హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే గ్రూప్-1, పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వగా.. ఇప్పుడు గ్రూప్-2, 4 ఉద్యోగాలు భర్తీ చేసే పనిలో పడింది. గ్రూప్-2లో 582, గ్రూప్-4లో 9,168 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. గ్రూప్-2లో మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ), అటవీ శాఖలో ఉద్యోగాలు తొలుత భర్తీ చేయాలని యోచిస్తున్నది. గ్రూప్-2 నోటిఫికేషన్ ఇచ్చిన కొద్దిరోజుల తర్వాత గ్రూప్-4 నోటిఫికేషన్ జారీచేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. దీనికోసం వివిధ శాఖల నుంచి నివేదికలు సేకరిస్తున్నది. గ్రూప్-4లో కిందిస్థాయి ఉద్యోగాల భర్తీ ఉంటుంది. కాబట్టి జిల్లాలవారీగా నివేదికలు పంపాలని టీఎస్పీఎస్సీ ఆదేశించింది.