ఆయనకు తన సోదరి అంటే ఎంతో ప్రేమ. కానీ ఆమె ప్రేమను చివరిదాకా అతను పొందలేక పోయాడు. సోదరి చిన్న వయసులోనే కాలం చేయడంతో అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. సోదరి మరణించినా కూడా ప్రతి ఏడాది ఆమె బర్త్డేను జరుపుకుంటూ.. ఆమె జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నాడు. అంతలా ఆమెను ప్రేమించాడు. ఆమె జ్ఞాపకార్థంగా క్యాట్ గార్డెన్ను ( Cat Garden ) ఏర్పాటు చేశాడు. ఎందుకంటే.. సోదరి చనిపోయిన తర్వాత.. ఆమె బర్త్డే సందర్భంగా కేక్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టగా.. దాన్ని ఓ పిల్లి తినేసింది. దీంతో తన సోదరి ఆత్మ పిల్లి రూపంలో వచ్చిందని బలంగా నమ్మాడు అతను. తాను ఎంతో ఇష్టపడే సోదరి జ్ఞాపకార్థంగా ఏకంగా క్యాట్ గార్డెన్ను ఏర్పాటు చేసి తన ప్రేమను చాటుకున్నాడు.
గుజరాత్కు చెందిన ఉపేంద్ర గోస్వామి సోదరి 1994లో మరణించింది. సోదరి మరణం తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఆమె బర్త్డేను ఉపేంద్ర నిర్వహిస్తున్నాడు. తన సోదరి అంటే తనకెంతో ఇష్టం, ప్రేమ అని గోస్వామి పేర్కొన్నాడు. అయితే 2017కు ముందు నిర్వహించిన బర్త్డేలో ఆ కేక్ను ఓ పిల్లి తినేసింది. తన సోదరి ఆత్మ పిల్లి రూపంలో వచ్చి.. కేక్ను తిన్నదని గోస్వామి బలంగా నమ్మాడు. దీంతో ఆ పిల్లితో పాటు మొత్తం 200 పిల్లులను పెంచాడు. ఈ పిల్లుల కోసం 500 చదరపు అడుగుల్లో 2017లో క్యాట్ గార్డెన్ను ఏర్పాటు చేశాడు.
తన సోదరిని ఎంత ప్రేమగా చూసుకున్నాడో.. అదే స్థాయిలో పిల్లులను కూడా చూసుకుంటున్నాడు ఉపేంద్ర. ఏసీ సదుపాయంతో క్యాట్ గార్డెన్ను ఏర్పాటు చేశాడు. 16 కాటేజీలతో పాటు 12 బెడ్స్ను అందుబాటులో ఉంచాడు. ఈ క్యాట్ గార్డెన్లో మొత్తం నాలుగు ఏసీలు ఉన్నాయి. మినీ థియేటర్ను కూడా ఏర్పాటు చేసి.. పిల్లులకు సాయంత్రం వేళ.. జంతువులకు సంబంధించిన షోలను ప్రదర్శిస్తున్నాడు. ఇక బెస్ట్ ఫుడ్ను వీటికి అందిస్తున్నాడు ఉపేంద్ర గోస్వామి.
క్యాట్ గార్డెన్లో ఉంటున్న పిల్లుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు వెటర్నరీ డాక్టర్ల ద్వారా చెకప్ చేయిస్తాడు ఉపేంద్ర. ఈ పిల్లులను తమ కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నామని ఉపేంద్ర పేర్కొన్నాడు. తన భార్య కూడా తనకు హెల్ప్ చేస్తుందని తెలిపాడు. క్యాట్ గార్డెన్ నిర్వహణకు ప్రతి నెల రూ. 1.5 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పాడు. క్యాట్ గార్డెన్ను సందర్శించేందుకు ప్రతి ఆదివారం నాలుగు గంటల పాటు వెసులుబాటు కల్పించినట్లు తెలిపాడు. సందర్శకుల నుంచి అతి తక్కువ ఫీజు వసూలు చేసి అనుమతి ఇస్తున్నామని ఉపేంద్ర పేర్కొన్నాడు.