కొత్త వైరస్ వెంటాడుతున్నది. హెచ్3ఎన్2 రకం వైరస్ వ్యాప్తి పెరుగుతున్నది. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోవిడ్ 19 నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే సాఫీగా సాగుతున్న తరుణంలో ఈ కొత్త వైరస్ వ్యాప్తి కలవరపెడుతున్నది. దవాఖానల్లో రోగుల సంఖ్య పెరుగుతున్నది. నిజామాబాద్ జిల్లా జనరల్ దవాఖానలో రోజుకు సగటున 1500 నుంచి 1800 ఓపీ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ వైరస్ విస్తృతి పెరిగిన నేపథ్యంలో కేసీఆర్ సర్కారు ఇప్పటికే వైద్య శాఖను అప్రమత్తం చేసింది. దవాఖానల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించింది. వైద్య పరీక్షలు, మందులతో సహా అన్ని రకాల అధునాతన చికిత్సలు అందించేలా ఏర్పాట్లు చేసింది. కొత్త వైరస్ ప్రాణాంతకం కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. తగిన మందులు వేసుకోవడంతో పాటు మాస్కులు వినియోగించాలని సూచిస్తున్నారు.
నిజామాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సరిగ్గా నెల రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వయసుతో నిమిత్తం లేకుండా జ్వరం, దగ్గు, అలసట, వికారంతో కూడిన లక్షణాలతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ దశలో శ్వాసకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొని దవాఖానల్లో వైద్యం చేయించుకోవాల్సి వస్తున్నది. కొవిడ్-19 ముప్పు నుంచి తేరుకొని ప్రజలంతా సాఫీగా దైనందిక జీవితాలకు అలవాటు పడుతున్న సమయంలో ఇన్ఫ్లూయెంజా వైరస్ పంజా విసురుతుండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
ఈ వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిజామాబాద్లోని జనరల్ దవాఖాన, ఆర్మూర్, బోధన్, కామారెడ్డిలోని జిల్లా దవాఖానల్లో, ఎల్లారెడ్డి, బాన్సువాడ కమ్యూనిటీ వైద్యశాలల్లో వైద్య సహాయం కొనసాగుతున్నది. హెచ్3ఎన్2 వైరస్ ఉధృతితో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రోగులను పలు ప్రైవేటు దవాఖానలు పీల్చి పిప్పిచేస్తున్నాయి. భారీగా మందులు రాయడం, అవసరం లేకున్నా యాంటీ బయోటిక్స్ సిఫార్సు చేస్తుండడం వంటి అనైతిక కార్యక్రమాలు వెలుగు చూస్తున్నాయి.
దగ్గు, వికారం, గొంతు నొప్పి..
ప్రధానంగా ఇప్పుడెక్కడ చూసినా జ్వరం, దగ్గు, వికారం, వాంతులు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలతో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం మందులకు తగ్గకుండా వారం పాటు ఉంటున్నది. దగ్గు మూడు నుంచి నాలుగు వారాల పాటు కొనసాగుతున్నది. దగ్గుతో ఛాతి భాగంలో నొప్పి వచ్చేంత తీవ్రత కనిపిస్తుండడం హెచ్3ఎన్2 వైరస్ ద్వారా కనిపిస్తున్న ప్రధాన లక్షణం. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ చాలా మందిని బాధితులుగా మారుస్తున్నది. ఈ స్వైన్ ఫ్లూ ఉప వేరియంట్తో చాలా మంది బాధితులు నేరుగా దవాఖానలకు క్యూ కడుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు వేల మంది బాధితులు ఈ లక్షణాలతో చికిత్సను పొందినట్లు వైద్యారోగ్య శాఖ అంచనాలు చెబుతున్నాయి. పెరుగుతున్న కేసులతో ప్రభుత్వం అప్రమత్తం కావడంతో పాటుగా వైద్యారోగ్య శాఖ ద్వారా తగిన ఏర్పాట్లను ఆయా సర్కారు దవాఖానల్లో చేస్తున్నది. జీజీహెచ్లో ఎండాకాలంలోనూ సగటున రోజుకు 1,500 నుంచి 1,800 వరకు ఓపీ కొనసాగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. మొత్తం ఓపీకి వస్తున్న వారిలో 40శాతం మంది జ్వరం, దగ్గుతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారే ఉంటున్నారు.
మాస్క్ పెట్టుకుంటే సరి..
ఇన్ఫ్లూయెంజా తరహా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కొవిడ్-19 సమయంలో వినియోగించినట్లే మాస్కులను వాడడం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. ముక్కు, నోరుకు దగ్గరగా చేతులను తీసుకెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. యాంటిబయాటిక్స్ ఎక్కువ మోతాదులో తీసుకోకుండా మొదట వైద్యుల సలహాతోనే ఔషధాలను స్వీకరించాలని హెచ్చరిస్తున్నారు. హెచ్3ఎన్2 రకం వైరస్ సోకకుండా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందంటున్నారు. శరీరంలో ఇబ్బందులు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించి వైద్యం తీసుకోవడం, ముందు జాగ్రత్తలతో ముప్పును ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం మంచిందని డాక్టర్లు అంటున్నారు. ఈ వైరస్ అంతగా ప్రమాదకరం కాకపోయినప్పటికీ స్వీయ జాగ్రత్తలతో ఆరోగ్య ఇబ్బందులను దరి చేరకుండా చూసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
సొంత వైద్యం అసలే వద్దు..
ప్రస్తుతం హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తిపై ప్రభుత్వం అప్రమత్తమైంది. జీజీహెచ్లోనూ బాధితులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు మా వద్ద ఈ వైరస్ నిర్ధారణ జరిగిన వారెవ్వరూ లేరు. కాకపోతే జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులతో వస్తున్న వారిని గుర్తించాం. వారికి ఉచితంగా మందులు అందించి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎవరికైనా జ్వరం, దగ్గు మూడు రోజుల కంటే ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. సొంత వైద్యం చేసుకోవడం ప్రమాదకరం.
– డాక్టర్ ప్రతిమారాజ్, సూపరింటెండెంట్, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..
జ్వరం, ఒళ్లు నొప్పులతో పాటు తీవ్రమైన దగ్గు, విపరీతమైన తుమ్ములు ప్రధాన లక్షణాలుగా దవాఖానకు వస్తున్న వారి సంఖ్య కనిపిస్తోంది. జ్వరం వారం రోజులోపు, దగ్గు మూడు వారాల వరకు తప్పనిసరిగా ఉంటున్నది. ఇక రాత్రిపూట దగ్గుతో నిద్రలేక బాధితులు తీవ్ర అలసటకు గురవుతున్నారు. ఆహారం తీసుకోకపోవడంతో నీరసించి పోతున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న ఈ సమయంలో గాలిలో దుమ్ము, దూళి పెరిగి ఫ్లూ వైరస్ ద్వారా సంక్రమించిన దగ్గును మరింతగా ప్రేరేపిస్తున్నట్లు కనిపిస్తోంది. స్వీయ జాగ్రత్తలతో ఫ్లూ వైరస్ను ఎదుర్కోవచ్చు. మాస్కు పెట్టుకోవడం, శుభ్రత పాటించడం ఉత్తమం.
– డాక్టర్ రాజేశ్వర్, ప్రముఖ పల్మనాలజిస్ట్