, మెక్కార్తీ వంటి ఉన్మాద నాయకులు అధ్యక్ష స్థానానికి ఎగబాకకుండా నిరోధించగలిగారు. 1936లో బెల్జియం ఎన్నికలలో హిట్లర్, ముస్సోలినీ ఆర్థిక సహాయంతో ఉన్మాదులు అధికారానికి వచ్చే ప్రమాదం ఏర్పడింది. దీంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, సోషలిస్టులు, లిబరల్స్తో క్యాథలిక్ పార్టీ పొత్తు పెట్టుకున్నారు. ఫిన్లాండ్లో 1929 ఎన్నికల తరువాత ఫాసిస్టులకు వ్యతిరేకంగా మతవాదపార్టీలు సోషలిస్టులతో చేయి కలిపాయి. ఇటీవలే 2016లో ఆస్ట్రియాలో- నిరంకుశ రాడికల్ రైట్ ఫ్రీడమ్ పార్టీ (ఎఫ్పీఓ)ని ఓడించడానికి రైటిస్ట్ పార్టీ తమ ప్రత్యర్థి అయిన గ్రీన్ పార్టీకి మద్దతు ఇచ్చింది.
వ్యవస్థలే ఆయుధాలుగా…
రాజకీయాలతో ఏ సంబం ధం లేని ఫక్తు వ్యాపారి అయిన ట్రంప్ అధికారానికి రావడం అమెరికా ఎదుర్కొన్న పెద్ద ప్రమాదం. ట్రంప్ వంటి నిరంకుశ నాయకులు అధికారంలోకి వస్తే, వారిని నియంత్రించడానికి రాజ్యాంగం, చట్టసభలు, కోర్టులు వంటి ప్రజాస్వామిక వ్యవస్థలు ఉన్నాయి కదా అని బేఫికర్గా ఉంటే సరిపోదు. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు, ప్రజాస్వామ్య కోవిదులు చైతన్యవంతంగా మారాలి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక వ్యవస్థలను మనం కాపాడుకుంటేనే, వాటి నుంచి మనకు భద్రత లభిస్తుంది. లేకపోతే నిరంకుశుడు ఈ వ్యవస్థలనే ఆయుధాలుగా చేసుకొని ప్రజలను అణచివేయాలని చూస్తాడని పుస్తక రచయితలు హెచ్చరించారు. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలను ఉపయోగించుకుని నిరంకుశుడు అధికారానికి వస్తాడో ఆ వ్యవస్థల గొంతునే నులుముతాడు. ప్రజలపై మూక దాడులు చేయిస్తాడు. ప్రత్యర్థులను దేశ ద్రోహులుగా ప్రచారం చేస్తాడు. పార్టీలో, ప్రభుత్వంలో బలమైన నాయకులను అణగదొక్కుతాడు.
అధికార ప్రతిపక్షాల మధ్య రెఫరీ మాదిరిగా తటస్థంగా వ్యవహరించే సంస్థలను ట్రంప్ దెబ్బకొట్టాలనుకున్నాడు. న్యాయమూర్తుల నిజాయితీని ప్రశ్నించాడు. మీడియా అమెరికా ప్రజలకు శత్రువని బురదజల్లాడు. ఎఫ్బీఐ, సీఐఏ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటి గూఢచార సంస్థల అధిపతులు తనకు విధేయంగా ఉండాలని ఒత్తిడి తెచ్చాడు. తనపై దర్యాప్తును నిలిపివేయాలని ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కామేను అడిగాడు. రష్యాతో తనకు సంబంధాలు లేవని ప్రకటించాలని, కామే జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకోవాలని నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ మైకెల్ ఫ్లిన్ను, సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియోను ట్రంప్ కోరాడు. అయినా దర్యాప్తును కామే మరింత విస్తృతంగా కొనసాగించాడు. దీంతో కామేను ట్రంప్ తొలగించాడు. అమెరికా అటార్నీ ప్రీట్ భరారాను కూడా తప్పించాడు.
