Pitlam | కామారెడ్డి, ఆగస్టు 6 : ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు చిరస్మరణీయమని పిట్లం తహసీల్దార్ మహేందర్ అన్నారు. పిట్లం తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మహేందర్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మేధోబలాన్ని అందించిన మహనీయుడు అని కొనియాడారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశవ్యాప్తంగా చాటి చెప్పి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. నిరాడంబర జీవనం, నిజాయితీ, నిబద్ధతతో సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.