కోటగిరి, డిసెంబర్ 6 : మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో భాగంగానే చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సేవలను మెరుగుపర్చేందుకు ఎప్పటికప్పుడు చర్య లు తీసుకుంటున్నారు. నిర్వహణలో లోపాలు లేకుండా పర్యవేక్షణ కోసం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలుపై పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా పోషణ్ ట్రాకర్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల వివరాలు, ఆయా కేంద్రాల్లో నమోదైన చిన్నారులు, గర్భిణులు, బాలింతల వివరాలు యాప్లో నిక్షిప్తం చేశారు.
1500 అంగన్వాడీ కేంద్రాలు..
జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల ద్వారా అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో1500 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 1365, మిగత 135 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా ఆరేండ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. 0-6 నెలల చిన్నారులు 12,267 మంది, 7నెలల నుంచి ఏడాదిలోపు వారు 14618, 1-6 ఏండ్లలోపు పిల్లలు 49,122 మంది ఉన్నారు. వీరితోపాటు గర్భిణులు-15,978, బాలింతలు11,886 మంది ఉండగా వారికి సంపూర్ణ భోజనం పెడుతున్నారు. మూడేండ్లు పైబడిన పిల్లలకు ఆటా పాటలతో కూడిన విద్యను బోధిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రోజువారీగా వివరాలను ఫోన్లోని పోషణ్ ట్రాకర్ యాప్లో నమోదు చేస్తున్నారు.
ట్రాకర్ నమోదు వివరాలు..
బాలింతలు, గర్భిణుల వివరాలు నమోదు చేస్తారు.
0-6 నెలలు, ఆరు నెలల నుంచి మూడేండ్లు, 3-6 ఏండ్లలోపు చిన్నారుల వివరాలను అప్లోడ్ చేస్తున్నారు.
కిశోర బాలికల సమాచారాన్ని సైతం ప్రతీనెల అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
ప్రతీనెల 1,2,3, తేదీల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఎత్తు బరువు చూసి ఆ వివరాలు యాప్లో నమోదు చేస్తారు.
మూడు నెలలకోసారి ఎదుగుదల(గ్రోత్) తీరును నమోదు చేస్తారు. తద్వారా చిన్నారుల ఎదుగుదలవో ఏమైనా తేడా ఉంటే గుర్తించేందుకు వీలుంటుంది.
జిల్లా వివరాలు..
ప్రాజెక్టులు – 5
అంగన్వాడీ కేంద్రాలు- 1500
మినీ అంగన్వాడీ కేంద్రాలు- 135
0-6 నెలల చిన్నారులు 12,267
7 నెలల నుంచి ఏడాది వయసు వారు 14618
1-6 ఏండ్ల చిన్నారులు 49122
కార్యాలయం నుంచే పర్యవేక్షణ..
పోషణ్ ట్రాకర్ యాప్ అందుబాటులోకి రావడంతో అంగన్వాడీ కేంద్రాల వారీగా చిన్నారులు, గర్భిణులు, బాలింతల పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు ఆరోగ్య సలహాలు, అదనపు పౌష్టికాహారం అందించేందుకు వీలు ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరును తెలుసుకుంటున్నారు. సరుకులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
-వినోద, సీడీపీవో బోధన్