కొన్ని దేశాల పౌరులు అమెరికా రాకుండా ట్రంప్ విధించిన నిషేధాన్ని కోర్టు కొట్టివేసింది. శరణార్థులకు ఆశ్రయం ఇస్తున్న నగరాలకు నిధులను నిలిపివేయడాన్ని కూడా కోర్టు చెల్లకుండా చేసింది. దీంతో న్యాయమూర్తులపైనా ట్రంప్ నిందలు వేశాడు. రష్యాతో సంబంధాల విషయమై దర్యాప్తులో తాను దోషిగా తేలితే, తనకు తాను క్షమాభిక్ష పెట్టుకునే విషయాన్ని కూడా న్యాయనిపుణులతో చర్చించాడు. నైతిక వ్యవహారాల విభాగం తప్పు పట్టకుండా గత అధ్యక్షులు జాగ్రత్త పడేవారు. కానీ ట్రంప్ ఈ స్వతంత్ర సంస్థ డైరెక్టర్ వాల్టర్ షావుబ్ రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చాడు. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడటానికి న్యాయ వ్యవస్థను, గూఢచార విభాగాలను ఉపయోగిస్తానని ట్రంప్ బహిరంగంగా అన్నాడు. కానీ ఆయనకు సాధ్యం కాలేదు.
జేమ్స్ కామే తదితరుల స్థానాల్లో ట్రంప్ తన విధేయులను నియమించుకోకుండా, సెనేట్ నియమాలను మార్చకుండా సొంత పార్టీ సభ్యులు నిరోధించారు. మీడియా మీద కూడా ట్రంప్ కత్తిగట్టాడు. ‘న్యూయార్క్ టైమ్స్’, ‘సీఎన్ఎన్’ వంటి ప్రఖ్యాత వార్తా సంస్థలు తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయంటూ ఆరోపించాడు.‘మీడియా అమెరికా ప్రజలకు శత్రువు’ అనేది పదేపదే ప్రచారం చేయడం మొదలుపెట్టాడు.ఎన్బీసీ సంస్థను కూడా బెదిరించాడు. యాంటీ ట్రస్ట్ చట్టాలను ఉపయోగించి మీడియాను దెబ్బకొట్టాలని చూశాడు. అయితే మీడియా చాలా మేరకు ఈ ఒత్తిడిని తట్టుకొని నిలిచింది.
ప్రజలు ఓటేయకుండా అడ్డుకోవడానికి ట్రంప్ చేసిన కుచేష్టలను కూడా పుస్తక రచయితలు వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు సులభంగా ఓటు వేయడానికి ఏర్పాట్లు ఉండాలి. ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంటే చాలు ఓటు హక్కును వినియోగించుకోనివ్వాలి. అమెరికాలో బోగస్ ఓటర్ల సమస్య దాదాపు లేదనే చెప్పవచ్చు. కానీ లేని సమస్యను ఉన్నట్టుగా చూపించి అనేక మంది పేదల, మైనారిటీలు ఓటు వేయకుండా నిరోధించడానికి ఒక కమిషన్ను ఏర్పాటుచేశాడు. గుర్తింపు కార్డు విషయమై కఠిన నిబంధనలు పెట్టాడు. మైనారిటీ వర్గాల ఓట్లకు ప్రాధాన్యం లేకుండా చేయడానికి ఆయా స్థానాల పరిధులను మార్చడానికి రిపబ్లికన్లు గతంలో కూడా ప్రయత్నాలు చేశారు. దీన్ని జెరీమాండరింగ్ అంటారు. అయితే ఇటువంటి చర్యలను కోర్టులు కొట్టివేశాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పార్టీ ఉంటుంది, ప్రతిపక్షాలూ ఉంటాయి. ఒకరినొకరు ప్రత్యర్థులుగా భావించినప్పటికీ, శత్రువులుగా పరిగణించరు. కానీ ట్రంప్ వంటి పాలకులు ప్రతిపక్షాలను, భిన్నాభిప్రాయాలున్న వారిని అణచివేయాలని చూస్తారు. అందువల్ల నిరంకుశ లక్షణాలు గలవారిని అధికారానికి రాకుండానే అన్ని పార్టీలు కలిసి అడ్డుకోవాలి.
