ఖలీల్వాడి, ఫిబ్రవరి 1 : నిజామాబాద్ కొత్త కలెక్టర్కు సాదర స్వాగతం లభించింది. హనుమకొండ నుంచి బదిలీపై వచ్చిన రాజీవ్గాంధీ హనుమంతు బుధవారం నిజామాబాద్ జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.40 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకున్న ఆయనకు అదనపు కలెక్టర్లు, సీపీ నాగరాజు, ఇతర శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం రాజీవ్గాంధీ నేరుగా తన చాంబర్కు చేరుకొని బాధ్యతలను స్వీకరించారు. అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, జిల్లా అటవీశాఖ అధికారి వికాస్ మీనా తదితరులతో భేటీ అయ్యి జిల్లా స్థితిగతులు, స్థానిక పరిస్థితుల గురించి చర్చించారు. అంతకుముందు జిల్లా పాలనాధికారిని వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు.
మూడేండ్లపాటు జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు నిర్వహించిన నారాయణరెడ్డి వికారాబాద్ జిల్లాకు బదిలీకాగా, ఆయనకు జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ తనకు జిల్లాతో పెనవేసుకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జిల్లాను విడిచి వెళ్తున్నందుకు బాధగా ఉన్నప్పటికీ విధి నిర్వహణలో బదిలీలు సహజమని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. తాను బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి కిందిస్థాయి ఉద్యోగి మొదలుకొని ప్రతి శాఖలోనూ అధికారులందరూ అన్ని విషయాల్లో ఎంతో సహకరించారని అన్నారు. వారి తోడ్పాటు కారణంగానే జిల్లాను ముందంజలో నిలుపగలిగానని చెప్పారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా యంత్రాంగానికి అవసరమైన అదనపు వనరులను సమకూర్చుకొని ప్రజలకు మెరుగైన సేవలందించామంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు ప్రతికూల ఆలోచనలను దరి చేరనివ్వకుండా ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాలని హితవు పలికారు. తాను అట్టడుగు స్థాయినుంచి పైకివచ్చానని, పదిమందికి మేలు జరగాలనే తపనతో పని చేస్తానన్నారు.