నిజామాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ పోరు బిడ్డ, కళాకారుడు సాయిచంద్ హఠాన్మరణం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విషాదాన్ని నింపింది. తెలంగాణ మాండళికాన్ని, తెలంగాణ పల్లె పాటలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన గాయకుడు ఇకలేరన్న వార్త.. తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులను తీవ్రంగా కలిచి వేసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ప్రతి అడుగులో అడుగై ముందుకు సాగిన ఉద్యమకారుడు, సాంస్కృతిక కిరీటం సాయిచంద్ గురువారం గుండెపోటుతో మరణించాడు. ఉద్యమ కాలంలో గులాబీ పార్టీ రథ సారథి కేసీఆర్ ఆశీస్సులతో ఎదిగిన సాయిచంద్ అకాల మరణం అందరినీ షాక్కు గురి చే సింది. బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడుస్తూ, సాంస్కృతిక ఆటపాటల్లో పాలుపంచుకుంటున్న పాలమూరు బిడ్డ కృషిని మెచ్చి సీఎం కేసీఆర్.. రాష్ట్ర స్థా యి పదవిని కట్టబెట్టారు. గిడ్డంగుల సంస్థ చైర్మన్గా నియమించి సాయిచంద్ సేవలను గౌరవించారు. ప్రభుత్వంలో భాగమై గిడ్డంగుల సంస్థ చైర్మన్గా నూ, బీఆర్ఎస్ పార్టీలో ఆటపాటలతో సుదీర్ఘ అనుబంధం ఏర్పర్చుకున్న ఉద్యమకారునికి ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు.
విడదీయలేని అనుబంధం..
తెలంగాణ ఉద్యమం ఎంతో మందిని తట్టి లేపింది. మట్టిలోని మాణిక్యాలను పైకి తీసుకువచ్చింది. అందులో కళాకారుడు సాయిచంద్ ఒకరు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో తెలంగాణ ఉద్యమంలో సమైక్య పాలకులపై తన పాటతో పోరాటం కొనసాగించాడు. బీఆర్ఎస్ పార్టీ తరపున కళా ప్రదర్శనల్లో సాయిచంద్ బృందం ఆడి పాడి ప్రజలను ఉత్తేజపరిచేది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అలాంటి కార్యక్రమాలు అనేకం జరిగాయి. 2014 ఎన్నికల్లో కేసీఆర్ సభల్లో, 2018 ఎన్నికల నాటి బహిరంగ సభల్లోనూ సాయిచంద్ పాల్గొని తన గళంతో ఉమ్మడి జిల్లా ప్రజలను అలరించారు. 2022 సెప్టెంబర్ 5న నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభకు హాజరై తన ఆటపాటలతో ఇందూర్ వాసులను ఉర్రూతలూగించారు. అంతకు ముందు ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు కార్యక్రమాల్లోనూ పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ధూంధాంగా నిర్వహించారు. మరోవైపు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ హోదాలో బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, వేల్పూర్ మండలం లక్కోరలో 2023 జనవరి 5న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి గో దాముల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్లో రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తొలి ప్రోగ్రామ్ బాన్సువాడలోనే..
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన సాయిచంద్ సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయనను గిడ్డంగుల సంస్థ చైర్మన్గా గౌరవించారు. 2021 డిసెంబర్ 30న సాయిచంద్ పదవీ బాధ్యతలు చేపట్టగా, డిసెంబర్ 31న కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తొలి కార్యక్రమానికి అధికారికంగా హాజరయ్యారు. నస్రుల్లాబాద్ మండలం మైలారంలో రూ.9.33 కోట్లతో నిర్మించిన గోదాములను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనూ ఆయన తన పాట తో, మాటతో జనాన్ని అలరించారు. పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారిక హోదాలో బాన్సువాడలో స్పీకర్తో కలిసి వేదికను అలంకరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లుగా సాయిచంద్ ప్రకటించారు. రాష్ట్రంలో గిడ్డంగుల సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర సర్కారు విశేషంగా కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే గిడ్డంగుల నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు కీలకమైన కార్పొరేషన్కు సాయిచంద్ను చైర్మన్గా సీఎం కేసీఆర్ నియమించారు. గిడ్డంగుల సంస్థకు చైర్మన్ హోదాలో సాయిచంద్ మన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసిపలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.
