జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
మాస్క్ ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా
కొవిడ్-19 నియంత్రణపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 14: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత జిల్లాలో అధికంగా ఉంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ప్రజలు మార్కెట్లు, రద్దీ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో మాస్క్ ధరించకుండానే సంచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ, అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా కొవిడ్ నియంత్రణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందుగా ప్రజలకు మాస్క్ ధరించేలా అవగాహన కల్పించాలని, పట్టించుకోని వారిపై కొరడా ఝుళిపించడానికి పోలీస్ శాఖ అధికారులు సిద్ధమయ్యారు.
అవగాహన.. ఆపై జరిమానా
నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో మాస్క్ ధరించాలని ఆయా పోలీసు స్టేషన్ల సీఐలు, ఎస్సైలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలోని ప్రధాన చౌరస్తాలు, మార్కెట్లు, గల్లీల్లో అవగాహనతోపాటు తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఇంటి నుంచి బయటికి వస్తే తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచిస్తున్నారు. గుంపులుగా నిల్చోరాదని, మాస్క్ ధరించని వారికి జరిమానా తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ జిల్లాలోని వివిధ వాణిజ్య వ్యాపార సముదాయల యాజమాన్యాలతో కొవిడ్ నియంత్రణపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. మాస్క్ ధరించిన వారిని మాత్రమే దుకాణాల్లోకి అనుమతించాలని, భౌతికదూరం పాటించేలా, శానిటైజర్ వాడేలా చూసుకోవాలని, కరోనా నిబంధనలు తెలియజేసే ఫ్లెక్సీలను దుకాణాల ఎదుట ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
కమిషనరేట్ పరిధిలో భారీగా కేసులు..
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పోలీసులు సత్వర చర్యలను చేపట్టారు. మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తునారు. నిజామాబాద్ టౌన్ పరిధిలోని రెండో, మూడో, నాల్గవ టౌన్ పరిధిలో మొత్తం 200 కేసులు, నిజామాబాద్ నార్త్ రూరల్ పరిధిలోని మాక్లూర్, ఐదోటౌన్, నవీపేట్ పరిధిలో 150 కేసులు, నిజామాబాద్ సౌత్ రూరల్ పరిధిలోని ఆరో టౌన్, నిజామాబాద్ రూరల్, మోపాల్ స్టేషన్ల పరిధిలో 68 కేసులు, నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో 48 కేసులు నమోదు చేశారు. బయటికి వచ్చేవారు తప్పకుండా మాస్క్ ధరించాలని లేనిపక్షంలో రూ.వేయి జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు నిజామాబాద్ పోలీసులు.