‘తప్పకుండా, తప్పకుండా నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటా. వాళ్లు రైతులేననీ, ఒక మంచి కోసం పోరాడుతున్న మంచి వాళ్లనీ నేను వందమందికి చెప్తా. మా ఇంట్లో కూడా’ మాట ఇచ్చాడతడు.
‘నేను కచ్చితంగా చెప్తున్నా, వాళ్లు రైతులు కానే కారు. వాళ్లు ఖలిస్థానీలు’ అడ్డంగా మాట్లాడాడు అతడు. ఆ బాలుడిలో కనిపించిన ధీమా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.
మొన్న ఢిల్లీలోని ఒక బడిలో వర్క్షాప్ జరిపినం. భారత్లో అసమానతలు- ఆహార వృథాను అరికట్టడం అనేది దాని థీమ్. చర్చ జోరుగా సాగుతున్నప్పుడు, ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమం ప్రస్తావనకు వచ్చింది. ఆ వర్క్షాపులో ఉన్నదంతా 8వ తరగతి పిల్లలు. ఉద్యమం చేసింది రైతులు కాదు; ఖలిస్థానీలు అన్నది కూడా ఆ తరగతి పిల్లగాడే.
‘నిజంగానా?’ అందరికన్నా ముందు కూర్చున్న అతడిని నేను ఆడిగిన.‘నూటికి నూరు శాతం’ అతను అదో రకంగా నవ్వుతూ బదులిచ్చిండు. ‘అయితే వాళ్లు రైతులు కాదంటావు. నిజమా?’ నేను రెట్టించిన.‘కచ్చితంగా కాదు; నాకు తెలుసు’ అతనన్నాడు.‘ఉద్యమం జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడున్నావా? వారిని చూసినావా?’ నేను మళ్లీ అడిగిన.‘లేదు. నేనక్కడికి వెళ్లలేదు. కానీ నేను టీవీలో చూసిన. వాళ్లు రైతులు కానే కారు. తీవ్రవాదులు’ అన్నాడతడు.‘నువ్వు లేవు. కానీ నేను అక్కడనే ఉన్న. వాళ్లు తీవ్రవాదులు కారు. రైతులే. నిజానికి నేను అక్కడ 150 రోజులు గడిపిన. ఆ ఉద్యమాన్ని డాక్యుమెంట్ చేసిన. వందలాది రైతులను ఇంటర్వ్యూ చేసిన. వాటిని ప్రసారం చేసేందుకు ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టిన.’ నేను చెప్పుకొంటూ పోతున్న. నేను చెప్తున్న. కానీ ఆ 13 ఏండ్ల పిల్లగాడు వింటలేడు. నా మాటలు అతని చెవిలోకి వెళ్లనేలేదు. నేను మళ్లీ ఒకసారి చెప్పిన. అయినా అతను వినిపించుకోలేదు. మూడోసారి మళ్లీ చెప్పిన. అప్పుడు అతడు కాదు గానీ, మిగతా పిల్లలు అక్కడేదో జరుగుతున్నదని గుర్తించడం మొదలుపెట్టారు. మా సంవాదాన్ని గమనించడం ప్రారంభించారు. కొందరు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. అయినా ఆ బాలుడు తగ్గలేదు.
‘మీరేదో చెప్తున్నారు సరే. కానీ నేను టీవీలో చూసిన కదా.. వాళ్లు తీవ్రవాదులని, రైతులు కాదని’ అతను మరింత గట్టిగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో అన్నాడు.‘టీవీ అబద్ధం చెప్తుందని, చెప్పొచ్చని నీకెప్పుడూ అనిపించలేదా?’ అడిగిన నేను. ఈ ప్రశ్నను అతడు ఊహించలేదు.