కంటతడి పెట్టిన మంత్రి వేముల..
కవి, గాయకుడు సాయిచంద్ అకాల మరణంతో రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాయిచంద్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఉద్యమ సమయంలో సాయిచంద్ చేసిన సేవలను కొనియాడారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ పథకాలపై సాయిచంద్ తన ప్రచార కార్యక్రమాలతో ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించారని అన్నారు. సొంత తమ్ముడిలాంటి సాయిచంద్ మరణం వ్యక్తిగతంగా తనకు, పార్టీకి ఎంతో లోటు అని మంత్రి వేముల అ న్నారు. సాయిచంద్ మృతి వార్త తెలుసుకుని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన అనేక మం ది కవులు, కళాకారులు హైదరాబాద్కు పయనమయ్యారు. సాయిచంద్ పాటలు, ఆటలను గుర్తు చేసుకుంటూ దుఖః సాగరంలో మునిగి పోయారు. కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన సాయిచంద్ మచ్చలేని వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.
సాయిచంద్ మృతి కలిచి వేసింది : ఎమ్మెల్సీ కవిత
ఖలీల్వాడి, జూన్ 29: తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడు, రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ తన పాటతో ఎన్నో హృదయాలను కదిలించిన సోదరుడు సాయిచంద్ అకాల మరణం నన్ను ఎంతో కలిచి వేసింది’ అని పేర్కొన్నారు. సాయిచంద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
పాట పరమాత్ముడ్ని చేరింది
తన గళంతో తెలంగాణ తల్లిని అభిషేకించిన సాయిచంద్ అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు. పాట ఏదైనా ప్రాణం పెట్టి పాడేటోడు. రాళ్లు, దేవుళ్లను కరిగించేటోడు. చైతన్యానికి ప్రాణ ప్రతిష్ఠ చేసినోడు. ఉద్యమానికి ప్రవాహ రూపమైన సాయిచంద్ ఇక లేడన్న నిజం జీర్ణించుకోలేక పోతున్నా. పాట దేహాన్ని వదిలి పరమాత్మున్ని చేరుకున్నది. చైతన్యం ఆధారాన్ని కోల్పోయి అనాథగా మారింది. నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పాల్గొన్న ప్రతి సభకు సాయిచంద్ వస్తుండె. ప్రభుత్వ పథకాలను ప్రజల హృదయాల్లో చేర్చిన పాట ఆయనది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్న అధికారిక కార్యక్రమాల్లో నేను వ్యాఖ్యాతగా, ఆయన గాయకుడిగా పాలుపంచుకున్న వేదికలు ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలాయి.
– ఘనపురం దేవేందర్, రచయిత
తెలంగాణ పాటకు ప్రాణం పోసిన వ్యక్తి..
తెలంగాణ మలి దశ పోరాటంలో సాయిచంద్ పేరు చెబితే తెలియని వారుండరు. ఉద్యమకారుల్లో ఉవ్వెత్తున ఉత్తేజాన్ని నింపిన వ్యక్తి ఇప్పుడు కాలం చేశారన్న విషయం జీర్ణించుకోలేక పోతున్నా. చిన్న వయస్సులోనే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు చరిత్ర, సమకాలిన అంశాలపై అద్భుతమైన పట్టు ఉన్న వ్యక్తి. అనర్గళంగా ఉద్యమ నాయకుల ప్రస్థానాన్ని, భౌగోళిక అంశాలను మేళవించి మాట్లాడడం, పాటలు పాడడంలో దిట్ట. పల్లె జనాలకు అర్థమయ్యే రీతిలో తన గాత్రంతో అలరించిన గొప్ప వ్యక్తి.
– నరాల సుధాకర్, తెలంగాణ జాగృతి నాయకుడు