భారతదేశంలో కులాల ప్రస్తావన నేటిది కాదు. దాని వేర్లు బలంగా నాటుకుపోయిన సమాజం మనది. దేశంలో రాజకీయంగా,ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నది. దేశ జనాభాలో సగానికి పైగా కులం ఆధారంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనక్కి నెట్టివేయబడ్డారు. తీవ్ర వివక్షనూ ఎదుర్కొన్నారు. బాధిత ప్రజలకు స్వాంతన చేకూర్చే ఉద్దేశంతోనే నాటి నాయకులు ‘రిజర్వేషన్లు’ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. అందులో భాగంగానే మొదట షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పించారు. తర్వాతి కాలంలో వెనుకబడిన తరగతులకు, తాజాగా అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు అందుతున్నాయి.
ఎందుకీ వివక్ష: తాజాగా 103వ రాజ్యాంగ సవరణ చట్టం-2019 ద్వారా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం చర్చనీయాంశమైంది. దేశ జనాభాలో 10 శాతం ఉన్న అగ్రకుల పేదలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను అమలుచేయడం అత్యంత శోచనీయం. ఇది తీవ్రంగా విభేదించాల్సిన అంశం. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. కానీ, ప్రభుత్వాలు బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా వివక్షకు గురిచేస్తున్నాయి.
దేశంలో ప్రస్తుతం జరగాల్సిన జనాభా లెక్కల ప్రక్రియ కులాల ఆధారంగా జరగాలని వెనుకబడిన వర్గాల్లోని బుద్ధిజీవులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా బీసీలు అనే పేరుతో వ్యవహరిస్తున్న బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఎన్నిరకాల కులాలున్నాయి?ఒక్కో కులంలో ఎంత జనాభా ఉన్నది? అసలు వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి? వారికి అందాల్సిన అవకాశాలు అందుతున్నాయా, లేదా? ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు వారికి ఏ విధంగా లబ్ధి చేకూరుస్తున్నాయి? వారి జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు అందుతున్నాయా లేదా అనే అంశాలు బీసీ జనగణన ద్వారానే తెలుసుకునే అవకాశం ఉంటుంది.
కాబట్టి ప్రభుత్వాలు బీసీ కులగణన డిమాండ్ను పరిగణనలోకి తీసుకోవాలి. ఈసారి జరగబోయే జనాభా లెక్కలను కుల ఆధారితంగా జరపాలి. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు శాస్త్రీయ పద్ధతిలో, అర్హత కలిగినవారికే అందాలనే ఉద్దేశంతో కులాలవారీగా జనగణనను ప్రారంభించింది. దీంతో వెనుకబడిన వర్గాల ప్రజల జీవనస్థితిగతులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. వారిని మరింత వృద్ధిలోకి తీసుకురావాలనేది అక్కడి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం ఆలోచన. దేశంలో 1931లో కులాలవారీగా జనగణన జరిగింది. ఆ లెక్కలనే ప్రభుత్వాలు ఉపయోగించాయి.
మండల కమిషన్: 1979లో జనతా ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి వారి జీవనస్థితిగతులను తెలుసుకునేందుకు బిందేశ్వరి ప్రసాద్ మండల్ నేతృత్వంలో కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ 1980లో నివేదిక సమర్పించింది. దానిలో దేశంలో వెనుకబడినవర్గాల ప్రజలు 52 శాతంగా ఉన్నారని పేర్కొన్నది. వారి జీవన స్థితిగతులు మారేందుకు ఆ వర్గాల ప్రజలకు రాజకీయంగా, విద్య ఉద్యోగ అవకాశాలలో 27 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందిగా పేర్కొన్నది. కానీ నాటి రాజకీయ అస్థిరత కారణంగా ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక కార్యరూపం దాల్చలేదు. 1992లో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయపరంగా 27 శాతం రిజర్వేషన్లను కల్పించింది.
రిజర్వేషన్లు పెంచాలి: జనాభా దామాషా ప్రకారం.. బీసీ కులగణన జరిపి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు దక్కాల్సిన అవకాశాలను కల్పించాలి. ఇప్పటికీ బీసీలు వెనుకబడిన వర్గాలుగానే మిగిలిపోవడానికి కారణం ప్రభుత్వాల వద్ద సరైన ప్రణాళిక లేకపోవడం. కాబట్టి బీసీల లెక్కలు తేలాలి. అవకాశాల్లో వారి వాటా వారికి ఇవ్వాలి. ఇప్పటికే కేంద్రంలోని ప్రభుత్వాల జాప్యం కారణంగా బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. బీసీ కులగణన ఆలస్యమవుతున్న కొద్దీ వెనుకబడిన వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రహించాలి. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు దేశ ఆర్థికరంగానికి వారి కులవృత్తుల ద్వారా వెన్నుదన్నుగా ఉన్నారు. అలాంటి వారిని నిర్లక్ష్యం చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. బీసీ జనగణన విషయంలో ప్రజలు తమ పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
కె.శ్రావణ్ కుమార్
80960 49770