మోర్తాడ్, నవంబర్ 22: ఆటపై మక్కువ, కోచ్ నేర్పిన మెలకువలతో బాల్బ్యాడ్మింటన్లో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ విద్యార్థినులు రాణిస్తున్నారు. జిల్లాస్థాయిలో పలు పోటీల్లో పాల్గొని, జిల్లా జట్టులో స్థానం సాధించి, అక్కడి నుంచి రాష్ట్రజట్టులో స్థానాన్ని సంపాదించి జాతీయస్థాయి పోటీల్లో సైతం పాల్గొని ప్రతిభ కనబరిచారు తిమ్మాపూర్కు చెందిన బొమ్మెన రచన, ఊట్నూర్ శివానీ.
రాష్ట్ర, జాతీయస్థాయిల్లో..
తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఊట్నూర్ శివానీ, బొమ్మెన రచన మోర్తాడ్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే బాల్బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. పీఈటీ శ్యామ్ సూచనలతో వీరు ఆటలో పట్టు సాధించారు. జిల్లాస్థాయిలో పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లాజట్టులో చోటు దక్కించుకున్నారు. జిల్లాస్థాయిలో కూడా మెరుగైన నైపుణ్యంతో రాష్ట్ర, జాతీయస్థాయి జట్టులో స్థానాన్ని సంపాదించారు. ఇప్పటి వరకు రచన నాలుగుసార్లు రాష్ట్రస్థాయి, ఒకసారి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనగా, శివానీ నాలుగుసార్లు రాష్ట్రస్థాయి, రెండుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వీరిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.
గ్రామస్తుల సహకారం మరువలేనిది
బాల్బ్యాడ్మింటన్ ఆటలో రాణించడానికి గ్రామస్తుల సహకారం మరవలేనిది. వారి సహకారంతో వివిధ పోటీల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పాల్గొనగలిగాం. గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు.
– రచన, తిమ్మాపూర్
కోచ్ సహకారంతోనే..
బాల్బ్యాడ్మింటన్ ఆటను కోచ్ శ్యామ్ సార్ సూచనలతో నేర్చుకోగలిగాం. ఆట గురించి అంతగా తెలియని సమయంలో కోచ్ సహకారంతో పట్టుసాధించాం. దాంతో రాష్ట్ర, జాతీయస్థాయి జట్టుల్లో స్థానం సంపాదించగలిగాం. కోచ్ సహకారాన్ని ఎన్నడూ మరచిపోలేం.
– శివాని, తిమ్మాపూర్