హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జపాన్ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ మురళీధర్ మిరియాల భాగస్వామి అయ్యారు. పలు అంశాలపై తన అభిప్రాయాలను వివరించారు. మురళీధర్ది మహబూబ్నగర్ జిల్లా. తెలంగాణలోనే చదివి ఉన్నత విద్య కోసం జపాన్కు వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం షిబురా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా, బోర్డ్ ఆఫ్ కౌన్సిలర్గా పనిచేస్తున్నారు.
‘వరల్డ్ టెక్నలాజికల్ యూనివర్సిటీస్ నెట్వర్క్’కు వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. 2021 జనవరిలో ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు (పీబీఎస్ఏ) అందుకున్నారు.
మోదీ తన పర్యటనలో భాగంగా పురస్కార గ్రహీతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రైల్వే రంగంలో జపాన్-భారత్ మధ్య పరస్పర సహకారంపై తన అభిప్రాయాలను వివరించానని మురళీధర్ మిరియాల తెలిపారు. తర్వాతి తరం సూపర్ కండక్టింగ్ కేబుల్ సిస్టమ్పై తన పరిశోధనలను మోదీకి వివరించినట్టు వెల్లడించారు. వీటితోపాటు భారతదేశ విద్యార్థుల్లో నైపుణ్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పెంచేందుకు ప్రవేశపెట్టాల్సిన నూతన పాలసీలు, సంస్కరణల గురించి వివరించినట్టు చెప్పారు. మురళీధర్ జపాన్కు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కీలక హోదాలో ఉన్నారు.
విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడం, ఆసియా దేశాలతో సత్సంబంధాలను పెంచుకోవడంలో భాగంగా జపాన్ ప్రభుత్వం ‘సకుర సైన్స్ ప్రోగ్రాం’ నిర్వహిస్తున్నది. వివిధ దేశాలకు చెందిన విద్యార్థులను ఉచితంగా జపాన్కు తీసుకొచ్చి, వారికి స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ ఇస్తుంటారు. దీనికి మురళీధర్ నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. కేయూ, జేఎన్టీయూ, బీవీఆర్ఐటీలను సుకుర ప్రోగ్రామ్లో భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.