హైదరాబాద్ : అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన జార్జిటౌన్ యూనివర్సిటీ శతాబ్ది పురస్కారానికిత తెలుగు వ్యక్తి రాజా కార్తికేయ గుండు ఎంపికయ్యారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జార్జిటౌన్ యూనివర్సిటీ తమ దగ్గర దౌత్యవిద్య పూర్తి చేసిన విద్యార్థులలోని అయిదుగురిని శతాబ్ది పురస్కారానికి ఎంపిక చేసింది.
అక్కడే విద్యను అభ్యసించిన తెలుగు వ్యక్తి రాజా కార్తికేయ ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో దౌత్యవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. రాజా కార్తికేయ భారతీయ విద్యా భవన్, నిజాం కళాశాలలో విద్యను అభ్యసించారు. ఐఐఎఫ్టీ దిల్లీలో ఎంబీఏ పూర్తి చేశారు. జార్జిటౌన్ యూనివర్సిటీలోని వాల్ష్ స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ నుంచి 2007-2009లో (మాస్టర్ ఆఫ్ ఫారిన్ సర్వీస్)ను పూర్తి చేశారు.
గత వందేళ్ల కాలంలో ఎంఎస్ఎఫ్ఎస్ కోర్సు పూర్తి చేసిన వందమందికి పైగా అభ్యర్థుల పేర్లు శతాబ్ది పురస్కారం పరిశీలనకు వచ్చాయని ఎంఎస్ఎఫ్ఎస్ కమిటీ తెలిపింది. వాటిల్లో నాయకత్వం, సృజనాత్మకత, విలువలు, సమాజ సేవ, మానవ సంబంధాలు ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెప్పింది.
కాగా, జనవరి 2001 గుజరాత్ భూకంపం, డిసెంబర్ 2004 సునామీ సమయంలో స్వచ్ఛందంగా సేవలందించడం,కరోనా సమయంలో అవగాహన కల్పించడం వంటి సేవలకు గాను ఈ పురస్కారం పొందానని కార్తికేయ తెలపారు.