‘ఢిల్లీ చలో’ మార్చ్ ప్రధాన డిమాండ్లలో ఒకటి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన హామీ. ఎంఎస్పీకి హామీ ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఆర్థిక వ్యయం పెరుగుతుందని ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి మీడియా ఆధారిత కథనాలకు ప్రభుత్వం ఆజ్యం పోస్తున్నది. ఏడాదిపాటు సాగిన కిసాన్ ఆందోళనలో అప్పుడు నిరసన తెలిపిన రైతులు చేసిన ప్రధాన డిమాండ్లలో మొదటిది మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేయడం. రెండోది ఎంఎస్పీపై చట్టపరమైన హామీ. మోడీ ప్రభుత్వం చివరికి మొదటిదానికి అంగీకరించినప్పటికీ, రెండోదానికి ఎప్పుడూ కట్టుబడి లేదు.
MSP | ఎంఎస్పీని చట్టబద్ధం చేయడానికి ప్రభుత్వానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది ఎంఎస్పీ చెల్లించాలని ప్రైవేటు కొనుగోలుదారులపై ఒత్తిడి చేయడం. దాంతో మండీ వేలంలో బిడ్డింగ్కు ఫ్లోర్ ప్రైస్గా కూడా ఎంఎస్పీ పని చేస్తుంది. ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీని చెల్లించాలనే నిర్బంధం ఏ పంటకూ లేదు.
రెండో మార్గం ఏమిటంటే, రైతులు పండించే మొత్తం పంటను ప్రభుత్వమే ఎంఎస్పీ ప్రకారం కొనుగోలు చేయడం. సామాజిక సంక్షేమం, వ్యవసాయ సబ్సిడీలు, ఇతర ముఖ్యమైన పథకాల మాదిరి ఇది కూడా రైతులకు ప్రయోజనకరమే.
2019-20లో ఆందోళనకు ముందు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వంటి ప్రభుత్వ సంస్థలు 38.99 మెట్రిక్ టన్నుల గోధుమలను ఎంఎస్పీ ప్రకారం కొనుగోలు చేశాయి. 105.23 లక్షల బేళ్ల పత్తి (ఎంఎస్పీ విలువ రూ.28,202 కోట్లు), 2.1 మెట్రిక్ టన్నుల శనగలు (రూ.10,238 కోట్లు), 0.7 మెట్రిక్ టన్నుల కందిపప్పు (రూ.4,176 కోట్లు), వేరుశనగ (రూ.3,614 కోట్లు)లను కొనుగోలు చేశాయి.
ఎంఎస్పీ హామీ వల్ల ప్రభుత్వానికి రూ.17 లక్షల కోట్ల భారం పడుతుందన్న మోదీ ప్రభుత్వ అంచనా తప్పు. నిర్దేశిత పథకం లేదా ధరల స్థిరీకరణ నిధిలో భాగంగా ఎంఎస్పీని చెల్లించేందుకు ప్రభుత్వానికి వాస్తవ వ్యయం రూ.50,000 కోట్లకు మించకపోవచ్చు. 2019-20లో ఉత్పత్తి అయిన 23 రకాల పంటల మొత్తం ఎంఎస్పీ విలువ సుమారు రూ.10.78 లక్షల కోట్లు. అయితే ఈ ఉత్పత్తులన్నీ మార్కెటింగ్ కావు. రైతులు దానిలో కొంత భాగాన్ని స్వీయ వినియోగం కోసం, తదుపరి సీజన్ విత్తనం కోసం నిల్వ చేసుకుంటారు.
వివిధ పంటల మార్కెట్ మిగులు నిష్పత్తి రాగులకు 50%, జొన్నలకు 65-70%, గోధుమలకు 75%, వరికి 80%, చెరకుకు 85%, పప్పుధాన్యాలకు 90%, పత్తి, జనపనార, సోయాబీన్, పొద్దుతిరుగుడు పంటలకు 95 శాతానికి పైగా ఉంటుందని అంచనా. సగటున 75 శాతం తీసుకుంటే రూ.8 లక్షల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. ఇది రైతులు వాస్తవంగా విక్రయించే మార్కెట్ చేయదగిన మిగులు. అయితే ఇప్పటికే వరి, గోధుమలు, పత్తి, పప్పుధాన్యాలు, నూనెగింజలు మొదలైన వాటిని ఎంఎస్పీకి కొనుగోలు చేస్తున్నందున, మిగిలిన వాటికి ఎంఎస్పీ చెల్లింపునకు ప్రభుత్వం గణనీయమైన అదనపు ఆర్థిక వ్యయాన్ని చేయాల్సిన అవసరం లేదు.
