ఆస్ట్రేలియా : టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆస్టేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్ట్రాత్ఫీల్డ్ (సిడ్నీలో ) కౌన్సిల్ మేయర్ మాథ్యూ బ్లాక్మోరే (Strathfield Council) తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ..ఈ భేటీలో తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్, అలాగే పీవీ నరసింహా రావు విగ్రహ ఏర్పాటు గురించి మేయర్తో చర్చించామన్నారు. దానికి అయన సముఖత వ్యక్తం చేసినట్లు మహేష్ పేర్కొన్నారు.
అలాగే స్ట్రాత్ఫిల్డ్ లో భారతీయులు 16 % వరకు ఉన్నారని, అందులో తెలుగు వారు ఎక్కువగా ఉన్నట్లు మహేష్ బిగాల ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే తెలంగాణ బిడ్డ సంధ్యా రెడ్డి మొట్ట మొదటి సారి కౌన్సిల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించడం గర్వకారణం అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, వెల్లువలా వస్తున్న పెట్టుబడులపై మేయర్కి మహేష్ బిగాల వివరించారు.
రాబోయే రోజుల్లో ట్రేడ్, కల్చరల్ వివిధ రంగాలలో తెలంగాణతో కలిసి పనిచేయడానికి మేయర్ సుముఖత వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. త్వరలో పీవీ విగ్రహ ఏర్పాటు గురించి కౌన్సిల్లో చర్చిస్తామన్నారు. ఈ భేటీలో స్ట్రాత్ఫిల్డ్ కౌన్సిల్ కౌన్సిలర్ సంధ్యా రెడ్డి, స్ట్రాత్ఫిల్డ్ ఇండిపెండెన్స్ ప్రెసిడెంట్ కర్రి బూచి రెడ్డి, ఉపేందర్ గాదె పాల్గొన్నారు .