ధర్పల్లి/ కోటగిరి/ చందూర్/ సిరికొండ, మే 2 : ధర్పల్లి, కోటగిరి, చందూరు మండలాల్లో శని, ఆదివారాల్లో కురిసిన అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది! చేతికొచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. జోరువానతో పంట నేలమట్టమైంది. ధాన్యంపై టార్పాలిన్లు కప్పేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు. సిరికొండ మండలంలోని రావుట్ల న్యావనంది, చీమన్పల్లి, నర్సింగ్పల్లి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఈదురు గాలులతో భారీ వర్షానికి విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. నర్సింగ్పల్లి గ్రామం రాంసింగ్తండాలో రెండు ఇండ్ల పైకప్పు రేకులు ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసింది.
నవీపేట మండలంలో వడగండ్ల వాన..
నవీపేట/ భీమ్గల్, మే 2: మండలంలోని బినోల, నాళేశ్వర్, తుంగిని, నిజాంపూర్, లింగాపూర్ తదితర గ్రామాల్లో ఆదివారం భారీ ఈదురుగాలులతో వడగండ్ల వాన కురిసింది. ధాన్యానికి తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్లపై తూకానికి సిద్ధంగా ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయయి. భీమ్గల్ మండలంలో పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. బడా భీమ్గల్, సికింద్రాపూర్, బెజ్జోర, గోన్గొప్పుల, రహత్నగర్ గ్రామాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రెంజల్లో మండలంలో తడిసిన ధాన్యం
రెంజల్, మే 2: మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి ఆర బెట్టిన ధాన్యం తడిసిపోయింది. రెంజల్లో ఈదురు గాలులకు మామిడి కాయలు నేలరాలాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ట్రాన్స్కో అధికారులు పునరుద్ధరించారు.
రెంజల్లో 1.6 మి.మీ వర్షపాతం
రెంజల్ మండలంలో శనివారం సాయంత్రం 1.6 మి.మీల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ రాంచందర్ తెలిపారు.
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అధికారులు
మోపాల్ (ఖలీల్వాడి), మే 2: మోపాల్ మండలం ముదక్పల్లి, మంచిప్ప గ్రామాల్లో శనివారం కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, ఆర్డీవో రవి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తడిసిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. సర్వే నిర్వహించి, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. ముదక్పల్లి సర్పంచ్ శంకర్, మంచిప్ప సర్పంచ్ సిద్దార్థ తదితరులు ఉన్నారు.
ఇందల్వాయిలో..
ఇందల్వాయి, మే 2 : మండల కేంద్రంతోపాటు మండలంలోని గన్నారం గ్రామంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి తడిసిన ధాన్యాన్ని తహసీల్దార్ రమేశ్ ఆదివారం పరిశీలించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే కొనుగోలు చేస్తామన్నారు. కరోనా నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. వారి వెంట సీఈవో రతన్, సిబ్బంది రవి, శ్రీధర్, వీఆర్ఏ, రైతులు తదితరులున్నారు.
మోర్తాడ్ మండలంలో..
మోర్తాడ్, మే 2: మండలంలోని తిమ్మాపూర్, మోర్తాడ్, పా లెం, దొన్కల్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ శ్రీధర్ ఆదివారం పరిశీలించారు. శనివారం పలుచోట్ల వర్షం కురిసినప్పటకీ ధాన్యం తడవలేదని వెంటనే గోదాములకు తరలించాలని సూచించారు.
మాక్లూర్ మండలంలో..
మాక్లూర్, మే2: మండల కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆర్డీవో రవికుమార్ ఆదివారం పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. తడిసిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డీసీవో సింహాచలం, సివిల్ సప్లయీస్ డీఎం అభిషేక్, తహసీల్దార్ ఆంజనేయులు ఉన్నారు.
కమ్మర్పల్లిలో గాలివాన భీభత్సం..
కమ్మర్పల్లి, మే 2 : కమ్మర్పల్లి మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. బలమైన ఈదురుగాలులతో కమ్మర్పల్లిలో పలు ఇండ్ల రేకుల పైకప్పులు ఎగిరిపోయాయి. బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి పక్క న ఓ వృక్షం నిలిపి ఉన్న డీసీఎం వాహనంపై కూలిపోయింది. సాయిబాబా కాలనీలో విద్యుత్ స్తంభం నేలకూలింది.