ఖలీల్వాడి, మే 28: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పేదల ముంగిట్లోకి కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో రూ.2.14 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ యంత్రం, రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిన ఐఫాకో మిషన్, రూ.7 లక్షలతో నెలకొల్పిన 500 ఎంఏ ఎక్స్రే యూనిట్లు, మానసిక చికిత్సా విభాగాన్ని మంత్రి ప్రశాంత్రెడ్డి.. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, నగర మేయర్ దండు నీతూకిరణ్తో కలిసి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పేదలకు భారంగా మారిన సీటీ స్కాన్ సేవలు జిల్లా జనరల్ దవాఖానలో ఉచితంగా అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సే వలను మెరుగుపర్చేందుకు సర్కారు పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తోందన్నారు. సీటీ స్కాన్ పరీక్షలు బయట చేయించుకునేందుకు పేదలు ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వచ్చేదని తెలిపారు. ప్రస్తుతం జీజీహెచ్లో పరికరాలను సైతం జిల్లాకు కేటాయించారని, వీటిని ఏఎన్ఎంలకు కేటాయిస్తూ వారి ద్వారా గ్రామగ్రామాన ప్రజలకు సేవలు అందించనున్నట్లు వివరించారు.
ఐఫాకో మిషన్ ద్వారా నేత్ర పరీక్షలకు సంబంధించి కూడా మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. కోరిన వెంటనే జీజీహెచ్కు ఆధునాతన యంత్ర పరికరాలను కేటాయించిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు జిల్లా ప్రజల తరపున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత, డీఎంహెచ్వో సుదర్శనం, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర, మానసిక వైద్యనిపుణుడు విశాల్, కార్పొరేటర్ సుధ పాల్గొన్నారు.