రాష్ట్రకూటులను ఓడించి దక్కను రాజకీయ పటంపైకి వచ్చినవారు కళ్యాణి చాళుక్యులు. క్రీ. శ.973 నుంచి 1200 వరకు అంటే సుమారు 227 ఏండ్ల పాటు దక్కనును, అందులోని తెలంగాణను వారు పాలించారు. మాన్యఖేతం నుంచి పాలిస్తున్న రాష్ట్రకూటుల్ని ఓడించినందున వీరి పాలన అక్కడ నుంచి మొదలైనా కొంత కాలానికే రాజధానిని కర్ణాటకలోని కళ్యాణికి (ఇప్పుడు బసవ కళ్యాణి అని పిలుస్తున్నాం) మార్చారు. అందుకే వీరిని కళ్యాణి చాళుక్యులని అంటారు.
బాదామి చాళుక్యుల వారసులుగా చెప్పుకొన్న వీళ్ళు రాష్ట్రకూటుల కింద సామంతులుగా, చిన్న ప్రాంతాలకు అధిపతులుగా ఉండేవారు. క్రీ.శ.973లో రెండవ తైలప.. బాదామి చాళుక్య రాజు కర్కను ఓడించి కళ్యాణి చాళుక్య అధికారాన్ని నెలకొల్పాడు. తెలంగాణ రాజకీయం, దక్కను రాజకీయం ఎప్పుడూ విడిగా లేదు. అందుకే ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్, దక్కన్లో రాజకీయం ఎప్పుడూ ఒక ప్రాంతపు భౌతిక-రాజకీయ ప్రభావంతో ఎదిగిందని వ్యాఖ్యానించారు. రాజధాని తెలంగాణలో లేకున్నా యావత్ తెలంగాణ వీరి పాలన కింద ఉండేది. తెలంగాణలో సంఖ్యలో కాకతీయ శాసనాలకు దీటుగా ఉన్నవి కళ్యాణి చాళుక్యుల శాసనాలు. ఉమ్మడి మెదక్, నల్గొండ, మహబూబ్నగర్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో, అన్నీ కలిపి 300 పైనే కళ్యాణి చాళుక్య శాసనాలున్నాయి.
తెలంగాణపై ప్రభావం
వీరి కాలంలోనే ముఖ్య పట్టణాలుగా ఎదిగిన అనుమకొండ (హనుమకొండ), పటాన్చెరువు, కొలనుపాక, నందికంది, పిల్లలమర్రి, చౌటుకూరు వంటి కేంద్రాలు తర్వాత కూడా ముఖ్య పాలనాకేంద్రాలుగా లేక పెద్దగ్రామాలుగా కొనసాగటం కనిపిస్తుంది. వీరి పాలనలో మొదలైన ‘భూమిజ’ వాస్తు కళారూపమే తర్వాతి కాలంలో వచ్చిన కాకతీయుల ‘వేసర’ వాస్తు శైలిలో భాగం అయింది. వీరి కాలంలో జైనం తెలంగాణలో ఒక ప్రధాన మతంగా వెలిగింది. కల్యాణ చాళుక్య రాజ్యంలో పరిపాలనా విభాగాల పేర్లు పరిశీలిస్తే ఇప్పటి మన తెలంగాణలోని ఎన్నో గ్రామాల చరిత్ర బయటపడుతుంది. రాజ్యాన్ని రాష్ట్రం, విషయం, నాడు, కంపణ, వాడి అని విభజించారు. ముఖ్య పట్టణాల పేరిట ఏర్పడిన ఈ పరిపాలనా విభాగాల్లో, గ్రామాల సంఖ్యను కూడా సూచించేవాళ్ళు. పాత మహబూబ్నగర్ జిల్లాలో కందూరు నాడు (అడ్డాకుల ప్రాంతం, 1000/1100 గ్రామాలు), కోడూరు 300, ఐజ 300- ఇలా కనిపిస్తాయి. కొల్లిపాక 7000. యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు దగ్గర ఇప్పుడు కొలనుపాకగా పిలుస్తున్న కొల్లిపాక కళ్యాణి చాళుక్య కాలంలో పరిపాలన, సైనిక పరంగా వ్యూహాత్మకంగా ఒక ముఖ్యకేంద్రం. అంతేకాదు రాజుల నెలెవిడు (అంటే తాత్కాలిక విడిది)గా కూడా ఉండింది.
కొలనుపాకకు ఉన్న ప్రాముఖ్యత వల్ల అది కళ్యాణి చాళుక్య, కాకతీయ కాలంలో జైన కేంద్రంగా, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లింది. కళ్యాణి చాళుక్యులకు చోళులకు మధ్య భీకరమైన యుద్ధానికి కూడా కొలనుపాక రణక్షేత్రమైంది. దీని కింద సబ్ డివిజన్లుగా ఆనెమార్గ-70, ఆలేరు-40, మంధెనపుర-70 ఇలా ఉండేవి. ఆనెమార్గ అంటే కన్నడలో ఏనుగుల మార్గం అని అర్థం. భువనగిరి, యాదగిరిగుట్టలు ఈ ఆనెమార్గలో భాగం. ఉమ్మ డి మెదక్ జిల్లా-కసవులనాడు పాత మెదక్, కరీంనగర్ జిల్లాలను కలిపి సపాదలక్క కసవులనాడు అనే వాళ్ళు. మెదక్ అనే పదం మొదటిసారి మనకు కనిపించింది కళ్యాణి చాళుక్య శాసనాల్లోనే. క్రీ.శ.979 నాటి సీతారాంపల్లి శాసనంలో ఉన్న మెదకి-300 అనే పదం నేటి మెదక్కు మొదటి శాసనాధారం. గజ్వెల్ దగ్గరి సీతారాంపల్లిలో దొరికిన ఈ శాసనం కళ్యాణి చాళుక్య రాజు ఆహవమల్ల ఆజ్ఞతో జారీ చేసినది. ఇందులో ప్రస్తావించిన గ్రామాలు ఇప్పటికీ అవే పేర్లతో ఉన్నాయి. ఉదాహరణకు తూపరాని (తూప్రాన్), రావిపోల్ (రాపోల్) వేల్పూరు, కోర్పోల్- ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. చందనపుర-1000 కింద ఇప్పటి ములుగు, వర్గల్, గజ్వెల్, కొండపాక ప్రాంతాలున్నాయి.
మెదక్ పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్చారం మనకు కళ్యాణి చాళుక్య కాలం నాటి అద్భుతమైన శిల్పసంపదను ఇచ్చింది. 1984లో ఈ గ్రామంలో 10వ శతాబ్దం నాటి జైన బసది అవశేషాలు బయటపడ్డాయి. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది నల్లరాతిపై చెక్కిన 11 అడుగుల పార్శ్వనాథ శిల్పం. ఆ శిల్ప పీఠంపై కళ్యాణి చాళుక్య రాజైన రెండవ తైలప గురించిన ప్రస్తావనతో శ్రీ చాళుక్యకుల తిలకం తైలపరాసర్ అని రాసిన ఒక లఘు శాసనం ఉంది. ఇప్పుడు ఈ శిల్పం కుల్చారం మెయిన్ రోడ్డులో ఉన్న దిగంబర జైన మందిరంలో పూజలు అందుకుంటున్నది. తెలంగాణలో, మెతుకుసీమలో కళ్యాణి చాళుక్య పాలనకు మొదటి ఆధారాలు ఇవే. ఈ కుల్చారమే ఆ తర్వాతి కాలంలో మల్లినాథసూరి వంటి మహాపండితుడి స్వస్థలం.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000