ఖలీల్వాడి, జూలై 8: ఇందూరు నగరం ఊర పండుగకు సిద్ధమైంది. పాడిపంటలు, ప్రజలు సుఖశాంతులతో ఉండేలా దీవించాలని వేడుకుంటూ ఏటా ఆషాఢ మాసంలో జరిపే ఊర పండుగను (నేడు) ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహించనున్నారు. పండుగ విశేష పదార్థంగా సరిని నగరంలో చల్లుతూ, పంటలపై, పశుసంపదపై, చెరువుల్లో కలపనున్నారు. ఈ పండుగలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొననున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ మాదిరిగా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ పండుగను నిర్వహిస్తారు.
88 ఏండ్ల నుంచి ఆనవాయితీగా..
పూర్వ కాలం నుంచి ఇందూరులో ఊర పండుగ ప్రారంభమైనట్లు తెలుస్తోంది 88 ఏండ్ల క్రితం సిర్నాపల్లి సంస్థానాధీశురాలు శీలం జానకీబాయి నిధులు సమకూర్చి ఊర పండుగను ఘనంగా నిర్వహించడం ప్రారంభించారు. అప్పట్లో గత్తర (ప్లేగు) వ్యాధి సోకడంతో ఎంతోమంది చనిపోయారు. గ్రామదేవతలను పూజిస్తే వ్యాధి నయమవుతుందని భావించి పండుగను నిర్వహించడం ప్రారంభించారు. పటేల్, పట్వారీ వ్యవస్థ హయాంలో వారే ఈ పండుగను నిర్వహించేవారు. అనంతరం కుల సంఘాల వారు నిర్వహిస్తున్నారు. కుల సంఘాల ఆధ్వర్యంలో ఏటా ఘనంగా పండుగ నిర్వహిస్తున్నారు. దొరసాని శీలం జానకీబాయి ప్రతిమను పూజించడం వీరు మొదలు పెట్టారు.
నగరంలో గ్రామీణ వాతావరణం..
మహిళలు పూనకాలతో, అమ్మవార్ల ప్రతిరూపమైన తొట్లెల కింద నుంచి వెళ్లేందుకు బారులు తీరుతారు. పలువీధి, చౌరస్తాల్లో ప్రజలు మేకలు, గొర్రెలు, కోళ్లను బలిస్తూ కల్లు సాకలు పోస్తూ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ పండుగ రోజు పొలిమేర దాటి వెళ్లవద్దని, అలా వెళ్తే అరిష్టమని భావించి వేరే ఊళ్లకు వెళ్లరు. దీనిని ప్రజలు ఇప్పటికీ విశ్వసిస్తారు. నగరంగా మారినా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గ్రామీణ సంస్కృతి ఇంకా ప్రతిబింబిస్తూనే ఉంది. ఊర పండుగ సందర్భంగా 40 కుల సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. సిర్నాపల్లిగడీలో ప్రత్యేకంగా సమావేశమవుతారు. పండుగ నిర్వహణకు చందాను అందజేస్తారు. దీనిని పట్టి కట్టడం అంటారు. గ్రామ దేవతల తయారీ, ఎత్తుకొనేవారు తొట్లె తయారీ దారు లు వతాన్దార్లు 50 మంది వరకు ఉండడం విశేషం.
ఖిల్లా నుంచి విగ్రహాల ఊరేగింపు..
ఊర పండుగ నిర్వహణ కమిటీ అయిన సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న శారదాంబ గద్దె (తేలుమైసమ్మ గద్దె) వద్ద గ్రామ దేవతలను పసుపు, కుంకుమ, చెవిపోగులు ఆభరణాలతో విశేషంగా అలంకరించి పూజలు చేస్తారు. దేవతామూర్తుల ఊరేగింపు గాజుల్పేట్ చౌరస్తా మీదుగా పెద్దబజార్ చౌరస్తా వరకు చేరుకుంటాయి. ఇక్కడి నుంచి రెండు బృందాలుగా విడిపోయి డప్పులు, పోతరాజుల విన్యాసాలు, మహిళల పూనకాలతో ఒక బృందం పౌడాలమ్మ, నల్లపోచమ్మ, అడెల్లి పోచమ్మ, పెద్దమ్మ, పులి, రాట్నం, ఆసు, తొట్లెలతో ఊరేగింపు దుబ్బవైపు వెళ్తుంది. రెండో బృందం సిర్నాపల్లిగడి, గోల్ హనుమాన్ చౌరస్తా మీదుగా వినాయక్నగర్ ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, మహా లక్ష్మమ్మలతో వెళ్తుంది. సరిని నాలుగు గుల్లలుగా విభజిస్తారు. ఒక గుల్ల దుబ్బవైపు, రెండవది వినాయక్నగర్, మూడోది ఎల్లమ్మగుట్ట, నాల్గోది కంఠేశ్వర్ ప్రాంతాలకు చల్లుకుంటూ వెళ్తారు.