‘అట్లా జరిగే ఆస్కారం లేదు. అసాధ్యం’ మొండిగా బదులిచ్చాడు. కానీ అతడి మొహంలో కించిత్తు ఆందోళన మాత్రం కనిపించింది. అప్పుడు నేను రైతు ఉద్యమంపై కొన్ని ఫొటోలు, వీడియోలు చూపించడానికి క్లాస్ టీచర్ అనుమతి తీసుకున్న. ఆమె సోషల్ సైన్సెస్ టీచర్. పిల్లలకు ఆమెతో మంచి చనువుంది. ప్రజాస్వామ్యం, ప్రజా ఉద్యమాల గురించి ఆమె వారితో చర్చిస్తుందట. చర్చ ఆసక్తికరంగా మారడంతో వీడియోలు చూపించేందుకు ఆమె ఓకే అన్నది. ప్రొజెక్టర్ మీద నేను (అదానీ కొనడానికి ముందు) ఎన్డీటీవీలో వచ్చిన రైతు ఉద్యమం, 2020 నవంబర్ నాటి క్లిప్ ఒకటి ప్లే చేసిన. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం, పోలీసులు వారిని అడ్డుకోవడం అందులో ఉన్నది. నేను రైతులతో గడిపినప్పుడు తీసిన ఫొటోలు కూడా కొన్ని చూపించి, అందులో ఉన్న కష్టజీవుల గురించి, వారి అనుభవాల గురించి వివరించిన. తమను కొట్టిన పోలీసులకే భోజనం వండి పెడుతున్న రైతుల ఫొటోలను, చల్లని చలిలో నీళ్లు వేడి చేసుకునేందుకు రైతులు వాడిన పరికరాల ఫొటోలను కూడా చూపించిన. ‘రఘుపతి రాఘవ రాజారామ్, పతిత పావన సీతారామ్, ఈశ్వర్ అల్లా తేరే నామ్, మోదీకో సద్బుద్ధి దే భగవాన్” అంటూ రైతుల మార్చి పాడుకున్న గాంధీ ప్రియగీతాన్ని కూడా నేను వీడియోలో వారికి వినిపించిన. రైతుల ఉద్యమం పట్ల సానుభూతితో కొందరు యువకులు అక్కడే ఉండి, ‘ట్రోలీ టైమ్స్’ అనే పత్రికను ఎట్లా నడిపిందీ, రైతుల కోసం ఎట్లా పుస్తకాలను తెచ్చి లైబ్రరీలను ఏర్పాటుచేసింది కూడా వీడియోల్లో చూపించిన. టిక్రి సరిహద్దులో నేను రైతులతో గడుపుతూ, ఆ రాత్రి అక్కడే మక్కజొన్న రొట్టె తిని, జంపఖాన మీద పడుకున్న సంగతిని కూడా వివరించిన. అప్పుడు ఆ పిల్లగాడిలో కొంచం మార్పు వస్తున్నట్టు అనిపించింది. మిగతా పిల్లలంతా దీన్ని ఆసక్తికరంగా చూస్తున్నారు.
దేశంలో రైతుల దయనీయ ఆర్థిక పరిస్థితి, గత డబ్బు ఏండ్లలో లక్షలాది రైతులు ఆత్మహత్య చేసుకుని ఎలా చనిపోయిందీ, ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఎట్లా రైతులను భూమికి దూరం చేస్తున్నదీ, వారిని ఎలా నగరాల్లో దినసరి కార్మికులుగా మారుస్తున్నదీ నేను వివరించిన. ఆ పిల్లగాడు అప్పుడు కొంచెం ఆసక్తిగా చూడటం మొదలుపెట్టాడు.
అప్పుడు నేను నా బ్యాగులోంచి ఒక ఫొటో తీసిన. ‘మేం రైతులం. మమ్మల్ని తీవ్రవాదులుగా చూపించకండి. అలాంటి ప్రయత్నాలు మానుకోండి’ అని రైతులు పోస్టర్లు పట్టుకున్న ఫొటో అది.
