నాలుగేళ్ల వయసులో ఇంటి ముందు ఆడుకుంటున్నాడా పిల్లాడు. కొంత దూరంలో నివసించే ఒక వ్యక్తి ఆ పిల్లాడిని ఎత్తుకెళ్లిపోయాడు. అక్కడి నుంచి సుమారు వెయ్యిమైళ్ల దూరంలో ఉండే ఒక కుటుంబానికి ఆ చిన్నారిని అమ్మేశాడు. అప్పటి నుంచి తన సొంత తల్లిదండ్రుల కోసం ఆ పిల్లాడు ఏడుస్తూనే ఉన్నాడు.
అతని బాధ చూడలేక పెంపుడు తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ.. అసలు కుటుంబం ఆనవాలు కోసం ప్రయత్నించారు. కానీ దొరకలేదు. డీఎన్ఏ డేటాబేస్ చెక్ చేశారు. ప్రయోజనం లేకపోయింది. ఇలా 30 సంవత్సరాలు గడిచిపోయాయి. లీ జింగ్వే అనే ఆ పిల్లాడికి 37 ఏళ్లు వచ్చాయి.
తనలాగే చిన్నతనంలో తల్లిదండ్రులకు దూరమైన కొందరు సోషల్ మీడియా ద్వారా తమ తల్లిదండ్రులను కలిసిన కథనాలు లీ కంటపడ్డాయి. తను కూడా ఇలాంటి ప్రయత్నం చేయాలనుకున్నాడు. అంతే బాగా ఆలోచించి, చిన్నతనంలో తన గ్రామంలో తను చూసిన ప్రదేశాల బొమ్మలు గీశాడు.
వాటిని డోయిన్ (చైనాలో టిక్టాక్ వంటి యాప్)లో పంచుకున్నాడు. ఈ బొమ్మల్లో ఒక చెరువు, పక్కనే వెదురు అడవి, ఒక బిల్డింగ్ ఉన్నాయి. వీటిని చూపిస్తూ ఇవి ఎక్కడున్నాయో ఎవరైనా చెప్పగలరా? అని లీ అడిగాడు. తనకు నాలుగేళ్ల వయసులో కిడ్నాప్ చేసి, సెంట్రల్ చైనాలోని హేనాన్కు తీసుకొచ్చారని చెప్పాడు.
గతేడాది డిసెంబరు 24న అతను పోస్టు చేసిన ఈ వీడియోను వేలమంది షేర్లు చేశారు. దీన్ని చూసిన పోలీసులు కూడా పరిశోధించి ఈ బొమ్మల్లో ఉన్న ప్రాంతం యునాన్ ప్రావిన్స్లోని ఝావోటాంగ్ అని గుర్తించారు. ఆ తర్వాత లీ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని, ఆ గ్రామంలోని వారి డీఎన్ఏతో మ్యాచ్ చేసి చూశారు.
చివరకు కొత్త సంవత్సరం రోజున లీ.. తన తల్లిని కలిశాడు. కొంతకాలం క్రితమే లీ తండ్రి మరణించినట్లు తెలిసింది. ‘‘33 ఏళ్ల ఎడబాటు, లెక్కలేనన్ని నిద్రలేని రాత్రులు, చివరకు గుర్తుచేసుకొని, గుర్తుచేసుకొని గీసిన చిన్నబోమ్మ. పదమూడు రోజుల తరవాత లభించిన అద్భుతమైన విడుదల ఇది‘‘ అంటూ లీ ఒక వీడియో పోస్టు చేశాడు.
ఈ వీడియోలో తన తల్లిని కౌగిలించుకొని భావోద్వేగానికి లోనవుతున్న లీని చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. అతనికి అభినందనలు చెప్పారు. లీ కూడా తన తల్లిని వెతకడానికి సాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.