Farmers | వ్యవసాయం అంటేనే ఆటుపోట్లమయం. లాభదాయకత అనిశ్చతం. ఆరుగాలం కష్టానికి వచ్చే ప్రతిఫలానికి గ్యారంటీ ఉండదు. సాగు సవాళ్లలోనూ ఆశల వసంతాలు దాగి ఉన్నాయని నమ్మి వ్యవసాయంలోకి అడుగుపెట్టేవారు సైతం లేకపోలేదు. ఈ కోవకు చెందిన వారే నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలానికి చెందిన రైతులు. కాలానికి అనుగుణంగా ఆరుతడి పంటలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.
మాక్లూర్, ఫిబ్రవరి 23: మాక్లూర్ మండలంతోపాటు మాదాపూర్ గ్రామానికి చెందిన రైతులు మార్కెట్లో డిమాండ్ మేరకు పూల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వివిధ కాలాల్లో వచ్చే శుభకార్యాలను దృష్టిలో పెట్టుకొని పంటలు చేతికందేలా సాగుచేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. అందులో భాగంగానే బంతిపూలు, గలాండా, చాందినీ పూల తోటల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు మాదాపూర్ గ్రామానికి చెందిన యువ రైతులు శ్రీనివాస్రావు, శ్రీకాంత్. రకరకాల పూలతోటలను సాగు చేస్తుండగా మాదాపూర్, గుత్ప,రామచంద్రాపల్లి గ్రామాలకు చెందిన మరికొందరు రైతులు బంతిపూల తోటలను సాగుచేస్తున్నారు. తక్కువ నీటి వినియోగంతోపాటు అనుకూలంగా లేని ఎర్రమట్టి నేలల్లో ఆరుతడి పంటలు పండిస్తూనే బంతిపూల తోటలను పెంచుతూ అధిక లాభాలను పొందవచ్చనే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కౌలుకు తీసుకున్న ఎకరంలోనే బంతి, గలాండా, చాందినీ పూల తోటలను పెంచి ఆర్మూర్, నిజామాబాద్, నందిపేట్ కేంద్రాల్లోని మార్కెట్లకు తరలిస్తున్నాడు శ్రీనివాస్రావు.
తన వ్యవసాయ భూమి పావు ఎకరంలో గలాండా పూలు సాగుచేస్తూ జిల్లా కేంద్రానికి పంపుతున్నాడు శ్రీకాంత్. మహారాష్ట్రలోని నాందెడ్, ముథ్కెడ్, కర్ణాటక, బెంగుళూర్, ఆంధ్రాలోని మదనపల్లి నుంచి గలాండా, చాందీని నారు తీసుకవచ్చి తోటలను పెంచుతున్నారు. అర ఎకరానికి రూ.20వేలతో నారు, దుక్కి, కూలీలకు ఖర్చు అవుతాయన్నారు. నారు వేసిన అనంతరం 2నెలలపాటు మొక్కలు పెరిగే వరకు మాత్రమే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అనంతరం మూడు నెలల్లో పూలు కోతకు వస్తాయని, నీటి పారకం ఎక్కువ మొత్తంలో ఉండకపోగా, గాలి, వర్షం, వేడి, వాతావరణ పరిస్థితులను తట్టుకోనే పంట ఇదొక్కటే కావడం విశేషం. బంతి వారానికోసారి, చాందినీ రెండు వారాలకు 3సార్లు, షిర్డీ బంతి, బంతి వారానికి రెండుసార్లు కోతకు వస్తాయి. గలాండ ,చాందీని కిలోకు రూ.50-60 ధర పలుకుతుంది. నల్లరేగడి నేలల్లో సైతం పూలు సాగు చేయవచ్చు. నీటి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. వారానికి రెండు సార్లు నీటి పారకం చేస్తే చాలు. మార్కెట్లో ధరను బట్టి రోజుకు వెయ్యి నుంచి రూ.1500 వరకు ఆదాయం వస్తుంది. పండుగల సమయంలో ఆదాయం రెట్టింపు వచ్చే అవకాశం ఉంటుంది. ఎకరానికి 40వేలు ఖర్చు చేస్తే లక్షకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
పూలకు సీజన్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఒకసారి సాగు చేస్తే కోత పూర్తి అయ్యేంత వరకు ఇబ్బందులుండవు. పూలు కోసేందుకు కూలీలు దొరికితే చాలు. రసాయన మందుల వాడకం ఉండదు. నీటి అవసరం అంతకన్నా తక్కువ. చాలా సార్లు నేను సాగు చేసే పూల తోటలను వ్యవసాయాధికారులు చూసి ఇతర మండలాలకు రైతులకు చూపించారు. ఎఫ్ఎం రేడియోలో సైతం నేను సాగుచేసే విధానంపై రైతులకు వివరించాను. ఉద్యానవన శాఖ ద్వారా సబ్సిడీ ఇస్తే నాలాంటి కౌలు రైతులకు మేలు జరుగుతుంది.
– శ్రీనివాస్రావు, రైతు, మాదాపూర్
తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు. నేను ఇంటర్మీడియట్ వరకు చదివాను. సొంతంగా ఉన్న 12 గుంటల వ్యవసాయ భూమిలో పూలను సాగు చేస్తూ లాభాలు పొందుతున్నా. పూల సాగుకు పురు గు మందుల అవసరం ఉండదు. కొంత మేరకు మాత్రమే 20-20 మందు వేస్తే సరిపోతుంది. కుటుంబసభ్యుల సహకారంతో పూలు కోయడంతో కూలీల కొరత ఉండదు. పూలసాగులో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. మూడు నెలల్లోనే పెట్టుబడికి మూడురెట్ల ఆదాయం వస్తుంది.
– శ్రీకాంత్, రైతు, మాదాపూర్