NRI | తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ నల్ల దుస్తులతో నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాంతియుతంగా నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చారని ఆయన తెలిపారు. గతంలో రాహుల్ గాంధీ నల్ల దుస్తులతో పార్లమెంట్కు హాజరైన సందర్భంలో లేని అభ్యంతరం, ఇప్పుడు బీఆర్ఎస్ నేతల విషయంలో ఎందుకు వ్యక్తమవుతోందని ఆయన ప్రశ్నించారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని పిలిచి, అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లకముందే నేతలను అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం వల్లే పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయిస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత అభ్యంతరకరంగా, దుర్మార్గంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష నేతల గొంతును అరెస్టులతో అణచివేయాలని చూడటం సరికాదన్నారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ప్రతిసారి అరెస్టులు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను అవమానిస్తోందని, ఈ పరిణామాలను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అనిల్ కూర్మాచలం అన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రతిపక్షాన్ని అణచివేయడం కాకుండా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చకు ప్రభుత్వం సిద్ధం కావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజా హక్కులను కాలరాసే ఈ చర్యలకు తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం చెబుతారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.