భారతీయ నగరాల్లో పంటల రిటైల్ మార్కెటింగ్లో కనిపించే మధ్యతరగతి లాభదాయక పద్ధతుల కారణంగా, పంటలు, కూరగాయలు లేదా మిగిలిన ఉత్పత్తులను పట్టణ మార్కెట్లో విక్రయించే ‘అధిక ధర’లో రైతులకు సరైన వాటా లభించడం లేదు. పెరుగుతున్న పట్టణ వినియోగదారుల పక్షపాతం, ఎగువ మధ్యతరగతి ఆదాయ సమూహాలు, సంపన్న వర్గాల మధ్య చెల్లించడానికి అధిక సుముఖత రైతు సంక్షేమాన్ని పణంగా పెట్టి వ్యవసాయ వస్తువులను మధ్యతరగతి (మధ్యవర్తి)కి లాభసాటిగా చేయడానికి సహాయపడుతుంది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఎంఎస్పీతో ఎక్కువ ధర ఆధారిత రక్షణ అవసరం.
తప్పుడు బడ్జెట్ వ్యూహాలు, ప్రభుత్వం ఎదుర్కొంటున్న నిశ్శబ్ద ఆర్థిక సంక్షోభం కారణంగా ఎంఎస్పీ వంటి అంశాల్లో రైతులను ఆదుకోవడానికి మోదీ ప్రభుత్వానికి ఆసక్తి సన్నగిల్లింది. కేంద్ర బడ్జెట్లలో వ్యవసాయ ఆధారిత సబ్సిడీలకు, అవసరమైన వ్యయానికి ఆర్థిక ప్రాధాన్యత కొరవడింది. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు మొత్తం కేటాయింపుల్లో 2022-23లో వాస్తవ వ్యయంతో పోలిస్తే 22.3 శాతం క్షీణత, 2023-24 సవరించిన బడ్జెట్తో పోలిస్తే 6 శాతం క్షీణత నమోదైంది.
మోడీ ప్రభుత్వం వరుసగా పదోసారి రైతు వ్యతిరేక బడ్జెట్ను ఆమోదించిందని ఇటీవలి మధ్యంతర కేంద్ర బడ్జెట్ తర్వాత అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) విమర్శించింది. స్వామినాథన్ చెప్పిన సీ2+50% అంచనాల ప్రకారం కనీస మద్దతు ధరలు కల్పించాలన్న రైతుల చిరకాల డిమాండ్ సాకారమయ్యేలా కేటాయింపులు లేవని ఏఐకేఎస్ వ్యాఖ్యానించింది.
2024-25లో ఎరువుల సబ్సిడీకి కేటాయింపులు 2022-23 వాస్తవ వ్యయం కంటే రూ.87,218 కోట్లు తక్కువ. ఆహార సబ్సిడీకి 2022-23లో వాస్తవ వ్యయం కంటే రూ.67,552 కోట్లు తక్కువగా కేటాయించారు. రైతులు, గ్రామీణ భారతం పట్ల ఆర్థిక ప్రాధాన్యత లేకపోవడమే కాకుండా తన ఆర్థిక విధానంలో ప్రైవేటు రంగాన్ని మోదీ ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తుందో ఈ స్థూల ఆర్థిక గణాంకాల ద్వారా తెలుస్తుంది. రైతు సంక్షేమం, ఆర్థిక శ్రేయస్సును పణంగా పెట్టి వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ దిశగా ప్రోత్సహించే వ్యూహాన్ని అవలంభించడానికి సిద్ధంగా ఉందని స్పష్టమవుతున్నది.
సాయి లోహిత పులపా