బీర్కూర్/బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 27 : బాన్సువాడ మండల పరిధిలో ఇటీవల ప్రారంభమైన బీఎస్సీ నర్సింగ్ కళాశాల కోసం నూతన భవనాన్ని నిర్మించేందుకు ఈ నెల 29న శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హాజరై భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు భవన నిర్మాణానికి గుర్తించిన స్థలంతోపాటు మంత్రి పర్యటన ఏర్పాట్లను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం పరిశీలించారు. శిలాఫలకం, సభాస్థలి నిర్వహణకు అవసరమైన సూచనలను చేశారు. ఆర్అండ్బీ అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
చదువుల హబ్గా బాన్సువాడ..
బాన్సువాడ నియోజకవర్గంలో విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ విద్యాయాలు, దవాఖానలు నిర్మించడంతో నేడు విద్య, వైద్య రంగానికి హబ్గా మారిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీరాం నారాయణ్ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసి ఉద్యోగ మేళాను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ జాబ్మేళాలో 15 మల్టీనేషనల్, కార్పొరేట్ రంగాలకు చెందిన కంపెనీలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. జాబ్మేళా ఏర్పాటు చేయడంతో అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉన్నత లక్ష్యాలను సాధించగలుగుతారని అన్నారు.
ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారని ప్రశంసించారు. బాన్సువాడలో ఇటీవలే బీఎస్సీ నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని.. ఉద్యోగార్థులు కష్టపడి కొలువులు సాధించాలన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని యువత కోసం బాన్సువాడ, రుద్రూర్లో ఉచిత భోజన సదుపాయంతో కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు స్పీకర్ తెలిపారు.