అమ్మవార్ల తయారీలో వతాన్దార్లు..
మొదట బండారు వేసి మామిడి దుంగలతో అశోక్వీధిలో వడ్ల ధాతి వద్ద వతాన్దార్లు అమ్మవార్లను తయారు చేయడం ప్రారంభిస్తారు. 1983-84లో పటేల్ పట్వారీ వ్యవస్థ, రద్దుకావడంతో కుల సంఘాల ఆధ్వర్యంలో సర్వసమాజ్ ఏర్పాటు చేసి మొదటి కన్వీనర్గా ఆదన్న ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగేవి. ఊరపండుగకు బండారు వేసిన రోజు నుంచి గ్రామ దేవతలను అశోక్వీధిలోని వడ్లధాతి వద్ద వతాన్దార్ల పర్యవేక్షణలో అమ్మవార్లు రూపుదిద్దుకుంటాయి. ఆరాధ్య దేవతలైన గ్రామ దేవతను కొలుస్తూ ఈ ఊర పండుగను జరపడంలో నిజామాబాద్ నగర ప్రజలు ప్రత్యేకత చాటుకుంటున్నారు. వానకాలంలో ప్రబలే వ్యాధుల నుంచి రక్షించు తల్లీ అంటూ ఈ పెద్ద పండుగను నిర్వహిస్తారు. గ్రామ దేవతలైన సార్గమ్మ (2 విగ్రహాలు), బోగంసాని, కొండలరాయడు, బండి, రాట్నం, ఆసు, పెద్దపులి, ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, మహాలక్ష్మమ్మ, పౌడాలమ్మ, పెద్దమ్మ, అడెల్లి పోచమ్మ, అంపుడు పోచమ్మ ప్రతిమలు ఒకటి చొప్పున ఉంటాయి. వీటిని సరి గంపలతో ఘనంగా ఊరేగిస్తారు.
సరి ప్రత్యేకత..
ఊరపండుగలో ప్రత్యేకమైంది సరి. ఈ పదార్థాన్ని సిర్నాపల్లి గడిలో, రెండవది వివేకానంద చౌరస్తాలో తయారు చేస్తారు. జొన్న, బియ్యంతో గట్కాను తయారుచేసి, అందులో పసుపు, కుంకుమ, మేక రక్తం, పేగులు వేసి ఉడికించి తయారు చేస్తారు. అమ్మవారికి పూజ లు చేసిన తర్వాత సరిగుల్లను ఊరేగిస్తారు. ఈ సరిని పశువులు, పాకలు, ఇండ్లలో చల్లుతారు. దీనిద్వారా దుష్టశక్తులు పారిపోతాయని, రోగాలు రావని నమ్ముతారు. సరిని దక్కించుకునేందుకు పోటీపడుతారు. తోపులాట జరుగకుండా పోలీసులు బందోబస్తు కల్పిస్తారు. అమ్మవారికి ప్రతిరూపంగా తొట్లెలను ఊరేగిస్తారు. ఈ తొట్లెల కింద నుంచి వెళ్లేందుకు జనం పోటీ పడతారు. వివేకానంద చౌరస్తాలో తయారు చేసిన సరి గాజుల్పేట్, దుబ్బ ప్రాంతాలకు వెళ్తుంది. సిర్నాపల్లి గడీలో తయారు చేసిన సరి సార్గలమ్మల దగ్గర ఉంచి ఈ సరి ఎల్లమ్మగుట్ట, వినాయక్నగర్, పెద్దబజార్, అనంతరం న్యాల్కల్లోని చెరువులో కలుపుతారు.
ఊరేగింపు పూర్తయ్యే వరకు స్నానాలు చేయరు…
ఊరేగింపు వెళ్లే వరకు నగరవాసులు ఎవరూ స్నానాలు ఆచరించకుండా, ఇండ్లు సైతం శుభ్రం చేసుకోరు. అమ్మవార్లు వెళ్లగానే ఇంటిని, ఇంట్లోని పాత సామగ్రిని పాడేసి ఇండ్లను శుభ్రపర్చుకుంటారు. అనంతరం స్నానాలు ఆచరిస్తారు. దీంట్లో శాస్త్రీయత కూడా ఉందని నగరవాసుల విశ్వాసం. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.