రుద్రూర్, జనవరి 23:జిల్లాలో యాసంగి సీజన్లో వరి ప్రధాన పంటగా ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉన్నది. అందులో ముఖ్యంగా గంగాకావేరి అనే వరి రకం వర్ని, రుద్రూర్, కోటగిరి, బోధన్ డివిజన్తోపాటు ఆయా చోట్ల ఎక్కువ మొత్తంలో రైతులు పండిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కృషీ విజ్ఞాన కేంద్రం రుద్రూర్ శాస్త్రవేత్తలు నిర్వహించిన క్షేత్రపర్యటనలో వరి పంటలో ఉల్లికోడు తెగులు ఉధృతి బయటపడింది. దీంతో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంట మార్పిడి చేయకపోవడంతోనే ఉల్లికోడు సమస్య ఎదురవుతుందని దీంతో పిలకలపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. వరి నాట్లు వేసి 20-25 రోజుల కాలం లో ఉన్నది. ఒకే రకమైన వరి పంటను సాగు చేయడంతో వాటిలో పురుగును తట్టుకునే సామర్థ్యం కోల్పోవడం, వాతావరణంలో జరిగే అసాధారణ మార్పుల కారణంగా ఈ యాసంగిలో ఉల్లికోడు(గొట్టపు రోగం) నారుమడి దశ నుంచి మొదలై పిలక దశ వరకు ఆశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. రైతులు అప్రమత్తంగా లేకపోతే వరి పొలంలో పిలక శాతం గణనీయంగా తగ్గడంతోపాటు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపి అధిక నష్టం కలిగిస్తుంది.
ఉల్లికోడు నివారణ ఇలా..
ఉల్లికోడు నివారణ కోసం నారుమడిలో అయితే ఫిప్రోనిల్ 0.3గ్రా. గుళికలు 600 గ్రా. చొప్పున పలుచగా నీరు ఉంచి పొలంలో చల్లుకోవాలి. అలాగే ప్రధాన పొలంలో ఆశిస్తే నాట్లు వేసిన 20 రోజుల దశలో ఎకరానికి ఫిప్రోనిల్ 0.3గ్రా., గుళికలు 10కిలోల చొప్పున లేదా అదే ఫిప్రోనిల్ 0.6గ్రా., గుళికలు 4కిలోల చొప్పున సన్నని ఇసుకలో కలుపుకొని సమాంతరంగా చల్లుకోవాలి. 25రోజుల పైబడిన దశ లో ఫిప్రోనిల్ 5శాతం, ఎస్.సి 2.5 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఉల్లికోడుని సమర్థవంతంగా అరికట్టి దిగుబడి నష్టం జరగకుండా నివారించుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉధృతి ఎక్కువగా ఉంటే 45-50రోజుల దశలో ఫిప్రోనిల్ 5శాతం, ఎస్.సి 2.5మి.లీ చొప్పున ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని పేర్కొంటున్నారు.