పాడి రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే పశువులకు వచ్చే పలు రకాల వ్యాధుల నివారణకు టీకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. జీవాల్లో బ్రూసెల్లోసిస్ వ్యాధిని అరికట్టేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎద సమయంలో పశువుల్లో గర్భస్రావాన్ని నిరోధించేందుకు ముందస్తుగానే 4 నుంచి 8 నెలల వయస్సు ఉన్న ఆడ దూడలకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 23,700 దూడలను గుర్తించిన అధికారులు ఇప్పటి వరకు17,600 దూడలకు టీకాలు చేశారు.
కోటగిరి, ఫిబ్రవరి 19: ప్రజావసరాలకు తగ్గట్టు పాల ఉత్పత్తిని పెంచేందుకు పశుసంవర్ధకశాఖ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఎదకు వచ్చిన జీవాలకు గోపాలమిత్రల ద్వారా ఏఐ (కృత్రిమ గర్భధారణ) ప్రక్రియను నిరంతరం చేపడుతుండగా.. తాజాగా ఆడ దూడలకు బ్రూసెల్లాసిస్ టీకా అందిస్తున్నది. ఎద సమయంలో పశువుల్లో గర్భస్రావాన్ని నిరోధించేందుకు ముందస్తుగానే 4 నుంచి 8 నెలల వయసు ఉన్న ఆడ దూడలకు ఫిబ్రవరి 4 నుంచి ఉచితంగా ఈ వ్యాక్సిన్ వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 23,700 దూడలను గుర్తించి ఇప్పటి వరకు 17,600 దూడలకు టీకాలు చేశారు. దూడకు టీకా ఇచ్చిన వెంటనే వాటి చెవికి పోగు వేసి, యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ నాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నారు. పశువుల్లో గర్భస్రావం సమస్యకు చెక్ పడుతుండడంతో ఆర్థికంగా నష్టం తప్పుతుందని పాడి రైతులుసంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బ్రూసెల్లా.. ఇది పశువులకు సోకే అంటువ్యాధి. ఈ వ్యాధి సోకిన పశువులు ఈర్సుకుపోవడం లేదంటే కట్టకుండా ఉండడం జరుగుతుంది. ఇది అంటువ్యాధి కావడంతో మేకలు, గొర్రెలకు కూడా సోకుతుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వం మూడేండ్లుగా బ్రూసెల్లా టీకాలను పశుసంవర్ధక శాఖ యంత్రాంగంతో ఉచితంగా ఇస్తున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది సైతం ఈ నెల 4న ప్రారంభించిన ప్రభుత్వం ముమ్మరంగా కొనసాగిస్తున్నది.
జిల్లా వ్యాప్తంగా 23,700 దూడలు ఉండగా.. అందులో ఇప్పటి వరకు 17,600 దూడలకు ఈ టీకాను ఇంటి దగ్గరకు వెళ్లి వేశారు. టీకా వేసిన అనంతరం పశువుకు చెవిపోగు వేయడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. పెద్దవాటికి ఈ వ్యాక్సిన్ వేస్తే ఉపయోగం ఉండనందుకు 3 నుంచి 8 నెలల వయస్సు దూడలకు మా త్రమే వేస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు సైతం ఈ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేయనున్నారు.
వ్యాక్సిన్ వేయడంతో పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. ప్రస్తుతం చాలా మంది పాడి రైతులు మేలు జాతి పశువులను ఎక్కువగా పెంచుతున్నారు. ఇందులో జెర్సీ, హెచ్ఎఫ్, గీర్, ఒంగోలు, ముర్ర జాతులు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ వేయడంతో ఈ రకాలు పెద్ద మొత్తంలో ఉత్పత్తి కానున్నాయి. తద్వారా రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం కానున్నారు. పాల ఉత్పత్తులు సైతం పెరగనున్నాయి.
4 నుంచి 8 నెలల వయస్సు ఉన్న పశువులకు బ్రూసెల్లా టీకాను వేస్తున్నాం. మరో వారం రోజుల్లో ఈ కార్యక్రమం ముగియనున్నది. పశువులకు బ్రూసెల్లా వ్యాధి సోకితే అవి ఈర్సుకుపోవడంతో పాటు చూడి కట్టకుండా పోతాయి. పైగా ఈ వ్యాధి ఇతర జీవాలకు కూడా సోకే ప్రమాదం ఉంది. పాడి రైతులు కూడా ఆ వయస్సు పశువులకు టీకా వేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ వి.జగన్నాథాచారి, పశుసంవర్ధక శాఖ అధికారి, నిజామాబాద్