Hanmanth Shinde | పెద్ద కొడపగల్, ఆగస్టు 29 : కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్న సమరభేరి కార్యక్రమాలపై బీఆర్ఎస్ జుక్కల్ నియోజకవర్గ స్థాయి నాయకుల సన్నాహక సమావేశం పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో విఫలమైందని విమర్శించారు. ప్రజలను నమ్మించి ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చిన అనంతరం ఇచ్చిన హామీలను విస్మరించడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొని గ్రామగ్రామాన ప్రజలను కలవాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటిలో అమలైనవి, అమలు కానివి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల ముందు ప్రశ్నలు ఉంచి, హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా ప్రజలకు వాస్తవాలను వివరించే కార్యక్రమంగా నిర్వహించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో వీజీ గౌడ్, జుక్కల్ నియోజకవర్గ సర్ ప్రోగ్రాం ఇన్చార్జి భిక్షపతి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ దపెదర్ రాజు, నియోజకవర్గ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.