Scotland | ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాల్లో ఒకటైన స్కాట్లాండ్ (UK) లో.. అచ్చం తిరుపతిలో మాదిరిగా ఏడుకొండలతో విరాజిల్లుతున్న ఎడింబరో నగరంలో, అంగరంగ వైభవంగా తొలిసారి అష్టావధానం జరిగింది. ఈ నెల తొమ్మిదో తేదీన జరిగిన ఈ అష్టావధానంలో శ్రీ ప్రణవపీఠాధిపతి (ఏలూరు) బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయ్ కుమార్ రాజు పర్రి నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎడింబరో హిందూ మందిర్ వేదికయ్యింది. వందలాది తెలుగు ప్రజలు పొరుగు నగరాల నుండి కూడా ఏడింబరోకి విచ్చేసి ఆసక్తిగా తిలకించారు.
త్రిభాషా మహాసహస్రావధాని, అవధాన విశ్వగురుబ్రహ్మ, సప్తఖండ అవధాన సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్, నిర్వాహకులు విజయ్ కుమార్ రాజు పర్రి, గౌరవ అతిథులు స్కాట్లాండ్ తెలుగు సంఘం చైర్మన్ మైథిలీ కెంబూరి జ్యోతి ప్రజ్వలన చేశారు. స్కాట్లాండ్ గాయకుడు కుమార్ అనీష్ కందాడ గణేశుని ప్రార్థనా గీతం ఆలపించగా కార్యక్రమాన్ని అట్టహాసంగాప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి పృచ్ఛకులుగా తెలుగు భాషను అమితంగా ప్రేమించే వారు కావడం వలన భానుసప్తమీ పర్వదినాన 12 మంది దివ్యమైన సూర్యుల కాంతి పద్మాకరునిపై వెదజల్లినటు ప్రకాశిస్తూ దివ్యంగా సాగిందీ అష్టావధానం. నాగ ప్రసాద్ మంగళంపల్లి (సమస్యాపూరణం), రంజిత్ నాగుబండి (దత్తపది), సాయికుమారి దొడ్డ గారు (వర్ణన), శైలజ గంటి గారు (నిషిద్ధాక్షరి), హిమబిందు జయంతి (న్యస్తాక్షరి) , అనంత రామానంద్ గార్లపాటి, మమత వుసికల (ఆశువు) ఆధ్వర్యంలో అష్టావధానం సాగింది. వీరి పద్య గద్య సందర్భ ప్రయోగం చాలా వినూత్నంగా చూపరులను ఆకట్టుకున్నది.
విజయ్ కుమార్ రాజు పర్రి, మిథిలేష్ వద్దిపర్తి, పండరి జైన్ కుమార్ పోలిశెట్టి చేసిన పురాణ పఠనం అమోఘంగా ఉంది. సత్యశ్యాం కుమార్ జయంతి, నిరంజన్ నూక సంయుక్త ఆధ్వర్యంలో అప్రస్తుత ప్రసంగంపై చురుక్కులు, చమక్కులు భలే గమ్మత్తుగా, సమకాలీన పరిస్థితులకు అద్దంపట్టేలా ఉన్నాయి.
ఆద్యంతం రసవత్తరంగా సాగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ అధ్యాపకులు డాక్టర్ అయ్యగారి జగన్నాథ కామేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ అవధాని ధారణాశక్తిని కొనియాడారు. కార్యక్రమ అనంతరం అవధాని సతీసమేత వద్దిపర్తి పద్మాకలను నిర్వాహకులు విజయ్, పృచ్ఛకులు పట్టు శాలువాతో, సన్మాన పత్రంతో, పట్టు బట్టలతో, కానుకలతో, పూలు పండ్లతోసత్కరించారు. వద్దిపర్తి పద్మాకర్ 12 మంది పృచ్ఛకులను సత్కరించారు.
ఈ కార్యక్రమానికి మొదటి నుంచీ చివరి వరకు .. రామచంద్ర దుగ్యాల, కృష్ణ జుట్టాడ, అశ్విన్ బక్కచెన్నగారి, సంతోష్ శ్రీరామ, సంతోష్ తోట, సూర్య కిరణ్, రేవతి సదా, లక్ష్మణ్, వరలక్ష్మి, రమ్య, శ్రీలక్ష్మి, స్వాతి నాగుబండి, శ్రీభార్గవి గునిశెట్టి సహాయకులుగా వ్యవహరించారు. ఇంకా, కార్తీక్ బొర్ర, జాహ్నవి బొర్ర, శివ జ్యోతి సంగం, యూనిస్ బైగ్ షేక్, బెంజమిన్, అస్మిత కట్టా, హరిణి రెడ్డి మంద, శ్రీ సాయి సుచిత్ రెడ్డి వీరవెల్లి, రీషిక వీరవెల్లి, సాయి కిరణ్, అక్షర షాహిరి, సాయికృష్ణ పారెకర్ వాలంటీర్లుగా చేయూతనిస్తారు. అదేరోజు సాయంత్రం ‘శ్రీ కృష్ణ లీలలు’ అంశం మీద భక్తి ప్రవచనాల కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది.
కార్యక్రమాలను క్రింది లంకెలలో వీక్షించండి.
అష్టావధానం: https://fb.watch/lGbwVREE9j
భక్తి ప్రవచనాలు: https://fb.watch/lGCnvIaqFg