దేశంలో మెట్రో నగరాలుగా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీలను ప్రపంచస్థాయి నగరాలుగా మార్చటానికి కేంద్రం తగిన నిధుల కేటాయింపుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నివేదిక ఇచ్చి విజ్ఞప్తి చేశారు. దేశానికి నాలుగు దిక్కుల్లో ఉన్న ఈ నగరాలను గ్లోబల్సిటీలుగా మార్చటం వల్ల దేశాభివృద్ధిలో ఇవి మరింత కీలకంగా మారుతాయని, అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పారు. ఇది జరిగి ఆరేండ్లు గడిచింది. ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ బృహత్ ప్రణాళికను ప్రధానికి వివరించారు. నిజంగా, దేశాభివృద్ధి పట్ల అనురక్తి ఉన్న పాలకుడైతే ఇంత మంచి మాస్టర్ప్లాన్ ఇచ్చినందుకు భుజం తట్టి అభినందించి మరీ దానిని చిత్తశుద్ధితో అమలుచేయాలి. కానీ, అక్కడున్నది ప్రధాని మోదీ కదా! అందుకే అటకెక్కింది.
ప్రస్తుత ఎండకాలంలో నీరందక దూపకు ఢిల్లీ అల్లాడుతున్నది. ఒక్క ట్యాంకర్ వస్తే దాంట్లో పదుల సంఖ్యలో పైపులు వేసుకొని చుట్టూ మూగిన జనం నీళ్లు పట్టుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 140 కోట్ల జనానికి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీలో ఇటువంటి పరిస్థితులు నెలకొంటే, అది తమకు అవమానం అన్న స్పృహ కూడా కేంద్రంలోని బీజేపీ పాలకులకు ఉన్నట్లు లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య కొట్లాటలు పెట్టేవారికి గ్లోబల్సిటీల వంటి అభివృద్ధి ప్రణాళికల గురించి ఆలోచనలు ఉంటాయనుకోవటం అత్యాశే అవుతుంది. దేశానికి పట్టుకున్న ఈ జాడ్యం కారణంగానే మన మెట్రోలు కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయి. చెన్నై, కోల్కతా, ముంబై ట్రాఫిక్ సమస్యతో, కాలుష్యంతో, తాగునీటి కొరతతో అల్లాడుతున్నాయి. కాస్తంత వర్షం పడితే ముంబై రోడ్లు వరదలో మునిగిపోవటం సర్వసాధారణంగా మారిపోయింది. ఐటీ కేంద్రంగా ఉన్న బెంగళూరులో రోడ్లపై గుంతలు కూడా పూడ్చటం లేదంటూ ఇటీవల పారిశ్రామికవేత్తలే సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న పరిస్థితి.
కేంద్రం నిధులు పైసా ఇవ్వకపోయినా హైదరాబాద్ను తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతున్నది. ఇప్పటికే నగరంలో తాగునీటికి కొరత లేకుండా మిషన్ భగీరథతో నీళ్లు అందుతున్నాయి. అయినా భవిష్యత్తు అవసరాల కోసం సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించింది. హైదరాబాద్ గొంతెండిపోకుండా సుంకిశాల అండగా ఉంటుంది. కొత్తగా నిర్మిస్తున్న రోడ్లు, ఫ్లైఓవర్లు ట్రాఫిక్ కష్టాలను గణనీయంగా తీరుస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ బాగుపడింది. శాంతిభద్రతల పరంగా దేశంలోనే అత్యున్నతస్థానంలో ఉంది హైదరాబాద్. అమెరికా వంటి అగ్రదేశాల్లో మాదిరిగా పోలీస్ ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఎయిర్ట్రాఫిక్లో చెన్నై, కోల్కతాలను హైదరాబాద్ ఇప్పటికే అధిగమించింది. ఆఫీస్ లీజ్ స్పేస్లో బెంగళూరును కూడా దాటేసి దేశంలో నెంబర్వన్ స్థానంలో నిలిచింది. దేశంలో మెట్రోల అభివృద్ధికి మన హైదరాబాద్ దిక్సూచిగా నిలబడింది.