రుషిపీఠం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ రచించిన శివపదం గీతాల అంతర్జాతీయ పోటీలు యూట్యూబ్ వేదికగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ఘనంగా జరిగాయి. షణ్ముఖ శర్మ రచించిన వెయ్యికి పైగా శివపద గీతాల్లో కొన్నింటిని ఈ పోటీల్లో ఆలపించారు. 4 ఖండాల్లోని 14 దేశాలకు చెందిన ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, సింగపూర్ నుంచి 16 మంది ప్రఖ్యాత సంగీత గురువులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా షణ్ముఖ శర్మ మాట్లాడుతూ.. శివపదం తన జీవితపరమావధిగా, సార్థకతగా రాసుకున్న పాటలుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది పాల్గొని పాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. చిన్మయ జ్యోతిర్మయలింగం, పాలవన్నెవాడు, శివుడు ధరించిన, సకలమంత్రముల సంభవమూలం, సభాపతి పాహిపాహిమామ్ వంటి శివపద కల్యాణ గీతాలు మొదలుకుని దాదాపు 200 పైగా శివపదాలను అద్భుతంగా ఆలపించారని ప్రశంసించారు. వాణీ, రవి గుండ్లపల్లి, మేఘన, నాగ సంపత వారణాసి, హరి డొక్కా, విజయ, శ్రీ కాంత్ వడ్లమాని నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వారిలో భారత్ నుంచి తులసి విశ్వనాథ్, పద్మ త్యాగరాజన్, శారదా సుబ్రమణియన్, కౌశిక్ కల్యాణ్, జీవీ ప్రభాకర్, ఎంవీ మెహన్, పెద్దాడ సూర్యకుమారి, ఆర్వీ లక్ష్మిమూర్తి, విష్ణుప్రియ భరధ్వాజ్, అమెరికా నుంచి శ్రీకాంత్ మల్లాజ్యోస్యుల, లక్ష్మి కొలవెన్ను, సుధా దూసి, అనీల కుమార్ గరిమెళ్ళ, లలిత రాంపల్లి, సింగపూర్ నుంచి శేషు కుమారి యడవల్లి, ఆస్ట్రేలియా నుంచి డాక్టర్ పద్మా మల్లెల ఉన్నారు.