పొరపాటున అటువంటి నేత అధికారానికి వస్తే, మిగతా శక్తులన్నీ కలిసి అతడిని తదుపరి ఎన్నికలలో ఓడించాలని పుస్తక రచయితలు సూచించారు. సొంత పార్టీవారు కూడా ఆ నాయకుడి నిరంకుశ చర్యలను అడ్డుకోవాలి. అమెరికా చరిత్రలోని ఇటువంటి ఉదంతాలను పుస్తక రచయితలు గుర్తు చేశారు. 1937లో నాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ న్యాయమూర్తుల సంఖ్య పెంచడం ద్వారా న్యాయ వ్యవస్థను చెప్పుచేతల్లో పెట్టుకోవచ్చని భావించాడు. కానీ ఈ బిల్లును ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీతో పాటు సొంత డెమొక్రాటిక్ పార్టీవారు కూడా వ్యతిరేకించారు. ఇదే విధంగా 1970 దశకంలో వాటర్గేట్ కుంభకోణం బయటపడినప్పుడు- అధ్యక్షుడు నిక్సన్ను రిపబ్లికన్ పార్టీకి చెందిన వారే అభిశంసించడానికి సిద్ధపడ్డారు. దీంతో ఆయన అధ్యక్షపదవికి రాజీనామా చేయక తప్పలేదు. అమెరికాలో ట్రంప్ను సొంత పార్టీ సెనేట్ సభ్యులు వివిధ సందర్భాలలో నియంత్రించారు.
ఎంతటి రాజ్యాంగం ఉన్నా ప్రతి ఒక్కటీ రాతపూర్వకంగా ఉండదు. కొన్ని ప్రజాస్వామిక నియమాలు, రాజకీయ మర్యాదలను నాయకులు పాటించాలి. పదవి చేపట్టడానికి ముందు సొంత వ్యాపారాలు ఉంటే వాటితో సంబంధాలను వదులుకోవాలి. వ్యాపార ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ ట్రంప్ తన వ్యాపార ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నట్టు అనేక ఆరోపణలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి (ఎన్నికలు ముగిసిన తర్వాత) ప్రత్యర్థిపై విమర్శలు చేయకూడదు. ఎన్నికల ఉద్వేగాలు చల్లారి కలిసిపోవడానికి వీలుగా ఈ సంప్రదాయం ఏర్పడింది. తనకన్నా ముందు అధ్యక్షులుగా పనిచేసిన వారిని విమర్శించకూడదు. కానీ ట్రంప్ ఏ నియమాలను పాటించలేదు. దేశాధ్యక్ష పదవిలో ఉన్న వారు ప్రజలకు అబద్ధాలు చెప్పకూడదు. కానీ 2016 ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చెప్పిన మాటల్లో 17 శాతం మాత్రమే నిజాలు ఉన్నాయి. తాను ఓడిపోయిన విషయాన్ని కూడా ట్రంప్ అంగీకరించలేదు. రిగ్గింగ్ జరిగిందంటూ అబద్ధపు ఆరోపణలు చేశా డు. ఎన్నికల వ్యవస్థను తప్పుబట్టాడు. జనాన్ని పోగేసి గొడవలు చేయించాడు.
ప్రజాభిప్రాయం బలంగా ఉన్నప్పుడు న్యాయస్థానాలు, ఎన్నికల వ్యవస్థ, గూఢచార సంస్థల వంటి ప్రభుత్వ అంగాలు, మీడి యా ధైర్యంగా పనిచేస్తాయి. ప్రజలు చైతన్యవంతంగా లేకపోతే నిష్పక్షపాతంగా ఉండాల్సిన విభాగాలు ఒత్తిడికి గురవుతాయి.
