డిచ్పల్లి, నవంబర్ 29 : ప్రపంచంలోనే దూసుకుపోతున్న ఐటీ రంగంతో రసాయన శాస్త్ర విభాగం పోటీ పడుతున్నదని తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్గుప్తా అన్నారు. మండలకేంద్రంలోని ప్రధాన క్యాంపస్ రసాయన శాస్త్ర విభాగంలో డాక్టర్ బాలకిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ‘బయో ఆర్గానిక్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ’ జాతీయ సదస్సును మంగళవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా వీసీ హాజరై మాట్లాడారు. రసాయన శాస్త్ర విభాగానికి చెందిన విద్యార్థులు వివిధ కంపెనీల్లో మంచి జీతభత్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. బయో ఆర్గానిక్, మెడిసినల్ కెమిస్ట్రీలో అధునాతన మందులు తయారవుతున్నాయని చెప్పారు. భయంకరమైన కరోనాను ఎదుర్కొనేందుకు రసాయన శాస్త్రవేత్తలే టీకాలు తయారు చేశారని గుర్తుచేశారు. కీనోట్ స్పీకర్ ప్రొఫెసర్ మోనాలీసా ముఖర్జీ మాట్లాడుతూ.. కెమిస్ట్రీ, బయోలాజీ మధ్య ఉన్న సంబంధంతో ఉత్పత్తయ్యే మందులు క్యాన్సర్, టీబీ రోగాల నివారణకు ఉపయోగపడతాయని తెలిపారు. సదస్సులో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విద్యావర్ధిని, ప్రిన్సిపాల్ ఆరతి, ప్రొఫెసర్లు అమృత, శంకరయ్య, రాము, శ్రీనివాస్, లింగయ్య, అధ్యాపకులు నాగరాజు, సాయిలు, రాజేశ్వరి, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.