ఇది చూడగానే క్లాసు క్లాసంతా పెద్దగా నవ్వింది. ఆ పిల్లగాడి వైపు అదోరకంగా చూడటం మొదలుపెట్టింది. కొందరు పిల్లలు అతడిని ఫొటో తీస్తున్నట్టుగా నటించారు. మరికొందరేమో ‘ఇప్పుడేమంటావు?’ అని అతడిని ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా మైకు ముందు పెట్టినట్టు యాక్షన్ చేశారు. ‘ఇప్పుడెలా ఉంది?, ఏమనిపిస్తున్నది?’ అని అరిచారు ఇంకొందరు. ఈ టీజింగ్ కూడా ఒక సంవాదంలాగే సాగింది.
అప్పుడు ఆ పిల్లగాడు, అతడి పేరు అక్షయ్ అట, చాలా ఇబ్బందిపడ్డాడు. అంతలోనే తేరుకొని చాలా ధైర్యంగా, నిజాన్ని అంగీకరించడానికి ముందుకువచ్చాడు.
‘నేను తప్పు చేశానేమో అని నాకు ఇప్పుడనిపిస్తున్నది. నా అంచనా నిజం కాకపోవచ్చు’ అన్నాడతడు.‘అట్లాగైతే అబద్ధాన్ని నమ్మినందుకు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది మరి’ నవ్వుతూ అన్నాన్నేను. నేను జోక్గానే అన్నా అక్షయ్ సీరియస్గానే తీసుకున్నాడు.
‘తప్పకుండా, తప్పకుండా నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటా. వాళ్లు రైతులేననీ, ఒక మంచి కోసం పోరాడుతున్న మంచి వాళ్లనీ నేను వందమందికి చెప్తా. మా ఇంట్లో కూడా’ మాట ఇచ్చాడతడు.
‘ఓహ్ చాలా ఇంట్రెస్టింగ్. అయితే వాళ్ల కుటుంబమంతా మోదీకి గట్టి మద్దతుదారులు’ పక్కనే నిలుచున్న టీచర్ నా చెవిలో గుసగుసలాడింది.
ఇదంతా ఎందుకు రాశానంటే, భారత్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా చేస్తున్న ప్రచారం, అది దేశంలోని ఆబాలగోపాలం చూపిస్తున్న ప్రభావం గురించి వివరించడానికి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు ఈ జాతికి చేస్తున్న నష్టాన్ని కొలువలేం. సెల్ఫోన్లలో, సోషల్ మీడియాలో, పత్రికల్లో, టీవీ తెరలపై పదేపదే రోజూ చూపిస్తున్న అబద్ధాలను ప్రజలు నమ్మకుండా ఉండలేకపోతున్నారు. అది అబద్ధమో, నిజమో తేల్చుకునే విచక్షణ, పరిశీలించాలనే వివేకం దీనివల్ల వారిలో నశిస్తున్నది. పదిసార్లు చెప్తే అబద్ధం నిజమవుతుందనే సామెత అక్షయ్ లాంటి వాళ్ల విషయంలో అక్షర సత్యమవుతున్నది. నిజమేమిటో నిరూపించడానికి, దాన్ని అక్షయ్తో నమ్మింపజేయడానికి అనేక ఫొటోలు, వీడియోలు, ప్రత్యక్ష సాక్ష్యం, అంకెలు ఉంటే తప్ప నాకు సాధ్యం కాలేదు. ఇట్లా ఈ దేశంలో ఎంతమందికి వద్దకు మనం వెళ్లగలం? పారదర్శకమైన, అరమరికలు లేని, వాస్తవ సమాచార ప్రవాహం ఉండే భారత్కు బాటలు వేసే సంగతి మరిచిపోండి. ఇప్పుడు ఈ దేశం అబద్ధాల సముద్రంలో మునిగితేలుతున్నది. యెల్లో జర్నలిజం పాత మాట. ఇప్పుడు సఫ్రాన్ జర్నలిజం సాగుతున్నది. అక్షయ్నంటే ఒప్పించగలిగిన. మరి అందరూ అక్షయ్లా ఉంటారా?
(వ్యాసకర్త: పాజిటివ్ సైకాలజీ, సైకోమెట్రిక్స్ నిపుణుడు)(‘ది వైర్’ సౌజన్యంతో)
-రోహిత్ కుమార్