ఎలా గద్దె దింపాలి?
నిరంకుశ నాయకుడిని అన్ని పార్టీల వారు తమ విభేదాలను పక్కన పెట్టి ఏకమై గద్దె దింపాలి. అయితే ఈ గద్దె దింపే విధానం ప్రజాస్వామికంగానే ఉండాలని ఈ పుస్తక రచయితలు స్పష్టం చేశారు.
ట్రంప్ గెలిచినప్పుడు అతడు అధికారం చేపట్టకుండా ఎవరూ అడ్డుకోలేదు. ఆ తరువాత ప్రతి దశలోనూ ట్రంప్ విధానాలను ప్రజాస్వామ్య బద్ధంగానే ఎదుర్కొన్నారు. నిరంకుశ పాలకుడు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలనే కోరుకుంటాడు. వ్యవస్థలను నాశనం చేయాలని భావిస్తాడు. కనుక ప్రజాస్వామికవాదులు వ్యవస్థలను కాపాడుకుంటూ, వ్యవస్థ పరిధిలోనే నిరంకుశుడిని ఎదుర్కోవాలె. ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడి ట్రంప్ను దింపివేస్తే, ఆ క్రమంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు బలపడుతాయి. సమాజంలో ప్రజాస్వామిక భావజాలం బలపడుతుంది. నిరంకుశ పాలకుడు మతాన్ని, జాతిని ఓట్ల కోసం వాడుకుంటాడు. కానీ నిరంకుశుడు ఏ మతానికి, జాతికి ప్రతినిధి కాదని ప్రజలకు తెలియచెప్పాలి. అమెరికాలో 1960 దశకంలో నల్లజాతి ఉద్యమం అహింసాయుతంగా సాగింది. వారు సమాన హక్కుల కోసం పోరాడారే తప్ప, తెల్లజాతి వారికి వ్యతిరేకంగా కాదు. ఈ అహింసాయుత ఉద్యమానికి తెల్లజాతివారితో సహా అందరి మద్దతు లభించింది. ఈ విధానం ప్రజల హక్కుల ఉద్యమం బలపడటానికి దోహదం చేసింది.
అగ్ని పరీక్షలను అధిగమించిన అమెరికా
అమెరికా ప్రజాస్వామిక వ్యవస్థ రెండు శతాబ్దాలకు పైగా అనేక సవాళ్ళను ఎదుర్కొన్నది. అంతర్యుద్ధం, మహా మాంద్యం, వాటర్గేట్ తదితర కుంభకోణాలు, ప్రచ్ఛన్నయుద్ధ సమస్యల వంటి అనేక విషమ పరీక్షలు ఎదురయ్యాయి. అయినా అమెరికా సమాజం వాటిని అధిగమించింది.
ప్రజాస్వామిక వ్యవస్థలు బలంగా ఉండటం వల్ల అమెరికా వీటిని ఎదుర్కొని నిలిచింది. ప్రజలు ప్రజాస్వామిక సంస్కృతి కలవారు కావడం మరో కారణం. అయినప్పటికీ రాజకీయాలతో సంబంధం లేని ట్రంప్ వంటి వ్యక్తి దేశాధ్యక్షుడు కావడం ఒక విషాదమే. జాతి, మతం పేరిట విద్వేషాలు సృష్టించడం ద్వారా కొన్ని సందర్భాల్లో ఇటువంటి నిరంకుశులు అధికారంలోకి వస్తారు. అందువల్ల ఇటువంటి విద్వేష భావజాలానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడాలని పుస్తక రచయితలు స్టీవెన్ లెవిట్స్కీ, డేనియల్ జిబ్లాట్ పిలుపు ఇచ్చారు. వీరు కోరుకున్నట్టుగానే అమెరికన్ సమాజం స్పందించి ట్రంప్ను 2020లో గద్దె దించింది.
