వివాహం జరిగిన ఆరు నెలలకే ఓ యువతి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెను అత్తమామలు ఇంటి నుంచి తరిమేశారు. ఆమెకు విడాకులివ్వమని భర్తపై అత్తమామలు ఒత్తిడి చేశారు. అతను కూడా సరేనన్నాడు. ఏమి చేయలేని స్థితిలో ఆ యువతి కోర్టుకెక్కింది. అక్కడ ఆమె చెప్పిన ఒక నిజంతో కథ అడ్డం తిరిగింది. అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరానికి చెందిన లలితకు సునీల్ అనే యువకుడితో మే నెల చివరిలో వివాహం జరిగింది. కానీ ఆమె డిసెంబర్ మొదటి వారంలోనే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో లలిత అత్తమామలు ఆ బిడ్డకు తండ్రి సునీల్ కాదని సందేహించారు. ఇరుగుపొరుగు వారంతా లలిత గురించి చెడుగా మాట్లాడడం ప్రారంభించారు. ఈ విషయం తెలిసి సునీల్ తల్లిదండ్రులు లలితను ఆమె పుట్టింటికి పంపించేశారు.
కొన్ని రోజుల తరువాత లలితకు విడాకుల నోటిస్ పంపించారు. దీంతో లలిత తన భర్తను నిలదీసింది. సునీల్ కూడా ఆ బిడ్డకు తండ్రి తాను కాదని చెప్పి వెళ్లిపోయాడు. భర్త కూడా ముఖం చాటేయడంతో లలిత ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించింది. అక్కడ లలిత, సునీల్కు కౌన్సెలింగ్ నిర్వహించారు.
అక్కడ లలిత బిడ్డ పుట్టుకకు సంబంధించిన ఒక నిజం చెప్పింది. పెళ్లికి ముందే తాను, సునీల్ ప్రేమించుకున్నామని.. అప్పుడు ఇద్దరూ శారీరకంగా కలిశామని.. ఆ కారణంగా గర్భం రావడంతోనే సునీల్ ఆమెను త్వరగా పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. కౌన్సెలింగ్ చేసిన కోర్టు వారు సునీల్, పుట్టిన బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేస్తామని.. అందులో ఆ బిడ్డకు తండ్రి సునీల్ అని తేలితే అతనికి జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇది తెలిసిన సునీల్ విడాకులు కేసు ఉపసంహరించుకొని.. ఆ బిడ్డకు తండ్రిగా ఒప్పుకున్నాడు. నిజం తెలుసుకున్న లలిత అత్తమామలు ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.