Sowmya Swaminathan | కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్తో వ్యాక్సిన్ వేసుకోని వారికి, పిల్లలకు ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా వేరియంట్తో పోలిస్తే ఒమిక్రాన్ మూడురెట్లు వ్యాప్తి చెందగల శక్తి కలిగి ఉందన్నారు. తొలిసారి వైరస్ సోకిన వారికి 90 రోజుల తర్వాత రీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉందని ఓ ఆంగ్ల టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ ప్రమాదకరమైన వేరియంట్ అని చెప్పారు.
ప్రారంభంలో ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ లక్షణాలను కనిపెట్టడం సాధ్యం కాదని, కేసుల సంఖ్య పెరుగుదల, దవాఖానలో చేరుతున్న వారి సంఖ్యకు మధ్య సమయం ఉంటుందని సౌమ్య స్వామినాధన్ అన్నారు. దవాఖానల్లో చేరుతున్న వారిలో ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రతను అంచనా వేయడానికి మనం తప్పనిసరిగా రెండు నుంచి మూడు వారాలు వేచి చూడాల్సి ఉందన్నారు.
దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తున్నది. పిల్లలు ఎక్కువగా దీని బారీన పడుతున్నారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఎక్కువగానే పరీక్షలు నిర్వహిస్తున్నదని సౌమ్యా స్వామినాధన్ తెలిపారు. ప్రస్తుతం వివిధ దేశాల వద్ద పిల్లలకు వ్యాక్సినేషన్ వేయడానికి టీకాలు అందుబాటులో లేవన్నారు. కొన్ని దేశాలు మాత్రమే పిల్లలకు టీకాలు ఇస్తున్నాయన్నారు. పిల్లలపై ఒమిక్రాన్ ప్రభావం చూపుతున్న తీరుపై డేటా కోసం వేచి చూస్తున్నామని చెప్పారు.
ఇప్పటికీ 25 దేశాలు తక్కువ వ్యాక్సినేషన్తో ఇబ్బందులు పడుతున్నాయని సౌమ్యా స్వామినాధన్ అన్నారు. ఈ నెల 16న డబ్ల్యూహెచ్వో సమావేశమై కొవోవాక్స్ టీకాను అత్యవసర వినియోగానికి అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకుంటుందన్నారు. వ్యాక్సినేషన్పై సమగ్ర శాస్త్రీయ అవగాహన అవసరం అని చెప్పారు. వేరియంట్ వారీగా వ్యాక్సిన్ అవసరమైతే, ఆ టీకా ఎంత మేరకు రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుందన్న విషయం ఆధారపడి ఉంటుందన్నారు.