1973 సెప్టెంబర్ 11… చిలీ రాజధాని శాంటియాగో..
అధ్యక్ష భవనం చుట్టూ బ్రిటిష్ తయారీ జెట్ విమానాలు చక్కర్లు కొడుతూ బాంబులు కురిపిస్తున్నాయి. జనరల్ ఆగస్టో పినోచెట్ నాయకత్వంలో సైన్యం తిరుగుబాటు చేసింది. కొన్ని గంటల్లోనే దేశాధ్యక్షుడు అలెండీ హత్య జరిగింది. అతడితోపాటే చిలీలో ప్రజాస్వామ్యమూ బలైపోయింది.
1975 ఆగస్ట్ 15 బంగ్లాదేశ్ రాజధాని ఢాకా…
తెలతెలవారుతుండగా… సైన్యం అధ్యక్ష భవనంలోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్ జాతిపిత, దేశాధ్యక్షుడు ముజిబ్ ఉర్ రహ్మాన్తోపాటు ఆయన కుటుంబ సభ్యులను కాల్చివేసింది. శైశవ దశలో ఉన్న బంగ్లా ప్రజాస్వామ్యమూ నెత్తుటి మడుగులో కన్ను మూసింది.
పాకిస్థాన్, థాయిలాండ్, టర్కీ, బ్రెజిల్, ఘనా, గ్రీస్, నైజీరియా, గ్వాటెమల, పెరు, ఉరుగ్వే… ఇవన్నీ ప్రచ్ఛన్న యుద్ధకాలంలో సైనిక తిరుగుబాట్లకు ప్రజాస్వామ్యం పతనమైన బాపతు నెత్తుటి జాడలు…
ఇప్పుడు కాలం మారింది…
సైనిక తిరుగుబాటు ఉండదు.. తుపాకీ మోతలు ఉండవు, రక్తపు కాల్వలూ ఉండవు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పతనం చేసేది సైనికులు కాదు, ఎన్నికైన నాయకులే! ప్రజాస్వామ్యానికి తలపెడుతున్న హాని మనకు ప్రత్యక్షంగా కనిపించదు.
ట్రంప్ కాలంలో అమెరికా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నది.
అరాచక శక్తుల నుంచి భారత్ను కాపాడుకుందాం..
అమెరికాలో ట్రంప్ ఏ విధంగా నిరంకుశంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించాడో, ఇక్కడ ప్రధాని మోదీ పాలనా తీరు కూడా అదే విధంగా ఉన్నది.
మోదీ దర్యాప్తు సంస్థలను గుప్పెట పెట్టుకొని ప్రత్యర్థులను వేధిస్తున్నారు. మీడియాను కట్టడి చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను హరించే ప్రయత్నం సాగుతున్నది. మోదీ రిజ ర్వు బ్యాంక్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీశారు.
ఆయన పోకడలు నచ్చక ఆర్థికవేత్తలు, ఇతర అధికారులు ఆయనకు దూరమయ్యారు. మోదీ అఖిల భారత సర్వీసుల స్వభావాన్ని దెబ్బ తీస్తున్నారు. ప్రణాళికా విధానాన్ని మట్టుపెట్టారు. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు.
మూక దాడులకు పాల్పడుతూ సంఘ్పరివార్ శక్తులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటున్నాయి. దీంతో రాజ్యాంగ ఉల్లంఘన జరిగి, శాంతిభద్రతలు నశించి అరాచకం నెలకొంటున్నది.
కేంద్రంలో సమర్థవంతమైన, విచక్షణాయుత పాలన లేకపోవడంతో రాష్ర్టాల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. అమెరికాలో ట్రంప్ను ఓడించిన విధంగానే, మన దేశంలో కూడా మోదీని గద్దె దించడానికి ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నీ ఏకం కావలసి ఉన్నది.
– పరాంకుశం వేణు గోపాల స్వామి