
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఉపయోగించుకునే రైల్వే వ్యవస్థల్లో భారత రైల్వే వ్యవస్థ ఒకటి. కానీ చాలామంది రైల్వే ప్రయాణికులు గుట్కాలు, పాన్లు, పొగాకు నమిలి ఉమ్మి వేయడం వల్ల రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో మరకలు పడటం సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు రైల్వే శాఖ పలు చర్యలు తీసుకుంటోంది. ఎవరైనా రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉమ్మి వేస్తూ కనిపిస్తే రూ.500 జరిమానా విధిస్తోంది. అయినా సరే కొందరు మారడం లేదు.
ఇలా సదరు వ్యక్తులు నిర్లక్ష్యంగా ఉమ్మి వేయడం వల్ల ఏర్పడిన మరకలు తొలగించడం కోసం రైల్వే శాఖ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికోసం భారీ మొత్తంలో నీటితోపాటు సుమారు రూ.12 వేల కోట్ల రూపాయలను రైల్వే శాఖ ఏటా ఖర్చు చేస్తున్నట్లు అంచనా. ఈ క్రమంలో పశ్చిమ, ఉత్తర, సెంట్రల్ రైల్వేలకు చెందిన 42 స్టేషన్లలో కొత్త విధానానికి భారతీయ రైల్వే శ్రీకారం చుట్టింది.
నాగ్పూర్కు చెందిన ఈజీస్పిట్ అనే స్టార్టప్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వెస్టర్న్, నార్తర్న్, సెంట్రల్ రైల్వే వ్యవస్థలకు చెందిన మొత్తం 42 రైల్వే స్టేషన్లలో వెండింగ్ మెషీన్ల వంటి వాటిని ఏర్పాటు చేస్తారు. వీటిలో రూ.5 నుంచి రూ.10కు ఒక పౌచ్ అమ్మనున్నారు. వీటిలో కనీసం 10-15 సార్లు ఉమ్మివేయొచ్చు. అలాగే ఇవి పర్యావరణానికి ఎటువంటి హానీ చేయవు. మంచిది కూడా.
ఈ పౌచ్లలో ఉండే కొన్ని గింజలు మనుషుల లాలాజలంలో నుంచి పోషకాలను తీసుకుని, నేలపై పడేసినప్పుడు మొక్కలుగా ఎదుగుతాయని ఈజీస్పిట్ సహ వ్యవస్థాపకుడు రితు మల్హోత్రా తెలిపారు. ప్రస్తుతానికి తమ కంపెనీ ఏడాది పాటు భారతీయ రైల్వేస్తో ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు.