Singapore Shivaratri | మహా శివరాత్రి సందర్భంగా సింగపూర్లోని `శ్రీ సాంస్కృతిక కళాసారథి` ఆధ్వర్యంలో “శివ భక్తి గీతాలాపన” ప్రత్యేక కార్యక్రమం ఇంటర్నెట్ వేదికగా ఆన్లైన్లో శనివారం నిర్వహించారు. శ్రీసాంస్కృతిక కళా సారధి నిర్వాహకులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ “తమ సంస్థ గతంలో చేసిన ఎన్నో కార్యక్రమాలకు అతిథిగా విచ్చేసి ఆప్యాయంగా ఆశీస్సులు అందించి.. ఇటీవల శివైక్యం చెందిన ప్రముఖ నటిమణి జమునకు, కళాతపస్వి కే విశ్వనాథ్కి నివాళిగా `ఈ శివభక్తి గీతాలాపన` అంకితమిస్తున్నట్లు తెలిపారు.
సింగపూర్లో నివసిస్తున్న గాయనీ గాయకులు శివభక్తి కీర్తనలను మధురంగా ఆలపించారు. వాటిలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, దయానంద సరస్వతి విరచిత కీర్తనలు, లలిత గీతాలు, సాగర సంగమం, శంకరాభరణం వంటి విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలనుండి, జమున నటించిన నాగులచవితి సినిమా పాటలు కూడా ఎంపిక చేసి ఆలాపించారు.
ఆత్మీయ అతిధి- వంశీ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ కార్యక్రమాలను అభినందించారు. వంశీ గౌరవాధ్యక్షురాలు జమున, విశ్వనాథ్లతో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి పేర్లపై త్వరలో అవార్డులు స్థాపించి కళాకారులను ప్రోత్సహిస్తామన్నారు.
రాధిక మంగిపూడి కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. గాయనీ గాయకులు శైలజ చిలుకూరి, సౌభాగ్య లక్ష్మి తంగిరాల, శేషు కుమారి యడవల్లి, శేషశ్రీ వేదుల, రాధిక నడాదూర్, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, అనంత్ బొమ్మకంటి, ఉషా గాయత్రి నిష్ఠల, పద్మజ వేదుల, కిరీటి దేశిరాజు తదితరులు పలు శివభక్తి సంకీర్తనలను మధురంగా ఆలాపించారు. రాధాకృష్ణ గణేశ్న సారధ్యంలో యూట్యూబ్, ఫేస్బుక్ల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం జరిగిన ఈ కార్యక్రమం క్రింది లింక్ ద్వారా వీక్షించవచ్చు.
https://youtube.com/live/Wj7xMJ3My80